అడవి ఓ రాజ్యమైతే.. దాన్ని పులులు పాలిస్తాయి. నిస్సహాయ జంతువులు ఏదో ఒకరోజు వాటికి ఆహారంగా మారతాయి. ఇది సృష్టి ధర్మం. అదే అక్కడి వారికి శాపంలా మారింది. చేపల వేటకు, తేనె సేకరణే వారికి జీవనాధారం. బతుకుదెరువు కోసం అడవిలోకి వెళ్లిన వాళ్లు తిరిగి వస్తారో, రారో చెప్పలేని పరిస్థితిలో బతుకుతున్నారు. అక్కడ భర్తలను కోల్పోతున్న మహిళల సంఖ్య నానాటికీ పెరుగుతోంది.
గతేడాది 11 మంది బలి!
ప్రభుత్వ గణాంకాల ప్రకారం.. 2019లో ఇక్కడ పులులకు ఆహారంగా మారినవారి సంఖ్య అధికారికంగా 4. కానీ నిజానికి 11 మంది పులుల దాడిలో ప్రాణాలు కోల్పోయారు.
బంగాల్ నేతిధూపాని, పీర్ఖాలి, చుట్టుపక్కల గ్రామాల్లో పులులకు బలై.. భర్తలను కోల్పోయిన మహిళల సంఖ్య పెరుగుతోంది. చేపల వేటకు వెళ్లిన గోసాబా గ్రామస్థులు శ్రీనాథ్ మోండల్, సుబాల సర్దార్ లాంటి ఎంతోమంది తిరిగి రాలేదు. భర్త జ్ఞాపకాలతో కాలం వెళ్లదీస్తున్న శ్రీనాథ్ భార్య రీటా తన భర్త ఇంకెప్పటికీ రాడన్న చేదునిజం జీర్ణించుకోలేకపోతోంది.
"నా భర్త చనిపోయారని నాకెవరూ చెప్పలేదు. నా ఇంటిముందు జనం గుమిగూడారే తప్ప, నాకేం చెప్పలేదు. చాలా భయపడ్డాను. ఆయన ఇకలేరన్న నిజం నాకు తెలిసింది."
- రీటా మోండల్, పులిదాడిలో భర్తను కోల్పోయిన మహిళ
బతికి బట్టకట్టాడు..
శ్రీనాథ్, సుబాల్తో కలిసి, అదేరోజు మనోరంజన్ జానా సైతం అడవికి వెళ్లాడు. ఆయన మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు.
"మేం చేపలు పడుతున్న సమయంలో ఓ పులి మాపై దాడి చేసింది. శ్రీనాథ్ను పట్టుకుని, అడవిలోకి ఈడ్చుకెళ్లింది. అతడి శవం కనిపించింది. నాకూ కొన్ని గాయాలయ్యాయి. కానీ ప్రాణాలతో బయటపడ్డాను."
- మనోరంజన్ జానా, పులిదాడి నుంచి తప్పించుకున్న వ్యక్తి