హిమాలయాల సరిహద్దులో శీతాకాలం ముంచుకొచ్చింది. గడ్డకట్టించే చలిలో గస్తీ కాయాలంటే సైన్యానికి ప్రత్యేక జాకెట్లు అవసరం. ముఖ్యంగా తూర్పు లద్దాఖ్లో సరిహద్దు రేఖ వెంట, అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో బలగాల కోసం ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కానీ, వారికి ప్రస్తుతం అత్యవసరమైన 15,000 జాకెట్లు.. గత 15రోజులుగా దిల్లీలోని ఆర్డినెన్స్ డిపోలో పోగుపడి ఉన్నాయి.
ప్రత్యేక జాకెట్లకు ఆర్డర్
ఓవైపు సరిహద్దు ఉద్రిక్తతలు రోజురోజుకూ తీవ్రరూపం దాల్చుతున్నాయి. భారత్-చైనాల మధ్య పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో హై-ఆల్టిట్యూడ్ క్లోతింగ్ అండ్ ఎక్విప్మెంట్ (హెఏసీఈ) .. 30,000 ప్రత్యేక జాకెట్ల తయారీకి అమెరికాకు చెందిన సంస్థకు ఆర్డరిచ్చింది.
అత్యున్నత వర్గాల సమాచారం మేరకు.. ఈ ఒప్పందం కొన్నిరోజుల్లోనే ముగిసినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అత్యవసరంగా ఇవి కావాల్సిన నేపథ్యంలో మొదటి విడతలో భాగంగా.. 15,000జాకెట్లు అక్టోబర్ 2నే భారత్ చేరుకున్నాయి. కానీ, 15రోజులుగా అవి దిల్లీలోని భాండాగారంలోనే ఉన్నాయని, సైనికులు వీటి కోసం ఎదురుచూస్తున్నారని.. ఈటీవీ భారత్కు వివరించారు.
ఇదే విషయంపై సైనిక ఉన్నతాధికారులను ప్రశ్నిస్తే.. వారి సమాధానం వేరుగా వినిపిస్తోంది. ప్రస్తుతం సరిహద్దులో సరిపడా ఉన్నాయని, అంత అత్యవసరం లేదని అంటూనే.. త్వరలోనే వీటిని లద్దాఖ్ చేరుస్తామని చెబుతున్నారు.
కాగ్ నివేదిక..
ఈ ఏడాది విడుదల చేసిన కాగ్ నివేదిక.. సరిహద్దు సైనిక సదుపాయలకు సంబంధించి కీలక విషయాలు వివరించింది. సియాచిన్, డోక్లాం, లద్దాఖ్లలో సైనికులకు సరైన సదుపాయాలు, కావాల్సిన ఆహారం అందించటంలో అనేక ఇబ్బందులు ఉన్నాయని వెల్లడించింది. సైనికులు దూరప్రాంతాలను స్పష్టంగా చూడగలిగేలా.. ఎక్స్ట్రీమ్ కోల్డ్ క్లోతింగ్ ఎండ్ ఎక్విప్మెంట్ (ఈసీసీఈ) విభాగానికి చెందిన, 'ఆల్ టెర్రైన్ గాగుల్స్' వినియోగిస్తారు. పహారాలో కీలకంగా నిలిచే వీటి లభ్యత 5.6% నుంచి 16.07%కు మాత్రమే పెరిగింది. పేలవమైన సరఫరా కారణంగా కావాల్సినదాని కంటే, అందుబాటులో ఉన్నవి తక్కువగా ఉన్నాయని తేల్చింది కాగ్.