అయోధ్య భూవివాదం కేసులో మధ్యవర్తిత్వ కమిటీ సమర్పించిన నివేదికపై నేడు సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని ధర్మాసనం నివేదికను పరిశీలించనుంది. అనంతరం ఈ అంశంపై రోజు వారీ విచారణ జరపాలా... లేక మధ్యవర్తిత్వాన్నే కొనసాగించాలా అన్న నిర్ణయాన్ని సుప్రీంకోర్టు తీసుకునే అవకాశముంది.
గురువారం సుప్రీంకోర్టుకు మధ్యవర్తిత్వ కమిటీ నివేదిక సమర్పించింది. పరిశీలన అంశాలను సీల్డ్ కవర్లో అత్యున్నత న్యాయస్థానానికి అందజేశారు కమిటీ సభ్యులు. జులై 18న సుప్రీం ఆదేశాల మేరకు నివేదికను సిద్ధం చేసింది కమిటీ.
ఇదీ కేసు..
అయోధ్యలోని 2.77 ఎకరాల వివాదాస్పద భూమిని సున్నీ వక్ఫ్ బోర్డ్, నిర్మోహి అఖాడా, రామ్ లల్లాకు సమానంగా పంచాలని 2010లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ తీర్పునకు వ్యతిరేకంగా ఇప్పటివరకు సుప్రీంకోర్టులో 14 పిటిషన్లు దాఖలయ్యాయి.
ప్యానెల్ ఏర్పాటు...
ఈ వ్యాజ్యాలపై సుప్రీంకోర్టు మార్చి 8న కీలక నిర్ణయం తీసుకుంది. వివాద శాశ్వత పరిష్కారానికి మధ్యవర్తిత్వమే మార్గమని తీర్మానించింది. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఖలీఫుల్లా ఛైర్మన్గా మధ్యవర్తిత్వ ప్యానెల్ ఏర్పాటు చేసింది. ఆధ్యాత్మిక గురువు శ్రీశ్రీ రవిశంకర్, సీనియర్ న్యాయవాది శ్రీరామ్ పంచూను సభ్యులుగా నియమిస్తూ జస్టిస్ రంజన్ గొగొయి నేతృత్వంలోని ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఆగస్టు వరకు పొడగింపు...
నివేదిక సమర్పించేందుకు ప్యానెల్కు 8 వారాల గడువు ఇచ్చింది. జస్టిస్ ఖలీఫుల్లా నేతృత్వంలోని ప్యానెల్... ఉత్తర్ప్రదేశ్ ఫైజాబాద్ వేదికగా భాగస్వామ్య పక్షాలతో సమాలోచనలు జరిపింది. మొదటి దఫాలో జరిగిన చర్చల సారాంశాన్ని నివేదిక రూపంలో మే నెలలో సుప్రీంకోర్టుకు అందజేసింది. ప్యానెల్ అభ్యర్థన మేరకు మధ్యవర్తిత్వానికి గడువును ఆగస్టు వరకు పెంచిన కోర్టు.. ఆగస్టు 1లోపు మరో నివేదిక అందజేయాలని ఆదేశించింది.
ఇదీ చూడండి:- భారత దౌత్యాధికారులకు జాదవ్ను కలిసే అవకాశం