ప్రజా ఉద్యమాలను, భావప్రకటన స్వేచ్ఛను అడ్డుకోవడానికి దేశవ్యాప్తంగా ప్రభుత్వాలు తరచూ 144 సెక్షన్ ప్రయోగిస్తున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు కొన్ని కీలక ఆదేశాలు జారీచేసింది. జమ్మూ-కశ్మీర్లో ఆంక్షల విధింపుపై వెలువరించిన తీర్పులో జస్టిస్ ఎన్.వి.రమణ ఈ అంశంపై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అత్యవసరంగా ప్రమాదం ఉంటే తప్ప ఈ సెక్షన్ ప్రయోగించడానికి వీల్లేదని, భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారన్న కారణంతో వాటిని అణచివేయడానికి దీన్ని తరచూ ప్రయోగించడం అంటే అధికార దుర్వినియోగానికి పాల్పడటమేనని పేర్కొన్నారు. పరిస్థితులకు తగ్గట్టుగానే నియంత్రణలు విధించాలని, అన్నింటికీ ఒకే సూత్రాన్ని అమలుచేయడానికి వీల్లేదని నిర్దేశించారు. ఈ ఉత్తర్వులన్నీ న్యాయసమీక్షకు లోబడే ఉంటాయని, అందువల్ల బాధితులు సవాల్ చేయడానికి వీలుగా అన్ని నిషేధాజ్ఞల ఉత్తర్వులను బహిర్గతం చేయాలని ఆదేశించారు. 144 సెక్షన్పై సుప్రీంకోర్టు చేసిన మార్గదర్శకాలు ఇలా ఉన్నాయి.
సుప్రీంకోర్టు మార్గదర్శకాలు
- న్యాయబద్ధమైన అభిప్రాయం, ఆవేదన, ప్రజాస్వామ్య హక్కుల వినియోగాన్ని అడ్డుకోవడానికి 144 సెక్షన్ను ఒక సాధనంగా ఉపయోగించడానికి వీల్లేదు. విభిన్న భావప్రకటన, న్యాయబద్ధంగా భావ వ్యక్తీకరణ, తిరస్కార హక్కులకు రాజ్యాంగ సంరక్షణ ఉంది. హింస చెలరేగేందుకు అవకాశం, ప్రజాభద్రతకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉందనడానికి స్పష్టమైన ఆధారాలు ఉంటే తప్ప ఆ అధికారాన్ని ప్రయోగించకూడదు. అత్యవసర పరిస్థితుల్లో.. ప్రమాదం ముంచుకొస్తున్నప్పుడే దీన్ని ఉపయోగించేలా నిబంధనలు ఉండాలి. ఉద్యోగుల విధులకు అడ్డుతగిలే, బాధపెట్టే, గాయపరిచే అవకాశం ఉన్నప్పుడు, అలాంటి చర్యలను అడ్డుకోవడానికే ఈ అధికారాన్ని ప్రయోగించాలి.
- 144 సెక్షన్ కింద జారీచేసే ఉత్తర్వులు ప్రజల ప్రాథమిక హక్కులపై ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. అందువల్ల ఈ హక్కులను నియంత్రించేందుకు తీసుకునే చర్యలు, ఉపయోగించే అధికారాలను ఏకపక్షంగా కాకుండా వాస్తవాలను నిష్పాక్షికంగా అంచనావేసి అమలు చేయాలి. సమస్య తీవ్రతను బట్టి చర్యలు ఉండాలి. అత్యవసర పరిస్థితుల్లో తక్షణ పరిష్కార చర్యల కోసం ఈ సెక్షన్ను విధించాలనుకుంటే సదరు అధికారి అక్కడి స్థితిగతులపై సంతృప్తి చెందాలి. ఎంత విస్తీర్ణంలో, ఎంత కాలానికి, ఎలాంటి నియంత్రణలు అమలు చేస్తున్నామన్నది చూడాలి.
- పరిస్థితులు మరింత తీవ్రంగా ఉంటేనే ఆంక్షలను విస్తృత ప్రాంతంలో, దీర్ఘకాలం అమలు చేయాలి.
- శాంతి భద్రతలు, సామాజిక శాంతి (పబ్లిక్ ఆర్డర్), రాష్ట్ర భద్రత అనేవి విభిన్నమైన అంశాలు. పరిస్థితులకు అనుగుణంగా నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత మేజిస్ట్రేట్లపై ఉంటుంది. సాగునీటి కోసం రెండు కుటుంబాలు గొడవపడితే అది శాంతిభద్రతలకు విఘాతం కలిగించవచ్చు. అదే పనికోసం రెండు వర్గాలు ఘర్షణకు దిగితే పరిస్థితులు సామాజిక అశాంతికి దారితీయవచ్చు. అయినా ఈ రెండు అంశాలకు ఒకేరకమైన విధానం అనుసరించడం ఆమోదయోగ్యం కాదు. అక్కడి పరిస్థితుల తీవ్రతను అంచనా వేయకుండా అన్నింటికీ ఒకే సూత్రాన్ని మేజిస్ట్రేట్ అనుసరించకూడదు.
- అలాంటి అధికారాలను ఆషామాషీగా, అసంబద్ధంగా ఉపయోగిస్తే అది తీవ్ర అన్యాయానికి దారితీస్తుంది. వాటిని బాధ్యతాయుతంగా, శాంతిభద్రతల పరిరక్షణ కోసమే ఉపయోగించాలి. ఈ ఉత్తర్వులు న్యాయసమీక్షకు లోబడే ఉంటాయి. అందువల్ల బాధిత వ్యక్తులెవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించి ఇలాంటి చర్యలను సవాల్ చేయొచ్చు. అందువల్ల ఈ అధికారాలన్నీ న్యాయబద్ధంగా, హేతుబద్ధంగా, వాస్తవాల ప్రాతిపదికన విచక్షణతో ఉపయోగించాలి.
- 144 సెక్షన్ విధించేటప్పుడు ‘ప్రిన్సిపల్ ఆఫ్ ప్రపోర్షనాలిటీ’ (నైష్పత్తిక సిద్ధాంతం) సూత్రానికి మెజిస్ట్రేట్ కట్టుబడాలి. ఈ సూత్రం ఆధారంగా ప్రజల హక్కులు, నియంత్రణల మధ్య సమతౌల్యం పాటించాలి.
- పత్రికా స్వేచ్ఛ చాలా విలువైంది. అది 19(1) అధికరణం కింద రాజ్యాంగం కల్పించిన అత్యంత పవిత్రమైన హక్కు. ఆధునిక ప్రజాస్వామ్యానికి ఇది చాలా అవసరం. అది లేకుండా సమాచార మార్పిడి, ప్రజాస్వామ్య సమాజానికి అవసరమైన చర్చలు సాధ్యం కావు. బాధ్యతాయుతమైన ప్రభుత్వాలు ఎల్లప్పుడూ పత్రికా స్వేచ్ఛను గౌరవించాలి. విధులు నిర్వర్తించుకోవడానికి పాత్రికేయులకు వీలు కల్పించాలి. పత్రికల మెడపై నిరంతరం కత్తి వేలాడేందుకు అనుమతివ్వడం న్యాయబద్ధం కాదు.