తెలంగాణ

telangana

ETV Bharat / bharat

ఉత్తరప్రదేశ్​లో ఘోరంగా విఫలమైన మహాకూటమి

కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి దగ్గరి మార్గం ఉత్తరప్రదేశ్​... 2014 లోక్​సభ ఎన్నికల్లో భాజపా భారీ గెలుపు... 2017 రాష్ట్ర శాసన సభ ఎన్నికల్లో మళ్లీ అదే స్థాయి విజయం... ఈసారి ఎలాగైనా భాజపాను ఓడించాలని ఎస్​పీ, బీఎస్​పీ కూటమి జతకట్టాయి... కానీ ఈ సార్వత్రికంలో ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయాయి. కారణమేంటి...?

By

Published : May 24, 2019, 5:47 AM IST

Updated : May 24, 2019, 8:00 AM IST

ఉత్తరప్రదేశ్​లో విఫలమైన మహాకూటమి

ఉత్తరప్రదేశ్​లో ఘోరంగా విఫలమైన మహాకూటమి

సమాజ్​వాది పార్టీ... బహుజన్​ సమాజ్​ పార్టీ ... రెండూ భిన్న ధృవాలు... ఒక పార్టీకి అఖిలేశ్​​ సారథి కాగా మరో పార్టీకి అధినేత్రి.. డైనమిక్​ లీడర్​ మాయావతి... ఇంతకుముందు ప్రత్యర్థులైన వారు ఈ సారి ఉత్తర్​ప్రదేశ్​లో మహాకూటమిగా జట్టుకట్టారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా భాజపాను ఓడించాలనేదే వీరి లక్ష్యం. కానీ దారుణంగా విఫలయయ్యారు.

లోక్​సభ ఎన్నికల్లో కీలక రాష్ట్రం ఉత్తర్​ప్రదేశ్​. ఇక్కడ భాజపాను కూటమి అడ్డుకుంటుందని అందరూ ఊహించారు. తీరా ఫలితాలు చూస్తే 80 సీట్లకు గానూ ఈ కూటమి 15 స్థానాలకే పరిమితమైంది. భాజపా విజయదుందుభి మోగించింది.

2017లో ఎన్నికల్లో అఖిలేశ్​​ యాదవ్​ కాంగ్రెస్​తో సంకీర్ణం ఏర్పాటు చేసి పోటీ చేసినప్పటికీ విఫలమయ్యారు. అయితే ఆ ఎన్నికల్లో వీరి కలయికను ప్రజలు ఆదరించలేదు. అనంతర పరిణామాలతో ఎస్పీ, బీఎస్పీ దగ్గరయ్యాయి.

లెక్కలు తప్పిన కూటమి...

మొదట.. యూపీలో కాంగ్రెస్‌, ఎస్పీ , బీఎస్పీ కలిసి పోటీ చేస్తాయన్న ప్రచారం జరిగింది. ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ పొత్తు పెట్టుకున్నా హస్తం పార్టీని దగ్గరకు తీసుకోలేదు. ఇది భాజపాకు కలిసి వచ్చినట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో ఎస్​పీకి 22.2 శాతం.. బీఎస్పీకి 19శాతం ఓట్లు వచ్చాయి. ఈ రెండూ కలిస్తే 41.8% ఓట్లు సాధించవచ్చని భావించాయి. వాటికి ఆర్​ఎల్​డీ ఓట్లూ కలిపితే దాదాపు 42.5% అవుతుంది. కలిసి పోటీ చేస్తే భాజపా సాధించిన ఓట్లకు చేరువగా వెళ్లే అవకాశముందని భావించాయీ పార్టీలు. ఈ నేపథ్యంలోనే ఈ మూడు కలిసి పోటీ చేశాయి . అయినాగానీ భాజపా విజయాన్ని అడ్డుకోలేకపోయాయి.

ఈ రాష్ట్రంలో 2014 లోక్​సభ ఎన్నికల్లో 42.3 శాతం ఓట్లతో ఏకంగా 71 స్థానాలు గెలుచుకుంది భాజపా. ఈ సారి 7 స్థానాలు కోల్పోయి 64 సీట్లకు పరిమితమైంది.

కూటమితోనే...

ఏ ఓటు బ్యాంకు భాజపాను నిలువరిస్తుందని ఎస్పీ-బీఎస్పీ-ఆర్​ఎల్​డీ కూటమి భావించాయో అది వారికే ఎదురు తిరిగినట్టయింది. వీటి మధ్య ఓబీసీల ఓట్ల బదలాయింపు సరిగ్గా జరగకపోవడం భాజపాకు కలిసివచ్చింది. అదేవిధంగా సంప్రదాయకంగా భాజపాకు మద్దతుగా నిలిచే అగ్ర వర్ణాల ఓట్లలో కూడా చీలిక వస్తుందని భావించినప్పటికీ వారు కూడా మరోసారి కాషాయ పార్టీ పక్షానే నిలిచారు.

అగ్రవర్ణాల్లో పేదలకు 10 శాతం రిజర్వేషన్‌ అంశం కారణంగానే... బ్రాహ్మణులు, వైశ్యులు వంటి అగ్రవర్ణాలు భాజపాకు బాసటగా నిలిచినట్టు తెలుస్తోంది. సంప్రదాయకంగా కాంగ్రెస్‌ పక్షాన నిలిచే ముస్లింలు, ఎస్సీల ఓట్లు ఈసారి ఎస్పీ, బీఎస్పీ, కాంగ్రెస్‌ మధ్య చీలి పోవటం కూడా భాజపాకు లాభించింది.

ఫలించిన భాజపా వ్యూహాలు...

ఉత్తర్ ప్రదేశ్ విషయంలో మోదీ, అమిత్ షా వ్యూహాలు ఫలితాలిచ్చాయి. సిట్టింగ్‌ స్థానాల్లో కొందరిని మార్చటం, పోటీకోసం వడోదరా కాకుండా వారణాసినే మోదీ మళ్లీ ఎంచుకోవటం, ప్రతికూలంగా ఉన్న స్థానాలను ముందే గుర్తించి అక్కడ బలోపేతం చేసేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించాయి.

కిసాన్​ సమ్మాన్​ నిధి పథకం...

రుణ మాఫీ ప్రస్తావన లేకుండా ఎన్నికలకు వెళ్లిన భాజపాకు రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందని భావించినప్పటికీ కిసాన్‌ సమ్మాన్‌ నిధి పథకం కమలనాథులను ఆదుకుంది.
దీంతో తొలుత అభివృద్ది నినాదంతో ప్రచారం చేపట్టిన భాజపా క్రమంగా ప్రచారశైలిని మారుస్తూ జాతీయ వాదం, దేశభద్రత అంశాన్ని ముందుకు తీసుకువచ్చింది. అప్పటినుంచి ఈ అంశాన్ని మరింతగా ముందుకు తీసుకువచ్చి జనాల్లో చొప్పించగలిగింది.

ఇదీ చూడండి:

కాషాయ ప్రభంజనం... మరోసారి మోదీకే పట్టం

Last Updated : May 24, 2019, 8:00 AM IST

ABOUT THE AUTHOR

...view details