తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సహ చట్టం పరిధిలోకి సీజేఐ- సుప్రీంకోర్టు చారిత్రక తీర్పు - Supreme Court Latest news

'పారదర్శకతతో సుప్రీంకు ఎలాంటి నష్టం జరగదు'

By

Published : Nov 13, 2019, 2:32 PM IST

Updated : Nov 13, 2019, 3:26 PM IST

14:44 November 13

సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు..

కీలక అయోధ్య భూవివాద కేసు అనంతరం.. సుప్రీంకోర్టు మరో సంచలన తీర్పు వెల్లడించింది. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) పరిధిలోకి వస్తుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ మేరకు దిల్లీ హైకోర్టు గతంలో ఇచ్చిన తీర్పును సమర్థించింది సీజేఐ నేతృత్వంలోని ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం. 

అయితే.. గోప్యత, వ్యక్తిగత గోప్యత చాలా ముఖ్యమైన అంశాలని.. భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చే ముందు వాటిని సంతులితము చేయాలని సూచించింది. పారదర్శకత పేరుతో.. వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగించరాదని పేర్కొంది. దిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రాజ్యాంగ ధర్మాసనం.. నేడు తుది తీర్పు వెలువరించింది.

2007లో పిటిషన్​.. 2010లో తీర్పు

2007లో సమాచార హక్కుచట్టం కార్యకర్త సుభాష్‌ చంద్ర అగర్వాల్‌ న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ వేశారు. పిటిషనర్‌ అడిగిన సమాచారం ఇచ్చేందుకు అత్యున్నత న్యాయస్థానం తిరస్కరించింది. దీనితో అగర్వాల్‌ కేంద్ర సమాచార కమిషన్‌ను ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని, అందువల్ల న్యాయమూర్తుల ఆస్తుల వివరాలు వెల్లడించాలని కేంద్ర సమాచార కమిషనర్‌ సుప్రీంకోర్టుకు సూచించింది.

కేంద్ర సమాచార కమిషన్‌ ఆదేశాలను సవాల్‌ చేస్తూ దిల్లీ హైకోర్టులో ఓ వ్యాజ్యం దాఖలైంది. సదరు పిటిషన్‌ను విచారణ చేసిన దిల్లీ హైకోర్టు .. కేంద్ర సమాచార కమిషన్‌ ఉత్తర్వులను సమర్థించింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం ప్రజా అధికార సంస్థ అని, అది సమాచార హక్కు చట్టం పరిధిలో ఉండాల్సిందేనని జనవరి 2010లో తీర్పు ఇచ్చింది.

దిల్లీ హైకోర్టు తీర్పుపై సవాలు

ఈ తీర్పును సవాల్‌ చేస్తూ సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ సుప్రీంకోర్టులోనే పిటిషన్‌ వేశారు. ఈ వ్యాజ్యంపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి, జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్ డీవై చంద్రచూడ్, జస్టిస్‌ దీపక్‌ గుప్తా, జస్టిస్‌ సంజయ్‌ కన్నాలతో కూడిన రాజ్యాంగ ధర్మాసనం విచారణ చేపట్టింది. పారదర్శకత పేరుతో ఏ ఒక్కరూ ఈ సంస్థను నాశనం చేయలేరని విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ రంజన్‌ గొగొయి అభిప్రాయపడ్డారు. విచారణ అనంతరం ఏప్రిల్‌ 4న ఈ తీర్పును వాయిదా వేశారు. తాజాగా నేడు తుది తీర్పును వెల్లడించారు.

13:55 November 13

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం: సుప్రీంకోర్టు

భారత ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం.. సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తుందని సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. 

Last Updated : Nov 13, 2019, 3:26 PM IST

ABOUT THE AUTHOR

...view details