తెలంగాణ

telangana

By

Published : Nov 30, 2019, 3:47 PM IST

Updated : Nov 30, 2019, 4:28 PM IST

ETV Bharat / bharat

బలపరీక్షలో నెగ్గిన ఉద్ధవ్​ సర్కారు.. సభ నుంచి భాజపా వాకౌట్​

శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే నేతృత్వంలో ఏర్పాటైన ‘మహా వికాస్‌ అఘాడీ’ సంకీర్ణ ప్రభుత్వం విశ్వాస పరీక్షలో నెగ్గింది. మొత్తం 288 సీట్లు ఉన్న మహారాష్ట్ర అసెంబ్లీలో మెజార్టీకి కావాల్సిన మ్యాజిక్‌ ఫిగర్‌ 145 కాగా.. ఉద్ధవ్‌ సర్కార్‌కు 169 ఓట్లు వచ్చాయి.

Uddhav Thackeray
బల పరీక్షలో 'మహా వికాస్​ అఘాడీ' ప్రభుత్వం విజయం

మహారాష్ట్రలో శివసేన, కాంగ్రెస్‌, ఎన్సీపీ నేతృత్వంలో కొలువుతీరిన 'మహా వికాస్‌ అఘాడీ' కూటమి ప్రభుత్వం విశ్వాస పరీక్షలో విజయం సాధించింది. బలపరీక్ష కోసం మహారాష్ట్ర శాసనసభ ప్రత్యేకంగా సమావేశం కాగా, బహిరంగ ఓటింగ్‌ నిర్వహించారు. 288 మంది సభ్యులు గల మహారాష్ట్ర శాసనసభలో మెజార్టీ నిరూపణకు 144 మంది సభ్యుల బలం అవసరం కాగా... మూడు పార్టీల కూటమి 169 ఓట్లు సాధించింది.

బల పరీక్ష తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు కాంగ్రెస్​ నేత అశోక్​ చవాన్​. ప్రభుత్వాన్ని శివసేన నేత సునీల్​ ప్రభు, ఎన్సీపీ నేత నవాబ్​ మాలిక్​ బలపరిచారు. ఈ క్రమంలో ప్రోటెం స్పీకర్​ దిలీప్‌ వాల్‌సే పాటిల్​ ఓటింగ్​ నిర్వహించారు.

సర్కార్​కు మద్దతుగా 169 మంది ఎమ్మెల్యేలు ఓటు వేశారు. ఓటింగ్​లో పాల్గొన్న ఎమ్మెల్యేలను లెక్కించారు స్పీకర్​. అనంతరం పరీక్షలో ప్రభుత్వం నెగ్గినట్లు ప్రకటించారు​. బల పరీక్షలో ఏ పార్టీకీ మద్దతుగా నిలవకుండా.. నలుగురు ఎమ్మెల్యేలు తటస్థంగా ఉన్నారు.

భాజపా సభ్యులు లేకుండానే మహారాష్ట్ర అసెంబ్లీలో బల పరీక్ష నిర్వహించారు.

భాజపా వాకౌట్​..

బల పరీక్ష తీర్మానం ప్రవేశపెట్టిన క్రమంలో మాజీ ముఖ్యమంత్రి, భాజపా నేత దేవేంద్ర ఫడణవీస్..​ ప్రభుత్వంపై విమర్శలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా సభను నిర్వహిస్తున్నారని ఆరోపిస్తూ.. ఆయనతో పాటు భాజపా నేతలంతా సభనుంచి వాకౌట్​ చేశారు. వందేమాతరం పాడకుండానే సభ ప్రారంభించడమేంటని ప్రశ్నించారు ఫడణవీస్​. ఎన్సీపీ నేత దిలీప్‌ వాల్‌సేను ప్రోటెం స్పీకర్​గా ఎన్నుకోవటాన్ని తప్పుపట్టారు.

ఇదీ చూడండి: 'మహా 'ఉపముఖ్యమంత్రి'పై ఇంకా నిర్ణయం తీసుకోలేదు'

Last Updated : Nov 30, 2019, 4:28 PM IST

ABOUT THE AUTHOR

...view details