అది అయోధ్యలోని కరసేవక్పురం. మూడు దశాబ్దాలుగా అక్కడి శిల్పులు తదేక దీక్షగా ఒకటే పని చేస్తున్నారు. వాళ్ల చేతుల్లోని ఉలులు.. పెద్ద పెద్ద శిలలను అందమైన శిల్పాలుగా మలుస్తున్నాయి. స్తంభాలు, పైకప్పు, మెట్లు.. ఇలా ఆలయంలోని వివిధ భాగాలకు కావల్సిన వాటన్నింటినీ సిద్ధం చేస్తున్నారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి శిలలను సేకరించి అయోధ్యలో రామాలయ నిర్మాణం కోసం రూపుదిద్దుతున్నారు.
1989 నుంచి ఇప్పటివరకు ఒక్కరోజూ అక్కడి శిల్పులు విశ్రమించలేదు. ఫలితంగా ఇప్పటికే అక్కడ 1.25 లక్షల ఘనపుటడుగుల రాళ్లను చెక్కారు. వీటితో ఆలయంలో ఒక అంతస్తు కట్టేయొచ్చు. రామజన్మభూమి న్యాస్ నేతృత్వంలో వందలాది మంది శిల్పులు అవిశ్రాంతంగా పనిచేస్తున్నారు.