తెలంగాణ

telangana

By

Published : May 6, 2020, 6:15 PM IST

ETV Bharat / bharat

ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి.?

'భారత సైన్యంలో చేరాలి. దేశానికి సేవ చేయాలి. భరత మాత రుణం తీర్చుకోవాలి.' ఆ కుటుంబంలోని వారంతా కోరుకునేది ఇదే. ఎంతో శ్రమించి ఆర్మీలో చేరిన ఆ జవాన్లు.. మరికొద్దిరోజుల్లో ఆరు నెలల విరామం కోసం ఇంటికి రానున్నారు. ఈలోగా హంద్వారాలో.. పాక్‌ ముష్కరులు కవ్వింపు చర్యలు ప్రారంభించారు. ఈ ఆపరేషన్‌లో అమరవీరులైన ఐదుగురిలో మేజర్‌ అనూజ్‌ సూద్‌ ఒకరు. మరి ఆ కుటుంబం ఈ వీరుని మరణంపై ఏమనుకుంటోంది.. అనే అంశమై కథనం.

MAJOR ANUZ SOOD WIFE'S AKRITI SOOD
ఆ వీరపత్ని కన్నీటికి అర్థమేంటి.?

సైన్యంలో చేరాలి. మాతృభూమికి సేవ చేయాలి. తల్లి భారతికి వందనం సమర్పించాలి. ఆ కుటుంబంలోని ప్రతి ఒక్కరికీ ఇదే ధ్యాస.. ఇదే కల. తండ్రి సైన్యంలో విశ్రాంత బ్రిగేడియర్‌. సోదరీ సైనికురాలే. ఎన్నో రోజులు కలలుగని ఆయనా స్వప్నాన్ని సాకారం చేసుకున్నారు. 2008లో భారత సైన్యంలో చేరారు.

మరికొద్దిరోజుల్లో ఇంటికి రావాల్సింది..

రెండున్నరేళ్లుగా జమ్ము కశ్మీర్‌లో విధులు నిర్వరిస్తున్నారు. ఆరు నెలల విశ్రాంతి కోసం మరికొద్ది రోజుల్లో ఇంటికి రానున్నారు. ఇదే సమయంలో హంద్వారాలో ఓ భారీ సైనిక ఆపరేషన్‌ మొదలైంది. ఎన్నాళ్లుగానో తప్పించుకుంటున్న మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్టు, హిజ్బుల్‌ ముజాహిద్దీన్‌ టాప్‌కమాండర్‌ రియాజ్‌ నైకూ, అతడి అనుచరులు మళ్లీ స్థానికులను అడ్డంపెట్టుకొని తప్పించుకోవాలని చూశారు. కానీ ఈ సారి సైన్యం దృఢనిశ్చయంతో ఉంది. వారినెలాగైనా బంధించాలి, హతమార్చాకే తిరిగి వెళ్లాలనుకుంది. దాదాపు 16 గంటల ఆపరేషన్‌.

ప్రజలను అడ్డుపెట్టుకొని..

ప్రజల ప్రాణాలకు ముప్పురావొద్దని ఆచితూచి వ్యవహరిస్తున్న సైనికులు, పోలీసులపై ఆ ముష్కరులు అదే ప్రజలను అడ్డుపెట్టుకొని కాల్పులు జరిపారు. ఈ ఘటనలో కల్నల్‌ అశుతోష్‌ శర్మ, మేజర్‌ అనూజ్‌ సూద్‌ సహా మరో ముగ్గురు వీరమరణం పొందారు.

ఆరు నెలల విశ్రాంతి కోసం ఇంటికి రావాలనుకున్న సైనికుడే మేజర్‌ అనూజ్‌ సూద్‌. పంచకుల వీరి స్వస్థలం. తిరిగొచ్చి గురుదాస్‌పూర్‌ 12గార్డ్స్‌ విభాగంలో చేరనున్నాడు. అయితే ఆయన పార్థివదేహం శవపేటిక ఇంటికి చేరడంతో ఆ కుటుంబసభ్యుల ఆవేదనకు అంతులేకుండాపోయింది.

ఆ ప్రశ్నలకు సమాధానమేదీ?

జీవితంలో ఎన్నో కలలు, ఆశలు పెట్టుకున్న ఆ కుటుంబం బాధను ఎవరు తీర్చగలరు? ఆ వీర మరణం పొందిన ఆ జవాను సతీమణి ఆకృతి సూద్‌ గుండెల్లో పెల్లుబికుతున్న కన్నీటిని ఎవరు ఆపగలరు? భర్త, పిల్లలతో కలిసి అల్లుకున్న కలల పందిరి పాదు ఎండిపోయిందని తెలిసి విలవిల్లాడుతున్న ఆమె వైరాగ్యాన్ని ఎవరు అర్థం చేసుకోగలరు?

మేజర్‌ అనూజ్‌ సూద్‌ పార్థివ దేహం పంచకులకు చేరుకున్నాక ఆ శవపేటికపై మోచేతులు పెట్టి తన భర్త ముఖంలోకి చూస్తూ బాధనంతా గుండెల్లోనే దిగమింగి కన్నీటి చుక్కల్నీ రాల్చలేకపోతున్న ఆమె చిత్రం ఇప్పుడు వైరల్‌గా మారింది. ఆమె భావోద్వేగాలను చూశాక ఎవ్వరైనా నిశ్శబ్దంగా మారాల్సిందే. ఎందుకంటే ఆమె హృదయంలో పొంగిపొరలుతున్న దుఃఖాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. వర్ణించడం అంతకన్నా సంక్లిష్టం.

ఛండీగఢ్‌లోని పంచకులలో మేజర్‌ అనూజ్‌సూద్‌ అంత్యక్రియలు పూర్తయ్యాయి. సైనికులు మూడుసార్లు గాల్లోకి కాల్చి గౌరవ వందనం చేశారు. తండ్రి, బ్రిగేడియర్‌ చంద్రకాంత్‌ తన కొడుకు చితికి నిప్పటించారు. తన కుమారుడు జాతి గర్వించే బిడ్డ అని విలపించారు. మేజర్‌ అనూజ్‌ సూద్‌ వయసు 30 ఏళ్లు మాత్రమే.

ఇదీ చదవండి:కశ్మీర్​లో ఎన్​కౌంటర్​.. ఓ ఉగ్రవాది హతం

ABOUT THE AUTHOR

...view details