తెలంగాణ

telangana

By

Published : Apr 5, 2019, 2:21 PM IST

ETV Bharat / bharat

భారత్​ భేరి: రికార్డుల కింగ్​ సిక్స్ కొడతారా

దేశంలోనే అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన ఘనత ఆయన సొంతం. ఇప్పుడు తన రికార్డును తానే బద్దలుకొట్టాలని చూస్తున్నారు. వరుసగా ఆరోసారి అధికార పగ్గాలు చేపట్టడమే లక్ష్యంగా ప్రచార క్షేత్రంలో దూసుకెళ్తున్నారు. సిక్కింలో ఏం జరుగుతుంది? 'రికార్డుల కింగ్​' పవన్​ చామ్లింగ్​ మళ్లీ ముఖ్యమంత్రి అవుతారా?

రికార్డుల కింగ్​ సిక్స్ కొడతారా

ఈశాన్య రాష్ట్రం సిక్కిం... ప్రకృతి సౌందర్యానికి పెట్టింది పేరు సిక్కిం. హిమాలయ సొగసులు, బౌద్ధాశ్రమాలతో ఎటుచూసినా ఆహ్లాదకర, ప్రశాంత వాతావరణే. జనాభా పరంగానూ చిన్న రాష్ట్రం.

సిక్కిం మరో ప్రత్యేకత... అక్కడి రాజకీయ పరిస్థితి. ఆ రాష్ట్రంలో 1994 నుంచి ఒక పార్టీదే అధికారం. అప్పటి నుంచి ముఖ్యమంత్రి ఒక్కరే. ఇప్పుడు మరోమారు ఎన్నికలు వచ్చాయి. సిక్కిం ఓటరుగణం మరోమారు అదే పార్టీకి జైకొడుతుందా లేక మార్పు కోరుకుంటుందా అన్నది ఆసక్తికరం.

ఇదీ చూడండి:కాషాయదళ 'కాకీ ఎన్నికల' వ్యూహం!

పోలింగ్​ తేదీ ఏప్రిల్​ 11
లోక్​సభ స్థానాలు 1
అసెంబ్లీ స్థానాలు 32
ఓటర్లు 4, 23, 325
అధికార పక్షం సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్
ప్రధాన ప్రత్యర్థి సిక్కిం క్రాంతికారి మోర్చా

సిక్స్​ కొడతారా..?

సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా రికార్డు సృష్టించిన పవన్​ చామ్లింగ్​పైనే అందరి దృష్టి. ఆరోసారి విజయం కోసం ఎన్నికల్లో పోటీకి దిగారు. ఈసారి ముఖ్యమంత్రిగా గెలిస్తే ఆయన రికార్డుకు ఇప్పట్లో ఎదురే ఉండదు.

స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఒక రాష్ట్రానికి అత్యధిక కాలం ముఖ్యమంత్రిగా పనిచేసిన నేతగా జ్యోతి బసు రికార్డును అధిగమించారు చామ్లింగ్​.

  • 1985లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు పవన్​ చామ్లింగ్. రాష్ట్ర మంత్రివర్గంలో సభ్యుడిగా చేశారు. 1993 మార్చి 4న సిక్కిం డెమొక్రటిక్​ ఫ్రంట్​ స్థాపించారు.
  • 1994 ఎన్నికల్లో మొదటిసారి గెలిచి, ప్రభుత్వాన్ని ఏర్పాటుచేశారు చామ్లింగ్. అనంతరం వరుసగా 1999, 2004, 2009, 2014లోనూ అదే పునరావృతం చేశారు.
  • వరుసగా 5 సార్లు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన రెండో నేతగా రికార్డు సృష్టించారు. అంతకుముందు జ్యోతి బసు బంగాల్​కు ఐదుసార్లు వరుసగా సీఎంగా బాధ్యతలు నిర్వహించారు.
  • రాష్ట్రంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారనే పేరుంది. శాంతి స్వభావులుగా ప్రజలు భావిస్తారు.
  • గత అసెంబ్లీ ఎన్నికల్లో 32 స్థానాలకు గాను ఎస్​డీఎఫ్​ 22 గెల్చుకుంది. సిక్కిం క్రాంతికారి మోర్చా(ఎస్​కేఎం) 10 స్థానాలు దక్కించుకుంది.
  • 2014లో రాష్ట్రంలోని ఒక లోక్​సభ స్థానాన్నీ ఎస్​డీఎఫ్​ కైవసం చేసుకుంది.

ఎస్‌కేఎం పుంజుకునేనా...?

2014లో 10 శాసనసభ స్థానాలు గెలుచుకుంది సిక్కిం క్రాంతికారి మోర్చా. ఇప్పుడా పార్టీకి మిగిలింది ఇద్దరు సభ్యులే. ఏడుగురు ఎమ్మెల్యేలు 2015లో అధికార ఎస్‌డీఎఫ్‌లో చేరారు. అవినీతి కేసులో ఏడాది జైలు శిక్ష ఖరారై... పార్టీ అధ్యక్షుడు ప్రేమ్‌ సింగ్‌ తమంగ్‌పై అనర్హత వేటు పడింది. ఫలితంగా పార్టీ కుదేలైంది.

2019 ఎన్నికల్లో సత్తా చాటేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది ఎస్​కేఎం. భాజపాతో పొత్తు పెట్టుకునేందుకు తొలుత మొగ్గుచూపినా... ఆఖరి క్షణంలో మనసు మార్చుకుంది.

ఖాతా తెరిచేనా...?

సిక్కింలో ఇప్పటివరకు ఖాతా తెరవలేదు భాజపా. ఈసారైనా గెలవాలన్న లక్ష్యంతో పనిచేస్తోంది. ఒక లోక్​సభ, 12 శాసనసభ స్థానాల్లో అభ్యర్థుల్ని పోటీకి దింపింది.

ఎస్​కేఎంతో పొత్తుతో సిక్కింలో బలపడవచ్చని భాజపా ఆశించింది. సిక్కిం క్రాంతికారి మోర్చా నిర్ణయం మార్పుతో పరిస్థితి తారుమారైంది.

ఆటగాడు మురిపిస్తాడా?

భారత ఫుట్‌బాల్‌లో భైచుంగ్​ భుటియా స్థానం ప్రత్యేకం. గొప్ప ఆటగాడిగా పేరు గడించారు. ఆటకు రిటైర్మెంట్​ ప్రకటించిన అనంతరం క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించారు. గత లోక్‌సభ ఎన్నికల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున డార్జిలింగ్​లో పోటీ చేసి ఓడిపోయారు. తర్వాత సొంత రాష్ట్రంలో హమ్రో సిక్కిం పార్టీ(హెచ్‌ఎస్‌పీ)ని స్థాపించారు.

సిక్కిం అసెంబ్లీ ఎన్నికల్లో దాదాపు అన్ని సీట్లలో పోటీ చేస్తోంది. ఆటగాడిగా ఉన్నత శిఖరాలను అధిరోహించిన భూటియా రాజకీయాల్లో ఏ మేరకు రాణిస్తారో చూడాలి.

ఇదే విపక్షాల అజెండా

పౌరసత్వ సవరణ బిల్లు, జాతీయ పౌర రిజస్టర్​ వివాదంతో రాష్ట్రంలో సంక్షోభ పరిస్థితి నెలకొంది. ఇవే అధికార పార్టీకి కొంత ప్రతికూలంగా మారే అవకాశాలున్నాయి. వరుసగా 25 ఏళ్లు అధికారంలో ఉన్నందున ప్రజావ్యతిరేకత పెరిగే అవకాశముంది.

ఇదీ చూడండి:భారత్​ భేరి: మాజీ గవర్నర్ X మాజీ దౌత్యవేత్త

ABOUT THE AUTHOR

...view details