తెలంగాణ

telangana

By

Published : Nov 26, 2019, 1:48 AM IST

ETV Bharat / bharat

రాజ్యాంగ రచనలో అంబేడ్కర్‌ కృషి అనన్య సామాన్యం

ఆలోచన శక్తి.. వాదనా పటిమ.. ఒప్పించే నేర్పు.. ఇవన్నీ డాక్టర్​ బి.ఆర్​. అంబేడ్కర్​ సొంతం. భారతీయులను ఎంతో ప్రభావితం చేసిన వ్యక్తి ఆయన. రాజ్యాంగ నిర్మాణంలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా కమిటీ అధ్యక్షుడిగా వ్యవహరించారు అంబేడ్కర్​. రాజ్యాంగ రచన కోసం రేయింబవళ్లూ శ్రమించారు. అంటరానితనాన్ని నిషేధించి.. ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచారు ఆ మహోన్నత మూర్తి.

రాజ్యాంగ రచనలో డా.అంబేడ్కర్‌ కృషి అనన్య సామాన్యం

స్వతంత్ర భారతావనిలో జాతిని అత్యంత ప్రభావితం చేసిన వ్యక్తి డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌. ఆయన అసమాన విద్యావంతుడు. రాజనీతి కోవిదుడు. న్యాయశాస్త్ర దిట్ట. గొప్ప ఆర్థికవేత్త. కోట్ల మంది అణగారిన వర్గాల సాధికార కాంక్షకు ప్రతిరూపం. దేశ సార్వభౌమాధిపత్యానికి, సమగ్రతకు, ప్రజలందరికీ సమాన అవకాశాలు కల్పించడానికి అహరహం పరితపించారు. ఆయన సారథ్యంలో రూపుదిద్దుకున్న మహోన్నత రాజ్యాంగం మనల్ని ఏడు దశాబ్దాలుగా నడిపిస్తోంది. అంటరానితనాన్ని నిషేధించి... ఊరూరా నిలువెత్తు విగ్రహమై నిలిచిన ఆ మహోన్నత మూర్తి... ఒక చేతిలో పుస్తకాన్ని, మరో చేతి చూపుడు వేలితో ప్రతి ఒక్కరికీ దారి చూపిస్తున్నారు.

ఆలోచన శక్తి... వాదనా పటిమ... ఒప్పించే నేర్పు

భారత రాజ్యాంగ రచనకు ఎన్నికైన రాజ్యాంగ పరిషత్‌ వివిధ అంశాల పరిశీలనకు 22 కమిటీలను, 7ఉప కమిటీలను ఏర్పాటుచేసింది. వీటిలో అత్యంత ముఖ్యమైన ముసాయిదా(డ్రాఫ్టింగ్‌) కమిటీని 1947, ఆగస్టు 29న డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌ అధ్యక్షుడిగా, ఆరుగురు సభ్యులతో ఏర్పాటు చేశారు. భిన్న భౌగోళిక పరిస్థితులు, జాతులు, మతాలతో వైవిధ్యంగా ఉన్న దేశానికి చక్కటి దిశానిర్దేశం చేయడానికి ఎలాంటి రాజ్యాంగం కావాలనే విషయంపై అంబేడ్కర్‌కు స్పష్టత ఉందని స్వయంగా గాంధీజీ నమ్మేవారు. ఈ కారణంగానే రాజ్యాంగ పరిషత్‌లో కాంగ్రెస్‌దే ఆధిపత్యమున్నా సభ్యులంతా... అప్పటికే న్యాయశాఖ మంత్రిగా ఉన్న ఆయన పేరును ముక్తకంఠంతో సూచించారు. రాజ్యాంగ పరిషత్‌ 11సార్లు సమావేశమైంది. కమిటీల సభ్యులంతా లిఖిత, మౌఖిక రూపంలో ఇచ్చిన సూచనలను ముసాయిదా కమిటీ నమోదు చేసుకునేది. వాటిని క్రోడీకరించిన తర్వాత రాజ్యాంగ పరిషత్‌లో చర్చకు పెట్టేది. రాజ్యాంగ పరిషత్‌ ఏ అంశాన్నీ ఓటింగ్‌ ద్వారా ఆమోదించలేదు. ప్రతీ ప్రతిపాదన, సమస్యపై సుదీర్ఘంగా చర్చించి, సర్దుబాటు చేసి, సమన్వయం, ఏకాభిప్రాయం ద్వారా పరిష్కరించిన తర్వాతే ఆమోదించారు. ఈ ప్రక్రియ ముసాయిదా కమిటీ పనిని భారీగా పెంచింది. ముసాయిదా ప్రతి తయారీలో భాగంగా అంబేడ్కర్‌ స్వయంగా 60 దేశాలకు చెందిన రాజ్యాంగాలను చదివారు. మొత్తంగా 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు కష్టించి, సుదీర్ఘ మేధోమథనం తర్వాత ముసాయిదా కమిటీ హిందీ, ఆంగ్లంలో రెండు ప్రతులను తయారుచేసింది. దీని వెనుక అంబేడ్కర్‌ అవిరళ కృషి ఉంది. దీనిపై రాజ్యాంగ పరిషత్‌లో 115 రోజులు చర్చించి, 2473 సవరణలతో రాజ్యాంగాన్ని 1949 నవంబరు 26న ఆమోదించారు.

ఉపఖండం నుంచి పాకిస్థాన్‌ విడిపోయినట్లుగా రాష్ట్రాలు, సంస్థానాలు మరోసారి వేరుపడొద్దనే ఆలోచనతో దేశానికి సార్వభౌమాధిపత్యం కల్పించడంలో అంబేడ్కర్‌ కృషి మరువలేనిది. ఎవరికీ ప్రత్యేక అధికారులు ఇవ్వకుండా ఏక పౌరసత్వాన్ని, అందరికీ న్యాయం లభించాలనే కోణంలో ఏక న్యాయవ్యవస్థను ఏర్పాటుచేశారు. దేశానికి సోవియట్‌ తరహా విధానం నప్పదని, పారిశ్రామిక-వ్యవసాయ విధానమే మేలైందని నొక్కిచెప్పి, రాజ్యాంగ పరిషత్‌ సభ్యులను అంబేడ్కర్‌ ఒప్పించారు. రాజ్యాంగం దృష్టిలో దేశంలోని ప్రజలందరూ సమానమని, అందుకే ఒక మనిషి, ఒక ఓటు, ఒకే విలువ అంటూ నొక్కిచెప్పారు. అనాదిగా పీడనకు గురైన ఎస్సీ, ఎస్టీలు ప్రగతి సాధించాలంటే వారికి చట్టసభల్లో ప్రత్యేక నియోజకవర్గాలు ఉండాలని పట్టుబట్టి మరీ సాధించారు. అంటరానితనాన్ని నిషేధించారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీలకు చదువు, ఉద్యోగాల్లో రిజర్వేషన్లు ఉండాలని ప్రతిపాదించి, వారు రానున్న పదేళ్లలో అగ్రవర్ణాల స్థాయికి చేరుకునేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రాథమిక హక్కులు... అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తాయని, సామాన్యులు సైతం కోర్టుల ద్వారా వీటిని సాధించుకోవాలనే లక్ష్యంతో ఆర్టికల్‌ 32ను పొందుపరిచారు. దీన్ని రాజ్యాంగానికి ఆత్మగా అభివర్ణించారు. ప్రజలకు ఏమేమి చేయాలని, ఎలాంటి వసతులు కల్పించాలనే కోణంలో ప్రభుత్వాలను నిర్దేశించేవే ఆదేశ సూత్రాలంటూ గాంధీజీ సూచించిన అంశాలను పొందుపర్చారు.

రాజ్యాంగ రచన కోసం రేయింబవళ్లూ శ్రమించడంతో అంబేడ్కర్‌ ఆరోగ్యం దారుణంగా క్షీణించింది. నిరంతరం చదవడంతో కంటిచూపు మందగించింది. అదేపనిగా కూర్చుని ఉండటంతో వెన్ను, మోకాళ్ల నొప్పులు, సరైన సమయానికి ఆహారం తీసుకోకపోవడం, నిద్రలేమితో మధుమేహం వచ్చాయి. ఈ సమస్యలు మరో ఏడేళ్లపాటు వేధించగా 1956 డిసెంబరు 6న కన్నుమూశారు. ఆ సమయంలో ఆయనకు కంటిచూపు లేకపోవడం గమనార్హం.

ABOUT THE AUTHOR

...view details