తెలంగాణ

telangana

'మహా' ఉత్కంఠ: కాంగ్రెస్​ నిర్ణయంపైనే అందరి దృష్టి

By

Published : Nov 11, 2019, 3:45 PM IST

Updated : Nov 11, 2019, 5:58 PM IST

మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. అధికారం చేపట్టేందుకు మద్దతివ్వాలని ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​ను కోరారు ఉద్ధవ్​ ఠాక్రే. ఇందుకు పవార్​ సానుకూలంగా స్పందించారు. అయితే ఈ వ్యవహారంలో కాంగ్రెస్​ నిర్ణయం కీలకంగా మారింది.

'మహా' ఉత్కంఠ: కాంగ్రెస్​ నిర్ణయమే కీలకం

'మహా' ఉత్కంఠ: కాంగ్రెస్​ నిర్ణయంపైనే అందరి దృష్టి

సమావేశాలు, సంప్రదింపులు, చర్చలతో మహారాష్ట్ర రాజకీయాలు ఉత్కంఠభరితంగా సాగుతున్నాయి. ప్రభుత్వ ఏర్పాటు కోసం గవర్నర్​ భగత్​​ సింగ్​ కోషియారీ ఇచ్చిన అహ్వానం గడువు దగ్గరపడుతున్న కొద్దీ.. శివసేన వేగంగా పావులు కదుపుతోంది. ఇందులో భాగంగానే ఎన్​సీపీ అధ్యక్షుడు శరద్​ పవార్​తో శివసేన అధినేత ఉద్ధవ్​ ఠాక్రే భేటీ అయ్యారు. భాజపాతో తెగదెంపులు చేసుకున్న సేనకు ప్రభుత్వ ఏర్పాటులో మద్దతివ్వాలని పవార్​ను కోరారు. ఇందుకు ఎన్​సీపీ అధినేత సానుకూలంగా స్పందించారు.

సుమారు 45 నిమిషాల పాటు సాగిన అగ్రనేతల భేటీలో... ప్రస్తుత రాజకీయ పరిణామాలు సహా కనీస ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక, వ్యవసాయ సమస్యలపై చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.

కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎదురుచూపులు...

శివసేనకు మద్దతిస్తున్నట్టు ఎన్​సీపీ ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన చెయ్యలేదు. ఈ అంశంపై కాంగ్రెస్​ నిర్ణయం కోసం ఎదురుచూస్తున్నట్టు.. పార్టీ కోర్​ కమిటీ సమావేశం అనంతరం ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​ తెలిపారు. ఎన్నికల్లో కలిసి బరిలో దిగామని, ఎలాంటి నిర్ణయమైనా కలిసే తీసుకుంటామని స్పష్టం చేశారు.

కాంగ్రెస్​ చర్చోపచర్చలు...

దిల్లీలో కాంగ్రెస్​ వర్కింగ్ కమిటీ సమావేశం జరిగింది. సాయంత్రం మహారాష్ట్ర కాంగ్రెస్​ నేతలతో చర్చించి, తీసుకునే నిర్ణయంపై ఆ రాష్ట్ర రాజకీయ భవిష్యత్తు ఆధారపడి ఉంది.

ఎన్డీఏకు సేన గుడ్​బై!

భాజపాపై తీవ్ర విమర్శలు చేస్తున్న శివసేన మరో అడుగు ముందుకేసింది. ఎన్డీఏకు దూరంగా జరుగుతున్నట్లు సంకేతాలిచ్చింది. తన పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేంద్రమంత్రి, శివసేన ఎంపీ అరవింద్​ సావంత్​ ప్రకటించారు. తొలుత 50-50 ఫార్ములాకు భాజపా అంగీకరించి.. ఇప్పుడు మాట మార్చిందని ఆరోపించారు.

ఇదీ చూడండి:- గవర్నర్ కోషియారీ​ చేతిలో 'మహా' భవిష్యత్తు!

Last Updated : Nov 11, 2019, 5:58 PM IST

ABOUT THE AUTHOR

...view details