తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ! - దొంగలేఖ

తమిళనాడు కడలూర్​ జిల్లా నైవేలీలో ఓ దొంగ ప్రవర్తన దుకాణ యజమానిని విస్తుపోయేలా చేసింది. షాపులో నగదు ఉంచకుండా తీసుకెళ్లిపోయినందుకు ఆగ్రహించి యజమానికి లేఖ రాశాడు. కోపంతో దుకాణాన్ని చిందరవందర చేశాడు.

ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!

By

Published : Aug 3, 2019, 4:14 PM IST

Updated : Aug 4, 2019, 11:52 AM IST

ఇట్లు.. మీ షాపులో చోరీకి యత్నించిన దొంగ!
కష్టాలకోర్చి కిరాణా దుకాణంలోకి వెళ్లిన ఆ దొంగకు నిరాశే మిగిలింది. ఆశపడి వస్తే షాపు యజమాని రూపాయి మిగల్చకుండా పట్టుకెళ్లి పోయాడని కలత చెందాడు. ఎంతో కష్టపడి ప్లాన్​ చేసిన దొంగతనం విఫలం చెంది... నీకు ఇది న్యాయమా అంటూ ఆక్రోశించాడు. ఇదే నీకు తగిన శిక్ష అంటూ దుకాణంలో విధ్వంసం సృష్టించి, షాపు యజమానికి ఉత్తరం రాశాడు.

తమిళనాడు కడలూరు జిల్లా నైవేలీలో జరిగింది ఈ సంఘటన. షాపు యజమాని జయరాజ్​ రోజువారీగానే దుకాణం కట్టేసి రాత్రి ఇంటికి వెళ్లిపోయాడు. మరుసటి రోజు ఉదయాన్నే షాపు తెరచి చూసి షాక్​ అయ్యాడు. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. నిర్ఘాంతపోయిన అతగాడు కాసేపటికి తేరుకుని దుకాణంలోకి దొంగలు పడ్డారని గ్రహించాడు. దొంగిలించిన వస్తువులను గుర్తించేందుకు పరిశీలిస్తున్న సమయంలో తన గల్లా పెట్టె దగ్గర బిల్లు కాగితంపై రాసిన ఓ ఉత్తరం దొరికింది.

దొంగ రాయునది ఏమనగా..

కౌంటర్​ వద్ద దొరికిన ఆ కాగితాన్ని చదివాక దొంగే ఆ లేఖ రాశాడని జయరాజ్​కు అర్థమైంది.

"నేను నా ప్రాణాలను పణంగా పెట్టి నీ షాపులో దొంగతనం చేయడానికి వచ్చాను. ఒక్క రూపాయి వదలకుండా గల్లా పెట్టె ఖాళీ చేసుకెళ్లడం నీకు న్యాయమేనా? కౌంటర్​లో కొంతైనా డబ్బు వదలకుండా నువ్వు నన్ను మోసం చేశావు. అందుకే నీకు ఈ శిక్ష!"
- దొంగ రాసిన లేఖ

దొంగ లేఖతో ఖంగుతిన్న జయరాజ్... పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ క్రేజీ దొంగను పట్టుకునేందుకు పోలీసులు వెతుకులాట ప్రారంభించారు.

ఇదీ చూడండి:ఇంట్లో కుమారుడి మృతదేహంతో 3 రోజులు...

Last Updated : Aug 4, 2019, 11:52 AM IST

ABOUT THE AUTHOR

...view details