సారూ.. ఎంత బీభత్సం సృష్టించింది మీ కారు! తమిళనాడు నమక్కల్లోని తిరుచెంగోడేలో త్రుటిలో ప్రాణాపాయం తప్పింది. ఓ కారు బీభత్సం సృష్టించిన దృశ్యాలు సీసీటీవీకి చిక్కాయి. అతి వేగంగా వచ్చిన కారు.. పాదచారులు, ద్విచక్రవాహనాలపైకి దూసుకుపోయిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా నలుగురు తీవ్రగాయాలపాలయ్యారు. వెంటనే స్పందించిన స్థానికులు వారిని దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరిలో 45 ఏళ్ల మనోహరన్, కణ్ణన్.. 20 ఏళ్ల లోపు వయసున్న చెల్కుమార్, సబ్రేస్వరీలున్నట్లు పోలీసులు తెలిపారు. సాయంకాలం 6 గంటల 45 నిమిషాలకు రద్దీగా ఉన్న రోడ్డుపైకి ఓ కారు వేగంగా దూసుకొచ్చింది. పక్కనే పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనాల్ని, అటుగా నడిచి వస్తున్న పాదచారులను ఢీకొంటూ ముందుకు సాగిపోయింది. ప్రమాదంలో 10 ద్విచక్రవాహనాలు ధ్వంసమయ్యాయి. చక్రాల్లో ఒకటి పేలడం వల్లే కారు.. అదుపుతప్పి ఉంటుందని స్థానికులు తెలిపారు. కారు నడిపిన ప్రైవేటు కళాశాల ప్రొఫెసర్ వివేకానందన్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.