తెలంగాణ

telangana

ETV Bharat / bharat

70 మంది దివ్యాంగులకు టీచరమ్మగా మారిన 'అమ్మ' - mother son telugu

బోధన ఆమె వృత్తి కాదు. పాఠశాల నడిపి లాభాలు ఆర్జించడం ఆమె లక్ష్యం కాదు. కానీ, రాజస్థాన్​లో ఆమె స్థాపించిన బడిలో 70 మంది బాలలకు పాఠాలు చెబుతోంది. ఎందుకో తెలుసా.. ఆమె ఓ అమ్మ! కుమారుడి బాధను కళ్లారా చూసిన ఆమె.. అలాంటి వేదనను భరిస్తున్న ఎందరో తల్లులకు భరోసా ఇస్తోంది.

Son's special needs made this mom establish a 'special' school in rajasthan, churu
70 మంది దివ్యాంగులకు టీచరమ్మగా మారిన 'అమ్మ'

By

Published : Feb 9, 2020, 8:29 AM IST

Updated : Feb 29, 2020, 5:24 PM IST

70 మంది దివ్యాంగులకు టీచరమ్మగా మారిన 'అమ్మ'

దిల్లీకి రాజైనా, కాకపోయినా... తల్లికి మాత్రం కొడుకు మహారాజే! గర్భం నుంచే పోరాటం నేర్పే ఆ తల్లి, ఎదిగాక ఎదురయ్యే సవాళ్లకు ఎదురీదడమూ నేర్పుతుంది. ఈ మాటలను మరో సారి రుజువు చేసింది రాజస్థాన్​ చురూ జిల్లాలోని ఓ తల్లి. మానసిక స్థితి సరిగ్గా లేని తన బిడ్డ సమస్యకు పరిష్కారం వెతకడమే కాదు... 'మధుర్ దివ్యాంగుల పాఠశాల'ను ఏర్పాటు చేసి తన కుమారుడిలా బాధపడే ఎందరికో దారి చూపుతోంది అంజు నెహ్రా.

"నా మనసులో ఉన్నది ఒక్కటే.. నేను స్వయంగా ఓ దివ్యాంగుడికి తల్లిని. నా కుమారుడిని ప్రత్యేక స్కూలుకు పంపించాకే తనలో మార్పు వచ్చింది. అప్పుడే నాకు అనిపించింది.. చురూ జిల్లాలోని దివ్యాంగుల కోసం ఓ ప్రత్యేక పాఠశాలను తెరవాలని."
-అంజు నెహ్రా

ఆ బాధను అర్థం చేసుకుని...

మధుర్ పుట్టినపుడు అంజు జీవితంలో సంతోషాలు విరబూశాయి. అయితే, పెరిగే కొద్దీ కుమారుడి మానసిక స్థితి సరిగ్గా లేదని తెలిసి.. కుంగిపోయింది అంజు. కానీ, అధైర్యపడలేదు. కుమారుడి ప్రత్యేక అవసరాలు అర్థం చేసుకుంది. అతడిని ప్రత్యేక దివ్యాంగుల పాఠశాలలో చేర్చింది. కొడుకు కోసం.. ముంబయిలో మానసిక వికలాంగులకు బోధన చేసేందుకు శిక్షణ పొందింది.

మానసిక వైకల్యంతో తన కుమారుడు పడిన ఇబ్బందులను కళ్లారా చూసిన అంజూ నెహ్రా.. తన కుమారుడిలా బాధపడేవారి కోసం ఏదైనా చేయాలని నిర్ణయించుకుంది. 2013లో తనయుడి పేరు మీదే 'మధుర్ దివ్యాంగుల పాఠశాల' ను తెరిచింది. విశ్రాంత నౌకాదళ అధికారి అయిన భర్తకు వచ్చే ఫించనులో సింహభాగం ఈ బడికే ఖర్చు చేస్తూ... విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలు, ఇతర సౌకర్యాలు కల్పిస్తోంది. ఒక్క రూపాయి ఫీజు తీసుకోకుండా ఉచిత విద్య అందిస్తోంది.

అంత ఈజీ కాదు..

అయితే, ఈ పాఠశాల అంత సులభంగా ఏర్పడింది కాదు. మానసిక వైకల్యం ఉన్న పిల్లలకు బడి అంటే.. ఇల్లు అద్దెకు ఇచ్చేందుకు ఎవ్వరూ ముందుకువచ్చేవారు కాదు. ఇచ్చిన వారు కూడా కొద్ది రోజులకే ఉన్నంటుండి ఇల్లు ఖాళీ చేయాలనేవారు. అయినా వెనక్కి తగ్గలేదు అంజు. అవమానాలను భరించింది. ఎందరో దాతలను సంప్రదించింది. ఈ మధ్యే ఓ దాత ముందుకువచ్చి ఒక భిగా భూమిని విరాళంగా ఇచ్చారు. త్వరలో అక్కడ పాఠశాల భవనం నిర్మించనుంది అంజు.

ఇద్దరితో మొదలై...

ఏడేళ్ల క్రితం ఇద్దరు విద్యార్థులతో ప్రారంభించిన ఈ పాఠశాల ఇప్పుడు 70 మంది విద్యార్థుల భవిష్యత్తుకు భరోసా ఇచ్చే స్థాయికి చేరింది.

"ఈ బడిని 2013లో ప్రారంభించాము. అప్పుడు మాకెవరూ సహకరించలేదు. నేను, నా భర్త ఇద్దరమే. రాత్రింబవళ్లు శ్రమించి ఈ పాఠశాలను నిలిపాము. నా భర్త భారత నావికా దళంలో సేవలందించారు. ఇప్పుడు ఆయన రిటైర్​మెంట్​ తీసుకుని, నాతోపాటు కలిసి దివ్యాంగుల సేవలో నిమగ్నమయ్యారు. ఇప్పుడు ఈ బడిలో సుమారు 70 మంది విద్యార్థులున్నారు. వారిలో 55 నుంచి, 60 మంది విద్యార్థులు రోజూ హాజరవుతారు."
-అంజు నెహ్రా

ఇదీ చదవండి:కేరళ వరద బాధితులకు కొత్త వెలుగు- రేపు 121 ఇళ్ల పంపిణీ

Last Updated : Feb 29, 2020, 5:24 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details