తెలంగాణ

telangana

By

Published : Oct 18, 2020, 8:52 PM IST

ETV Bharat / bharat

థరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్-భాజపా మాటల యుద్ధం

పాకిస్థాన్ వేదికగా కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా మండిపడింది. పాకిస్థాన్​లో రాహుల్ గాంధీ పోటీ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించింది. మైనారిటీలపై వివక్ష చూపుతున్న పాకిస్థాన్​ గురించి ఎప్పుడైనా ప్రశ్నించారా అని వ్యాఖ్యానించింది. మరోవైపు భాజపా ఎప్పుడు అసలు విషయాన్ని పక్కనబెట్టి వాక్చాతుర్యంపైనే ఆధారపడుతుందని కాంగ్రెస్ తిప్పికొట్టింది.

Tharoor's remarks at Lahore event spark BJP-Cong spat
శశిథరూర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్-భాజపా మాటల యుద్ధం

లాహోర్ కార్యక్రమంలో ఎంపీ శశి థరూర్ చేసిన వ్యాఖ్యలపై భాజపా, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం మొదలైంది. మోదీ ప్రభుత్వం కరోనా నియంత్రణలో విఫలమైందని లాహోర్​ థింక్​ ఫెస్ట్​ ఆన్​లైన్ సమావేశంలో థరూర్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. కరోనా సమయంలో ముస్లింలపై వివక్ష గురించి ఆయన చేసిన ప్రసంగంపై భాజపా శ్రేణులు మండిపడుతున్నాయి.

పాకిస్థాన్​ వేదికపై భారత్​ వ్యతిరేక వ్యాఖ్యలు చేయడంపై భాజపా ప్రతినిధి సంబిత్ పాత్రా విస్మయం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని నమ్మలేకపోతున్నట్లు వ్యాఖ్యానించారు. దేశాన్ని ఆయన కించపరిచారని అన్నారు.

ఈ సందర్భంగా రాహుల్ గాంధీ లక్ష్యంగా సంబిత్ పాత్రా తీవ్ర విమర్శలు చేశారు. పాకిస్థాన్​ ఎన్నికల్లో రాహుల్ గాంధీ పోటీ చేయాలనుకుంటున్నారా అని ప్రశ్నించారు. చైనా, పాకిస్థాన్​లలో ఇప్పటికే రాహుల్ హీరో అని అన్నారు. రాహుల్​ను ఇక నుంచి రాహుల్​ లాహోరీగా పిలుస్తామని వ్యాఖ్యానించారు.

"ఇలాంటి విషయాలు పాకిస్థాన్ ఫోరంపై చర్చించాల్సిన అవసరం ఏం ఉంది? భారత్ లాంటి ప్రజాస్వామ్య దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. పాకిస్థాన్​లో మైనారిటీల పట్ల వివక్ష, హింసపై ప్రతిపక్ష పార్టీ సభ్యులు ఎప్పుడైనా ఆ దేశాన్ని ప్రశ్నించారా?"

-సంబిత్ పాత్రా, భాజపా ప్రతినిధి

భారత్​లో కరోనా నియంత్రణ పట్ల కేంద్ర ప్రభుత్వ చర్యలను ప్రశంసించారు పాత్రా. సరైన సమయంలోనే లాక్​డౌన్ విధించామని అన్నారు. ప్రపంచంలో అధిక రికవరీ రేటు, అత్యల్ప మరణాల రేటు భారత్​లోనే నమోదైందని గుర్తు చేశారు.

తప్పుబట్టిన కాంగ్రెస్

భాజపా వ్యాఖ్యలపై కాంగ్రెస్ ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ స్పందించారు. అధికార పార్టీ నుంచి ఇలాంటి స్పందన ప్రజాస్వామ్య స్థాయిని తగ్గిస్తాయని అన్నారు. భాజపా ఎప్పుడూ అసలైన విషయాన్ని పక్కనబెట్టి వాక్చాతుర్యంపైనే ఆధారపడుతుందని విమర్శించారు.

"ఏదైనా విషయంలో భారత్ వెనకబడి ఉందని ఎవరైనా మాట్లాడితే పాకిస్థాన్ తరపున ఎన్నికల్లో నిలబడాలని అనడం ఎగతాళి చేయడం అవుతుంది, అది ఓ ప్రజాస్వామ్య దేశంగా మనల్ని దిగజార్చుతుంది. ఇలాంటి స్పందనలు స్వల్పకాలికంగా ఉంటాయి. కానీ, విఫలమవుతున్న అంశాల్లో మీరు వ్యవహరించే తీరును ఇవి ప్రతిబింబిస్తాయి."

-అభిషేక్ సింఘ్వీ, కాంగ్రెస్ ప్రతినిధి

కరోనా నియంత్రణలో ప్రభుత్వం విఫలమైందని, మెరుగైన చర్యలు తీసుకోవాలని ఫిబ్రవరిలోనే రాహుల్ గాంధీ సూచించారని శశి థరూర్ పేర్కొన్నారు. లాహోర్ సమావేశంలో భాగంగా ఓ పాకిస్థాన్ పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు బదులుగా ఈ వ్యాఖ్యలు చేశారు.

ABOUT THE AUTHOR

...view details