దేశ ప్రజలందరికీ సామాజిక, రాజకీయ న్యాయాన్ని చేరువ చేసే సదాశయంతో లిఖించుకున్న రాజ్యాంగం అమలులోకి వచ్చి నిన్నటికి డెబ్భైయ్యేళ్లు! నిబంధనలు, విధి నిషేధాలు, దిశానిర్దేశాలు, ఆశయాలు, ఆదర్శాలు, హితోక్తుల సమాహారమైన రాజ్యాంగం చూపిన బాటలో ఏడు దశాబ్దాల భారతావని ప్రస్థానాన్ని సమీక్షించుకోవడం నేటి అవసరం. ఒక దేశంగా ఏడు పదుల భారతావని ప్రస్థానంలో విజయాలను, వైఫల్యాలను, కీలక మైలు రాళ్లను, పాఠాలను, గుణపాఠాలను తరచి చూసుకోవడం తప్పనిసరి. రాజ్యాంగ నిర్మాతల ఆదర్శాలు, ఆకాంక్షల నేపథ్యంలో రాజ్యాంగ పనితీరు మదింపు కీలకం. భారత రాజ్యాంగం ఎదుర్కొన్నటువంటి సమస్యలు, సవాళ్లు బహుశా ప్రపంచంలో మరే దేశ రాజ్యాంగానికీ ఎదురై ఉండవు. అమల్లోకి వచ్చిన తొలి ఏడాదే రాజ్యాంగానికి సవరణలు అవసరపడ్డాయి.
ఆ తరవాత క్రమంగా వందకుపైగా సవరణలతో రాజ్యాంగాన్ని ఎప్పటికప్పుడు మార్చుకుంటూ వచ్చారు. భూ సంస్కరణలు; రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల పునర్వ్యవస్థీకరణ; ప్రాంతీయ అసమానతలను సరిదిద్దడం; ఆదేశిక సూత్రాల్లో ప్రవచించిన లక్ష్యాలను సాకారం చేసుకోవడం; కొన్ని రాష్ట్రాల్లో రాష్ట్రపతి పాలన విధించడం; ఎస్సీ, ఎస్టీ, బీసీ జాతీయ కమిషన్లకు రాజ్యాంగబద్ధత కల్పించడం; ఆస్తి హక్కును ప్రాథమిక హక్కుల జాబితానుంచి తొలగించి దానిని చట్టబద్ధ హక్కుగా గుర్తించడం; పౌరుల ప్రాథమిక విధులకు సంబంధించి కొత్త అధ్యాయాన్ని జతపరచడం; ఫిరాయింపుల నిరోధక చట్టం, జాతీయ జుడిషియల్ నియామక కమిషన్ ఏర్పాటు, జీఎస్టీ అమలు; ఆర్థికంగా వెనకబడిన వర్గాలకు 10 శాతం రిజర్వేషన్లు కల్పించడం వంటి అనేక కీలక సవరణలకు కాలానుగుణంగా రాజ్యాంగం వేదికగా మారింది.
అంబేడ్కర్ సూచనలు శిరోధార్యం
రాజకీయ ప్రజాస్వామ్య సాధనకోసం మాత్రమే కాకుండా సామాజిక ప్రజాస్వామిక సంస్కృతిని పాదుకొల్పడం కోసం కృషి చేయాలని; వ్యక్తి పూజకు తిలోదకాలు వదలాలని 1949, నవంబరు 25న రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పిలుపిచ్చారు. దేశ పురోగతి సాధనలో అసమాన త్యాగాలు చేసిన మహనీయులను స్మరించుకోవడం సహేతుకమే అయినప్పటికీ- ఆ ఆరాధన ఒక స్థాయిని దాటితే మూఢభక్తిగా పరిణమించే ప్రమాదం ఉంది. దానివల్ల అంతిమంగా వ్యవస్థలు పతనమై నియంతృత్వం కోరసాచే ప్రమాదం కొట్టిపారేయలేనిది. సామాజిక ప్రజాస్వామ్యమే పునాదిగా రాజకీయ ప్రజాస్వామ్యం శాఖోపశాఖలుగా విచ్చుకోవాలని ఆయన అభిలషించారు. కులాలు అన్న భావనే జాతి వ్యతిరేకమని స్పష్టం చేసిన అంబేడ్కర్, అంతరాలను అధిగమిస్తూ సవాళ్లను ఎదుర్కొంటూ భారతావని ఒక పరిపూర్ణ దేశంగా రూపుదాల్చాల్సి ఉందని ఆకాంక్షించారు. ఆ మహనీయుడి పలుకులే శిరోధార్యంగా భారతావని భవిష్యత్తును తీర్చిదిద్దుకోవాల్సి ఉంది.
గడచిన ఏడు దశాబ్దాల రాజ్యాంగ పరిణామ క్రమంలో రాజకీయ నేతలు అప్పుడప్పుడూ కట్టుతప్పిన ఉదాహరణలు కనిపిస్తాయి. ఏడో దశాబ్దం తొలినాళ్లనుంచి దేశంలో రాజకీయ నాయకత్వం అడపాదడపా నియంతృత్వం బాట తొక్కిన ఆనవాళ్లు పొడగడతాయి. గోలక్నాథ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ (1967) కేసులో పార్లమెంటుకు రాజ్యాంగాన్ని సవరించే హక్కు లేదని న్యాయస్థానం స్పష్టం చేసింది. ప్రాథమిక హక్కులు సహా రాజ్యాంగాన్ని సవరించే విషయంలో పార్లమెంటు సమున్నతాధికారాన్ని చాటిచెప్పేందుకు (1971లో తీసుకువచ్చిన 24వ రాజ్యాంగ సవరణ) ప్రయత్నించింది. అయితే మెజారిటీ తీర్పు ద్వారా సుప్రీం కోర్టు ధర్మాసనం ఒకవైపు ఆ రాజ్యాంగ సవరణకు మద్దతు పలుకుతూనే మరోవంక రాజ్యాంగ మౌలిక స్వరూపం, ప్రాథమిక హక్కులపై రాజ్యాంగ సవరణల ప్రభావం ఉండబోదని విస్పష్టంగా తేల్చిచెప్పింది.
ఫలితంగా 1973నుంచీ తలపెట్టిన ఏ రాజ్యాంగ సవరణకైనా ‘రాజ్యాంగ మౌలిక స్వరూపాన్ని మార్చరాదు’ అన్న సూత్రమే ప్రాతిపదికగా నిలుస్తోంది. ప్రధానమంత్రితోపాటు రాజ్యాంగ బద్ధ పదవుల్లోని వ్యక్తుల ఎన్నికలను న్యాయ సమీక్షకు అతీతంగా తీర్మానిస్తూ 39వ రాజ్యాంగ సవరణ తీసుకువచ్చారు. ఇందిరాగాంధీ వర్సెస్ రాజ్ నారాయణ్ (1975) కేసులో న్యాయస్థానం ఆ సవరణ రాజ్యాంగ మౌలిక స్వరూపానికి భిన్నంగా ఉందని, స్వేచ్ఛగా నిష్పాక్షికంగా ఎన్నికలు జరిగే వాతావరణాన్ని దెబ్బతీస్తోందని వ్యాఖ్యానించి దాన్ని కొట్టివేసింది. 42వ సవరణ ద్వారా కీలకమైన ప్రాథమిక విధులకు చేటు కల్పించడంతోపాటు, చట్టాల రూపకల్పనలో ప్రాథమిక హక్కుల కంటే ఆదేశిక సూత్రాలకే అధిక ప్రాధాన్యం ఇవ్వడం; సామ్యవాద, లౌకికవాద పదాలను చేరుస్తూ రాజ్యాంగ పీఠికను సవరించడం వంటి మార్పులు తీసుకువచ్చారు.
కాలానుగుణ సవరణలు
భారత ప్రజాస్వామ్య పరిణామ క్రమంలో 1985నాటి 52వ సవరణ కీలక ఘట్టం. ప్రజాప్రతినిధులు ఒక రాజకీయ పక్ష చిహ్నంపై గెలిచి మరో పార్టీలోకి దూకే పెడధోరణిని కట్టడి చేసేందుకు పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం తీసుకువచ్చారు. ఈ సవరణ చట్టంలోనే పార్టీల చీలికలు, విలీనాలకు సంబంధించి కొన్ని మినహాయింపులు ప్రతిపాదించడం గమనార్హం. ఎన్నికైన ప్రజా ప్రతినిధుల్లో మూడింట ఒకవంతు చీలిక గ్రూపుగా మారి ఇతర పార్టీలోకి మారే వెసులుబాటును 91వ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు. ఏదైనా ఒక పార్టీనుంచి మూడింట రెండొంతుల మంది చట్టసభ్యులు ఒక గ్రూపుగా మారి బయటికి వచ్చినప్పుడే దానికి గుర్తింపు ఇస్తూ 91వ సవరణ పట్టాలకెక్కింది.