తెలంగాణ

telangana

By

Published : Jun 17, 2020, 8:10 AM IST

ETV Bharat / bharat

భారత్​ చైనా మధ్య వివాదాస్పద ప్రాంతాలివే

దశాబ్దాలుగా భారత్​ సరిహద్దులోని అనేక ప్రాంతాలను చైనా తనవిగా చెబుతూ ఆక్రమణలకు పాల్పడుతోంది. వాస్తవాధీన రేఖను అతిక్రమిస్తూ ఒప్పందాలకు తూట్లు పొడుస్తోంది. ఇప్పటికే అక్సాయిచిన్​లో పాగా వేసింది. అరుణాచల్​ ప్రదేశ్​తో పాటు చాలా ప్రాంతాలపై వివాదాన్ని సృష్టిస్తోంది.

india china
భారత్​ చైనా

వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి ముందుకు చొచ్చుకువస్తూ.. కయ్యానికి కాలు దువ్వుతోంది చైనా. ఎల్‌ఏసీ వెంబడి తూర్పు, పశ్చిమ సెక్టార్లలోని మొత్తం 8 సరిహద్దు ప్రాంతాలు తమవేనని చైనా వాదిస్తోంది. లద్ధాఖ్​ నుంచి మొదలుకొని అరుణాచల్​ ప్రదేశ్​ వరకు చైనా వివాదాలు రాజేస్తోన్న ప్రాంతాలను ఒకసారి పరిశీలిద్దాం..

వాస్తవాధీన రేఖ..

భారత్‌-చైనాల మధ్యనున్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) పొడవు 3,440 కి.మీ. ఇది తూర్పు, మధ్య, పశ్చిమ సెక్టార్లుగా విభజితమై ఉంది. అయితే చాలా చోట్ల ఎల్‌ఏసీ కచ్చితంగా ఎక్కడిదాకా అన్న నిర్ధరణల్లేవు. అందువల్ల వివిధ చోట్ల భూభాగం తమదేనంటూ చైనా వివాదాలకు దిగుతోంది. ముఖ్యంగా పశ్చిమ సెక్టార్లో ఎప్పుడూ ఉద్రిక్తతలు, చొరబాట్లు చోటుచేసుకుంటూనే ఉన్నాయి.

భారత్ చైనా సరిహద్దు (ఎరుపు- చైనా తనవిగా చెబుతున్న భారత భూభాగాలు)

పశ్చిమ సెక్టార్‌ (1570 కి.మీ.)

కారకోరం కనుమ వాయవ్య ప్రాంతం నుంచి దెమ్‌చోక్‌ దాకా వ్యాపించిన భూభాగం. ఎక్కువగా లద్దాఖ్‌ సరిహద్దు ప్రాంతమిది.

  • అక్సాయిచిన్‌: రెండు దేశాల మధ్య అత్యంత వివాదాస్పద భూభాగం ఇది. 38 వేల చ.కి.మీ.లు విస్తరించి ఉంది. ఇది తమ లద్దాఖ్‌లోని భాగమని భారత్‌ చెబుతోంది. అయితే 1950ల నుంచీ ఇది తమ భూభాగమేనని వాదిస్తున్న చైనా దీన్ని తన ఆక్రమణలో ఉంచుకుంది. 1962లో అక్సాయిచిన్‌లో భూభాగం గుండా టిబెట్‌లోని ఝింజియాంగ్‌కు చైనా హైవేను నిర్మించింది.
  • దెమ్‌చోక్‌:లద్దాఖ్‌లోని లేహ్‌లో ఉన్న ఈ గ్రామం భారత సైనిక స్థావరం. ఇక్కడ తరచూ చైనా బలగాలతో ఘర్షణలు జరుగుతుంటాయి.

తూర్పు సెక్టార్‌ (1325 కి.మీ., మధ్యలో భూటాన్‌ను మినహాయించి)

సిక్కిం నుంచి మయన్మార్‌ సరిహద్దు దాకా వ్యాపించి ఉంది. ఈ సెక్టార్లో ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోనే వివాదాస్పద ప్రాంతాలు ఎక్కువగా ఉన్నాయి. అయితే అరుణాచల్‌ మొత్తం తమదేనని చైనా వాదిస్తోంది.

  • అసాఫిలా:ఎగువ సుబన్‌సరి డివిజన్‌లో దాదాపు 100 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించిన దట్టమైన అటవీ, పర్వత ప్రాంతమిది. 1962 యుద్ధంలో చైనా ప్రధానంగా ఇక్కడ్నుంచే భారత్‌పై దాడికి దిగింది. ఈ ప్రాంతం భారత్‌, చైనాల్లో ఎవరి ఆధీనంలోనూ లేదు.
  • లోంగ్జూ:ఎగువ సుబన్‌సిరి డివిజన్‌లో ఉంది. టిబెట్‌లోని చైనా సైనిక పోస్టులకు అభిముఖంగా ఈ ప్రాంతం ఉంది. 1959లో చైనా పీపుల్స్‌ లిబరేషన్‌ ఆర్మీ(పీఎల్‌ఏ)కి, అస్సాం రైఫిల్స్‌కు మధ్య మొట్టమొదటి ఘర్షణ ఇక్కడే చోటుచేసుకుంది. లోంగ్జూను భారత్‌ తిరిగి స్వాధీనం చేసుకోలేదు. అక్కడికి 10 కి.మీల దూరంలో మాజా వద్ద ఒక సైనిక పోస్టును మాత్రం ఏర్పాటుచేసింది.
  • నమ్కా చూ(నదీ) లోయ: అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్‌ పట్టణానికి 60 కి.మీ. దూరంలో ఉంది. 1962లో భారత్‌-చైనాల మధ్య యుద్ధం ఇక్కడే ప్రారంభమైంది.
  • సుమ్‌దోరాంగ్‌ చూ(తవాంగ్‌ జిల్లా): నమ్కా చూకు తూర్పున ఉన్న నదీ పరీవాహక ప్రాంతమిది. 1986లో చైనా సైన్యం దీన్ని ఆక్రమించింది.
  • యాంగ్జే(తవాంగ్‌ జిల్లా):సుమ్‌దోరాంగ్‌ చూ దురాక్రమణకు ప్రతీకారంగా భారత సైన్యం 1986లో దీన్ని ఆక్రమించింది.

మధ్య సెక్టార్‌ (545 కి.మీ.లు)

దెమ్‌చోక్‌ నుంచి నేపాల్‌ సరిహద్దు దాకా ఉన్న ప్రాంతం. హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌ సరిహద్దుల్లో ఉంది.

ఉత్తరాఖండ్‌లోని చమోలీ జిల్లాలో పచ్చికబయళ్లు ఈ ప్రాంతం పరిధిలోకి వస్తాయి. చైనా బలగాలు పలుమార్లు ఇక్కడ చొరబాట్లకు పాల్పడ్డాయి.

ప్యాంగాంగ్‌ సరస్సు

దీన్ని ప్యాంగాంగ్​ సో అని కూడా పిలుస్తారు. తూర్పు లద్దాఖ్‌లోని హిమాలయాల్లో సముద్ర మట్టానికి 14 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఇరుకైన సరస్సు ఇది. 135 కి.మీ. మేర వ్యాపించిన ఈ సరస్సు లేహ్‌కు 54 కి.మీ. దూరంలో ఉంది. 1962లో చైనా ప్రధాన యుద్ధాన్ని ఇక్కడి నుంచే చేసింది. ప్యాంగాంగ్ సరిహద్దు దాకా చైనా రోడ్లను నిర్మించింది. భారత్‌పై దాడికి దిగాలంటే చైనాకు సంబంధించినంతవరకు ఇది అత్యంత వ్యూహాత్మక ప్రాంతం.

ప్యాంగాంగ్ సరస్సు

గాల్వన్‌ లోయ

వివాదాస్పద అక్సాయిచిన్‌ నుంచి భారత్‌లోని లద్దాఖ్‌ దాకా గాల్వన్‌ నది ప్రవహిస్తుంది. 1962లో రెండు దేశాల మధ్య జరిగిన యుద్ధంలో ఈ నదీ లోయ ప్రాంతమూ కీలకమే. లద్దాఖీ గులాం రసూల్‌ గాల్వన్‌ పేరును ఈ లోయకు పెట్టారు. అక్సాయిచిన్‌ మొత్తం తమదేనని భారత్‌ వాదిస్తుంటే.. గాల్వన్‌ నది పశ్చిమంవైపు దాకా తమదేనని చైనా వాదిస్తోంది.

గాల్వన్ లోయ

దౌలత్‌ బేగ్‌ ఓల్డీ

అక్సాయిచిన్‌కు ఇది కూతవేటు దూరంలో ఉంది. ఇక్కడ భారతదేశానికి చెందిన రవాణా విమానం 2008లో దిగినపుడు చైనా గుర్రుమంది. ఇది భారత్‌కు చాలా వ్యూహాత్మక ప్రాంతం. 1962 యుద్ధం తర్వాతే రెండు దేశాల మధ్య ఇది వివాదాస్పద ప్రాంతంగా మారింది.

ABOUT THE AUTHOR

...view details