పౌరసత్వ సవరణ చట్టానికి(సీఏఏ) వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా చెలరేగిన ఆందోళనలు అక్కడక్కడా కొనసాగుతూనే ఉన్నాయి. దిల్లీ, పశ్చిమ్ బంగా, కర్ణాటకల్లో నిరసనలు కనిపించాయి.
మరో ర్యాలీతో దీదీ!
బంగాల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి సీఏఏ వ్యతిరేక ర్యాలీ నిర్వహించారు. కోల్కతా బిధాన్ సరణిలోని స్వామి వివేకానంద విగ్రహం నుంచి, గాంధీ భవన్ వరకు సాగిన ఈ నిరసన ప్రదర్శనకు దీదీ నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా.. కేంద్రంపై మండిపడ్డారు మమత బెనర్జీ. భాజపా, సీఏఏ, ఎన్ఆర్సీలకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఎన్ఆర్సీకి సంబంధించి ప్రధాని నరేంద్ర మోదీ ఒకటి చెబితే, కేంద్ర హోంమంత్రి అమిత్ షా మరొకటి చెబుతున్నారని విమర్శించారు దీదీ. ఇద్దరిలో ఎవరు నిజం చెబుతున్నారో అర్థం కావడం లేదని ధ్వజమెత్తారు.
"దేశవ్యాప్త ఎన్ఆర్సీ అమలుపై చర్చలే లేవు, అలాంటి ప్రతిపాదనే లేదని ప్రధాని అంటున్నారు. కానీ, కొద్ది రోజుల క్రితం హోం మంత్రి మాత్రం దేశమంతా ఎన్ఆర్సీ అమలవుతుందన్నారు. వీరిద్దరి వ్యాఖ్యలు పూర్తి విరుద్ధంగా ఉన్నాయి. వీరిలో ఎవరు నిజం మాట్లాడుతున్నారో నాకు తెలియడం లేదు."
-మమతా బెనర్జీ, బంగాల్ ముఖ్యమంత్రి