తెలంగాణ

telangana

By

Published : May 3, 2020, 11:20 PM IST

ETV Bharat / bharat

కరోనాతో జీవించేందుకు సిద్ధమవ్వాలి : కేజ్రీవాల్​

దిల్లీలో కంటైన్​మెంట్​ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశల వారిగా లాక్​డౌన్​ను ఎత్తివేయనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​ వెల్లడించారు. లాక్​డౌన్​ పొడిగించే పరిస్థితి లేదని, ఎక్కువ కాలం కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని అన్నారు.

Time has come to re-open Delhi; people will have to be ready to live with coronavirus: Kejriwal
దిల్లీలో లాక్‌డౌన్ సడలింపు

దేశ రాజధాని దిల్లీలో కంటైన్‌మెంట్ జోన్లు మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లో దశల వారిగా లాక్‌డౌన్‌ తొలగించనున్నట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు. మరింత కాలం లాక్‌డౌన్‌ పొడిగించే పరిస్థితి లేదని, గతేడాది ఏప్రిల్ నెలలో రూ.3500 కోట్ల ఉన్న ఆర్థిక వ్యవస్థ ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.300 కోట్లకు పడిపోయిందని తెలిపారు. ఎక్కువ కాలం లాక్‌డౌన్‌ కొనసాగితే ఆర్థిక పరిస్థితి మరింత దిగజారే ప్రమాదం ఉందని...ప్రభుత్వం పనిచేయడం కూడా కష్టమవుతుందని అన్నారు. అందుకోసమే లాక్‌డౌన్‌ నిబంధనలు సడలించనున్నట్లు తెలిపారు. కరోనా నియంత్రణకు మార్చి 24న లాక్‌డౌన్‌ విధించాలన్న కేంద్రం నిర్ణయం ఎంతో ముఖ్యమైందని, ఒక వేళ దేశంలో లాక్‌డౌన్‌ విధించకుంటే పరిస్థితి మరింత ప్రమాదకరస్థాయిలో ఉండేదని అన్నారు. కంటైన్‌మెంట్ జోన్లు పూర్తిగా మూసేయాలని, గ్రీన్‌జోన్‌ ప్రాంతాల్లో దుకాణాలు సరి, బేసి విధానంలో తెరిచేందుకు అనుమతించాలని కేంద్రాన్ని కోరుతున్నట్లు తెలిపారు.

"దిల్లీని తిరిగి తెరిచేందుకు సమయం ఆసన్నమైంది. మనం కరోనాతో కలిసి జీవించేందకు సిద్ధమవ్వాలి. లాక్‌డౌన్‌ ముగిసిన తర్వాత, కేసులు నమోదయినా ఆ పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నాం" అని తెలిపారు.

ప్రైవేటు సంస్థలు 33 శాతం ఉద్యోగులతో కార్యకలాపాలు సాగించవచ్చు తెలిపారు. ప్రముఖ మార్కెట్ ప్రాంతాలైన కన్నాట్ ప్లేస్‌, ఖాన్‌ మార్కెట్ ఏరియాల్లో నిత్యావసర దుకాణాలు తెరిచేందుకు అనుమతిస్తున్నట్లు ప్రకటించారు. అలానే చేతి వృత్తులవారు తమ పనులు చేసుకోవచ్చని తెలిపారు. ఈ-కామర్స్‌ సంస్థలకు నిత్యావసరాల డెలివరికీ మాత్రమే అనుమతిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ రంగ రవాణా మూసి ఉంటుందని, ప్రైవేటు వాహనాదారులు డ్రైవరు కాకుండా మరో ఇద్దరితో ప్రయాణించవచ్చని తెలిపారు. విద్యాసంస్థలు, ప్రభుత్వ రవాణా, మాల్స్‌, మార్కెట్లు, సినిమాహాళ్లు, జిమ్‌లు, స్విమ్మింగ్ పూల్స్, ప్రార్థన స్థలాలు ఎప్పటిలానే మూసి ఉంచాలని ఆదేశించారు.

బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మిన వారిపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుందని తెలిపారు. సామాజిక దూరం పాటించాలనే నిబంధనలకు అనుగుణంగా వివాహాలకు 50 మంది, అంతిమ సంస్కారాలకు 20 మంది కంటే ఎక్కువ మందిని అనుమతించేది లేదని అన్నారు. 65 ఏళ్లు పైబడిన వారు, 10 ఏళ్లలోపు వారు, గర్భిణీ స్త్రీలు ఇంటి నుంచి బయటకు రాకూదని సూచించారు. ఇప్పటి వరకు దిల్లీలో 4,122 కరోనా కేసులు నమోదయ్యాయి. వీరిలో 1,256 మంది కోలుకోగా, 64 మంది మృతి చెందారు.

ABOUT THE AUTHOR

...view details