గుళ్లో పులిహోర పెడితేనే.. మెతుకు వదలకుండా లాగించేస్తాం.. కుదిరితే రెండు పొట్లాలు ఇంటికి పట్టుకెళతాం. ఇక ప్రసాదంగా మటన్ బిర్యానీ పెడితే...? ఇంకేముంది.. మాంసాహార ప్రియులకు పండగే..! ఆఁ.. తమిళనాడు మధురైలో మునియండి స్వామి ఆలయంలో అదే జరిగింది.. బిర్యానీ ప్రసాదాన్ని అందుకునేందుకు భారీ పాత్రలు పట్టుకుని పోటెత్తారు జనం.
బిర్యానీ మహాప్రసాదం..
అయితే ఈ బిర్యానీ ప్రసాదం ఆచారం ఇప్పటిది కాదు, దాదాపు 84 ఏళ్ల నుంచి ఇక్కడీ సంప్రదాయం కొనసాగుతోంది. వడక్కంపట్టి గ్రామంలో ఏటా 'మునియండీ ఆలయంలో బిర్యానీ' ఉత్సవం ఘనంగా జరుగుతుంది. ఈ పండుగలో భక్తులంతా పొట్టేళ్లు, కోళ్లు బలిచ్చి స్వామిని ప్రసన్నం చేసుకుంటారు. ఆ తరువాత ఆలయంలోనే తయారు చేసే పసందైన మటన్ బిర్యానీ, చికెన్ బిర్యానీలను ప్రసాదంగా స్వీకరిస్తారు.