తెలంగాణ

telangana

By

Published : Jan 7, 2020, 7:33 AM IST

ETV Bharat / bharat

వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

పూర్తి ప్లాస్టిక్ రహిత రైల్వేస్టేషన్​గా రూపాంతరం చెందేందుకు వారణాసి రైల్వేస్టేషన్ వడివడిగా అడుగులేస్తోంది. స్టేషన్​లో టీ,కాఫీని కూడా మట్టిపాత్రల్లో విక్రయించేలా చర్యలు తీసుకుంది స్టేషన్ యాజమాన్యం. ఇతర ఆహారపదార్థాలను సైతం భూమిలో విచ్ఛిన్నమయ్యే పేపర్​ బ్యాగుల్లోనే సరఫరా చేయాలని వ్యాపారులను ఆదేశించింది. ఫలితంగా వాటర్​ బాటిళ్లు తప్పా.. మిగతా అన్నింటిలోనూ ప్లాస్టిక్​ వాడకాన్ని పూర్తిగా నిషేధించగలిగారు.

Single-use plastic banned in Varanasi railway station
వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

వారణాసిలో ప్లాస్టిక్​ నిషేధం.. మట్టిపాత్రల్లో కాఫీ,టీ!

ప్రధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఒకసారి వాడిపడేసే ప్లాస్టిక్​​ నిషేధం దిశగా అడుగులేస్తోంది భారతీయ రైల్వే. ఇందుకోసం రైల్వేస్టేషన్ల పరిసరాలతో పాటు రైళ్లలోనూ పూర్తిగా ప్లాస్టిక్​ నిషేధానికి నడుం బిగించింది. గతేడాది అక్టోబరు 2 నుంచే వారణాసి రైల్వేస్టేషన్​లో ప్లాస్టిక్​ గ్లాసులు, ప్లేట్లను వాడొద్దని వ్యాపారులకు ఆదేశాలు జారీ చేరింది. వాటికి బదులుగా మట్టిపాత్రలు వినియోగించాలని స్పష్టం చేసింది. ఫలితంగా వారణాసి రైల్వేస్టేషన్​ పరిసరప్రాంతాల్లో కాఫీ, టీ, ఇతర ఆహారపదార్థాలను ప్లాస్టిక్​కు బదులుగా మట్టిపాత్రల్లో విక్రయిస్తున్నారు. తద్వారా మట్టి కుండలు తయారుచేసే వారికి ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు భావిస్తున్నారు.

" దేశవ్యాప్తంగా చేపడుతున్న చర్యల మాదిరిగానే ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ నిషేధానికి మేము కూడా ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికే స్టేషన్​లో ఒకసారి వాడి పడేసే ప్లాస్టిక్​ను పూర్తిగా నిషేధించాం. అయితే బయటి నుంచి ప్రయాణికులు తెచ్చుకునే వాటిని మాత్రం అనుమతిస్తున్నాం. వాటిని కూడా త్వరలోనే నిషేధిస్తాం."
- ఆనంద్​ మోహన్​, స్టేషన్​ డైరెక్టర్​

స్వయాన ప్రధాని పార్లమెంట్​ నియోజకవర్గమైన వారణాసిని మరికొద్దిరోజుల్లోనే పూర్తి ప్లాస్టిక్​ రహిత రైల్వేస్టేషన్​గా మారుస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతానికి కేవలం మంచి నీటి కోసం మాత్రమే ప్లాస్టిక్​ బాటిళ్లను వినియోగిస్తున్నామని.. రాబోయే రోజుల్లో వాటిని కూడా నిషేధించే దిశగా చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. అధికారుల చర్యను ప్రయాణికులు సైతం మెచ్చుకుంటున్నారు. మట్టిపాత్రలు చేసే వారికి జీవనోపాధి దొరుకుతుందని ప్రశంసిస్తున్నారు.

" ఇదొక మంచి ప్రయత్నం. ప్లాస్టిక్​ నిషేధం దిశగా ప్రధానమంత్రి వేసిన అడుగు చాలా మంచింది. పర్యావరణంతో పాటు మానవాళికి కూడా ఇది ఎంతో ప్రయోజనకరం. మట్టిపాత్రలు తయారు చేసే వారికి కూడా ఆర్థికంగా ఉపయోగపడుతుంది. "
- అజీత్​ తుఫానీ, ప్రయాణికుడు

మహాత్మాగాంధీ 150వ జయంతి సందర్భంగా ఒకసారివాడి పడేసే ప్లాస్టిక్​ను నిషేధించాలని ప్రధానమంత్రి గతేడాది అక్టోబర్​ 2న పిలుపునిచ్చారు. అప్పటినుంచి 50 మైక్రాన్ల కంటే తక్కువ మందమున్న ప్లాస్టిక్​ వినియోగాన్ని భారతీయ రైల్వే​ నిషేధించింది.

For All Latest Updates

TAGGED:

Gangadhar Y

ABOUT THE AUTHOR

...view details