జమ్ముకశ్మీర్లో ఉగ్రవాదుల ఏరివేతను భద్రతా బలగాలు ముమ్మరం చేశాయి. బుడ్గాం ప్రాంతంలోని కవూసా ఖలీసాలో ఓ ముష్కరుడిని సైన్యం మట్టుబెట్టింది. నిర్బంధ తనిఖీలు చేపట్టిన సైన్యంపై కాల్పులు జరిపిన ముష్కరుడు.. ఎదురుకాల్పుల్లో హతమయ్యాడు. సుక్నాగ్ నాలాలో మరో ఉగ్రవాది మృతదేహం లభ్యమైనట్లు అధికారులు తెలిపారు.
అరెస్ట్
కుప్వారా జిల్లా డ్రగ్ముల్లా ప్రాంతంలో రహదారిపై తనిఖీలు నిర్వహించిన బలగాలు.. జైషే మహ్మద్ ఉగ్రసంస్థకు చెందిన ఇద్దరు ముష్కరులను అరెస్టు చేశాయి. వారి నుంచి ఓ తుపాకీ, రెండు గ్రెనేడ్లు, రూ.7 లక్షల నగదును జవాన్లు స్వాధీనం చేసుకున్నారు.