'ఎల్ఓసీ వెంబడి ఏ క్షణంలోనైనా ఉద్రిక్తతలు' భారత సైన్యాధిపతి బిపిన్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్తతలు ఏ క్షణంలోనైనా పెరిగే అవకాశముందన్నారు. ఇందుకు భారత సైన్యం సిద్ధంగా ఉండాలని తెలిపారు. బలగాలు నిత్యం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
"నియంత్రణ రేఖ వెంబడి ఉద్రిక్త పరిస్థితులు ఏ సమయంలోనైనా పెరగొచ్చు. మనం వాటిని ఎదుర్కొనేందుకు సంసిద్ధులమై ఉండాలి."
-బిపిన్ రావత్, సైన్యాధ్యక్షుడు.
జమ్ముకశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పించే ఆర్టికల్ 370ని కేంద్రం రద్దు చేసిన అనంతరం నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ పదేపదే కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘిస్తున్న నేపథ్యంలో రావత్ ఈ వ్యాఖ్యలు చేశారు.
ఆర్టికల్ 370 రద్దు తర్వాత.. 2019 ఆగస్టు నుంచి అక్టోబర్ మధ్య కాలంలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్థాన్ 950 సార్లు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని లోక్సభ వేదికగా గతనెలలో వెల్లడించారు హోంశాఖ సహాయమంత్రి జి. కిషన్రెడ్డి.
ఇదీ చూడండి: ఉరిశిక్ష తప్పించుకోవడానికి నిర్భయ దోషి 'న్యాయ' ప్రయత్నం!