తొలిరోజే 3 సార్లు 'తేజస్' గొలుసు లాగేశారు! భారతీయ రైల్వే చరిత్రలో తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన దిల్లీ-లఖ్నవూ తేజస్ ఎక్స్ప్రెస్ తొలి ప్రయాణం ఆటంకాలతో సాగింది. తొలిరోజే మూడు సార్లు గొలుసు లాగడం, ఓ సారి నిరసనకారులు అడ్డుకోవడం సర్వత్రా చర్చనీయాంశమైంది.
కాన్పుర్లో తేజస్ ఎక్స్ప్రెస్ దిల్లీకి బయలుదేరిన కొద్ది నిమిషాలకే ప్రైవేటు క్యాటరింగ్ సిబ్బంది ఆహార క్యాన్లను ఎక్కించేందుకు గొలుసు లాగారు. ఆ తర్వాత రైలు బయల్దేరి సెంట్రల్ స్టేషన్లోని ప్లాట్ఫాం నెంబర్ 9 కి చేరుకుంది. మళ్లీ ఎవరో గొలుసు లాగారు. తేజస్ కాసేపు ఆగింది. మళ్లీ బయలుదేరి కొంచెం దూరం కదిలేసరికి ఓ ప్రయాణికుడు రైలెక్కలేదని, వారి బంధువులు చైన్ లాగారు. ఆర్పీఎఫ్ సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు.
ఆందోళనలతో...
రైల్వేను ప్రైవేటీకరిస్తున్నారని ఆందోళన వ్యక్తంచేస్తూ ఘజియాబాద్లో కార్మికులు ధర్నాకు దిగారు. పట్టాలపైకి వచ్చి తేజస్ను అడ్డుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు నిరసనకారులను ట్రాక్పై నుంచి తప్పించి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. అలా తేజస్ దిల్లీ వైపు దూసుకెళ్లింది. హస్తినలోనూ కార్మికులు నిరసనలతో స్వాగతం పలికారు.
ఇదీ చూడండి:ఎప్పుడొచ్చామని కాదు.. గెలిచి తీరతాను: టిక్టాక్ స్టార్