తెలంగాణ

telangana

ETV Bharat / bharat

భారత్​ భేరి: సన్నీపై భాజపా భారీ ఆశలు!

రాజకీయాల వైపు చూసే సినీ, క్రీడా ప్రముఖులను ఆకర్షించడంలో ముందుంది భాజపా. అలనాటి తార హేమమాలిని నుంచి నేటి క్రికెటర్‌ గౌతమ్‌ గంభీర్‌ వరకు ఆ జాబితాలో ఎంతోమంది ఉన్నారు. ఇప్పుడు కొత్తగా వారి సరసన చేరారు బాలీవుడ్‌ యాక్షన్‌ స్టార్‌ సన్నీ దేఓల్​. చేరటమే ఆలస్యమన్నట్టుగా పంజాబ్‌లోని కీలకస్థానం నుంచి పోటీకి సిద్ధమవుతున్నారు​.

By

Published : Apr 24, 2019, 6:25 PM IST

Updated : Apr 24, 2019, 9:38 PM IST

సన్నీ దేఓల్​

సన్నీ భాజపా ఆశలు

ఊహాగానాలకు తెరదించుతూ భాజపా తీర్థం పుచ్చుకున్నారు బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో సన్నీ దేఓల్​. భాజపా అధ్యక్షుడు అమిత్‌ షాతో చర్చించి రాజకీయ అరంగేట్రానికి సిద్ధమయ్యారు. దిల్లీలో కేంద్ర మంత్రులు నిర్మలా సీతారామన్‌, పీయూష్‌ గోయల్‌ సమక్షంలో పార్టీ కండువా కప్పుకున్నారాయన.

మూడున్నర దశాబ్దాలకు పైగా సినీ ప్రేక్షకులను అలరించారు దేఓల్​. గాయల్‌, దామిని, బోర్డర్‌, గదర్‌ ఏక్‌ ప్రేమ్‌ కథ వంటి అద్భుత చిత్రాలు అందించారు. ఇప్పుడు ప్రజాక్షేత్రంలో ఎంతమేర ప్రభావం చూపించనున్నారన్నది ఆసక్తికరం.

అందివచ్చిన అవకాశం

పంజాబ్​లో సత్తా చాటాలని ఎప్పటి నుంచో భాజపా ప్రయత్నాలు చేస్తోంది. సిక్కుల గడ్డపై ఇప్పటివరకు కాంగ్రెస్, శిరోమణి అకాలీదళ్​దే హవా. ప్రస్తుతం ఆప్ కూడా పంజాబ్​లో పాగా వేయాలని చూస్తోంది. భాజపా పరిస్థితి చూస్తే 2014లో మోదీ ప్రభంజనంలోనూ అక్కడ ఎదురు దెబ్బ తగిలింది. రాష్ట్రంలోని 13 స్థానాల్లో భాజపాకు 2, మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్​కు 4స్థానాలే వచ్చాయి.

ఈసారీ భాజపాకు సరైన బలం లేక 3 స్థానాల్లో పోటీలో నిలవగా.. శిరోమణి 10స్థానాల్లో పోటీ చేస్తోంది. బరిలోకి దిగనున్న అమృత్‌సర్, గురుదాస్‌పుర్, హోషియార్‌పు​ర్​లో బలమైన అభ్యర్థుల అన్వేషణలో ఉంది భాజపా. ఈ పరిస్థితుల్లో సన్నీ దేఓల్​ రూపంలో ఓ మంచి అవకాశాన్ని అందిపుచ్చుకుంది. పార్టీలో చేరిన కొద్దిగంటలకే గురుదాస్​పుర్​ నుంచి సన్నీ పోటీ చేస్తారని భాజపా ప్రకటించింది.

తండ్రి బాటలో..

సన్నీకి రాజకీయ నేపథ్యమూ ఉంది. ఆయన తండ్రి, బాలీవుడ్ దిగ్గజం ధర్మేంద్ర 2004లో రాజస్థాన్‌లోని బికానేర్ నుంచి భాజపా తరఫున పోటీ చేసి విజయం సాధించారు. సన్నీదేఓల్​ పిన్ని, బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని చాలాకాలం నుంచి భాజపాలో కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ మధుర స్థానంలో మరోమారు పోటీకి నిలిచారు.

"అటల్​ జీ వెంట నా తండ్రి ధర్మేంద్ర నడిచారు. ఇప్పుడు ఆయన బాటలోనే మోదీ వెంట నేను నడుస్తాను. మేమంతా కలిసి చెయ్యాలనుకున్నది చేసి చూపిస్తాం. ప్రేమతో చేస్తా. మాటలు చెప్పడం నాకు రాదు. కానీ ప్రతి సారి నా పనే సమాధానమిస్తుంది. "
-సన్నీ దేఓల్​, భాజపా నేత

వినోద్​ ఖన్నా స్థానంలో..

గురుదాస్‌పుర్‌లో అకాలీదళ్‌ శ్రేణుల మద్దతుతో సన్నీ దేఓల్​ విజయం తథ్యమని ధీమాగా ఉంది భాజపా. 1998 నుంచి 2009 వరకు, ఆ తర్వాత 2014లో భాజపా ఎంపీ వినోద్‌ ఖన్నా గెలుపొందారు. 2017లో వినోద్​ మరణంతో జరిగిన ఉపఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం సాధించింది.

సన్నీ సేవలను భాజపా రాష్ట్రవ్యాప్తంగా వాడుకుంటుందా? లేక గురుదాస్‌పుర్ వరకే పరిమితం చేస్తుందా? అనేది ఎన్నికల తరువాత తేలిపోనుంది.

ఇదీ చూడండి:

Last Updated : Apr 24, 2019, 9:38 PM IST

ABOUT THE AUTHOR

...view details