తెలంగాణ

telangana

డ్రాగన్‌ దొంగ దెబ్బతో 'మంచుకొండల్లో నెత్తుటేర్లు'

చైనా హద్దు మీరింది. మంచుకొండల్లో భారత్‌పై విషం చిమ్మింది. నాలుగున్నర దశాబ్దాల ‘ప్రశాంతత’ను భగ్నం చేస్తూ తూర్పు లద్దాఖ్‌లో ఘోరానికి తెగబడింది. 20 మంది భారత సైనికుల్ని పొట్టనబెట్టుకుంది. మరో 10 మంది సైనికుల ఆచూకీ అంతుచిక్కలేదని అధికార వర్గాల కథనం. ఇంకా అనేక మంది గాయపడినట్లు సమాచారం.

By

Published : Jun 17, 2020, 4:51 AM IST

Published : Jun 17, 2020, 4:51 AM IST

Updated : Jun 17, 2020, 6:30 AM IST

Line of Actual Control
మంచుకొండల్లో నెత్తుటేర్లు

సరిహద్దులో నెలన్నరగా గిల్లికజ్జాలకు దిగుతున్న డ్రాగన్‌ సోమవారం రాత్రి అనూహ్యంగా ఈ దొంగదెబ్బ తీసింది. ఇరు వైపులా సైనికుల ఘర్షణలో 43 మంది చైనా సైనికులు చనిపోవడమో, గాయపడటమో జరిగినట్లు అనధికార సమాచారం. చైనా చాన్నాళ్లుగా 'అదిగో సైనిక ఉపసంహరణ'.. 'ఇదిగో శాంతి' అంటూ వల్లెవేస్తూ.. తాజాగా అసలు స్వరూపాన్ని బయటపెట్టుకుంది. సరిహద్దుల్లో గస్తీ తిరుగుతున్న భారత జవాన్లపై చైనా సైనికులు ఒక ప్రణాళిక ప్రకారం ఆకస్మికంగా విరుచుకుపడ్డారు. రాళ్లు, ఇనుపకడ్డీలు, కర్రలతో పేట్రేగిపోయారు. ఫలితంగా హిమప్రాంతం నెత్తురోడింది. గాల్వాన్‌ లోయలో జరిగిన ఈ దుశ్చర్యను భారత జవాన్లు దీటుగా ఎదుర్కొన్నారు. తెలుగు యోధుడు కర్నల్‌ బిక్కుమళ్ల సంతోష్‌బాబు(39) వీరోచితంగా ఎదురొడ్డారు. సముద్రమట్టానికి 14వేల అడుగులు ఎత్తులో.. శీతల వాతావరణంలో చైనా సైనికుల ఆగడాలను అడ్డుకుంటూ సింహంలా పోరాడి వీర మరణం పొందారు. ఈ ఘటనలో సంతోష్‌ సహా 20 మంది సైనికులు చనిపోయారు. తొలుత ముగ్గురు సైనికులే మరణించారని సైన్యం ప్రకటించింది. తరువాత మరో ప్రకటన విడుదల చేసింది. ఘర్షణలో తీవ్రంగా గాయపడి, అక్కడి శీతల వాతావరణ వల్ల మరో 17 మంది సైనికులు కూడా చనిపోయారని తెలిపింది. ఘర్షణ జరిగిన ప్రాంతం నుంచి ఇరు దేశాల బలగాలు వెనక్కిమళ్లాయని పేర్కొంది.

ఘర్షణలో అమరులైన జవాన్లు

సంతోష్‌ది సూర్యాపేట జిల్లా

ఈ ఘర్షణలో చనిపోయిన భారత సైనికాధికారి కర్నల్‌ సంతోష్‌ స్వస్థలం.. తెలంగాణలోని సూర్యాపేట జిల్లా. '16 బిహార్‌' రెజిమెంట్‌కు కమాండింగ్‌ అధికారిగా పనిచేస్తున్నారు. చనిపోయిన వారిలో తమిళనాడులోని రామనాథపురం జిల్లాకు చెందిన పళని (40) కూడా ఉన్నారు. 1975 తర్వాత భారత్‌-చైనా సరిహద్దుల్లో మన దేశ సైనికులు చనిపోవడం ఇదే మొదటిసారి. నాడు అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తులుంగ్‌ లా వద్ద చైనా సైనికులు మాటువేసి, జరిపిన దాడిలో భారత్‌కు చెందిన నలుగురు సైనికులు ప్రాణాలు కోల్పోయారు.

సంబంధిత వర్గాల కథనం ప్రకారం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో ఈ ఘర్షణ జరిగింది. రెండు దేశాల మధ్య ఉన్న వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ) వెంబడి భారత భూభాగంలోనే మన సైనికులు గస్తీ నిర్వహిస్తున్నారు. చైనా బలగాలు హద్దు మీరకుండా చూస్తున్నారు. ఇంతలో.. పెద్ద సంఖ్యలో చైనా బలగాలు కర్రలు, కడ్డీలు, రాళ్లతో మన గస్తీ బృందంపై దాడి చేశాయి. ఈ హఠాత్పరిణామానికి విస్తుపోయిన మన సైనికులు వెంటనే తేరుకొని దీటుగా ప్రతిఘటించారు. ఇరు పక్షాల మధ్య కొన్ని గంటల పాటు ఈ పోరు సాగింది. ఈ ఘర్షణలో తుపాకులను పేల్చలేదు.

ఇదీ చూడండి: భారత్​, చైనాలు సంయమనం పాటించాలి: ఐరాస

Last Updated : Jun 17, 2020, 6:30 AM IST

ABOUT THE AUTHOR

...view details