తెలంగాణ

telangana

నిర్భయకు న్యాయం- మానవ మృగాళ్లకు ఉరి

By

Published : Mar 20, 2020, 5:37 AM IST

Updated : Mar 20, 2020, 10:48 AM IST

దేశ రాజధాని నడిబొడ్డులో అత్యంత దారుణానికి ఒడిగట్టిన మృగాళ్ల మెడకు ఉరి బిగిసింది. తిహార్​ జైలులో ఉదయం 5.30 గంటలకు నిర్భయ కేసులోని నలుగురు దోషులకు తలారి పవన్​ జల్లాడ్​ ట్రిగ్గర్​ నొక్కటంతో ఏడేళ్ల నిరీక్షణకు తెరపడింది.

Seven years after the horrific murder conviction in the Nirbhaya case
నిర్భయ దోషుల మెడకు బిగిసిన ఉరి

దేశంలో సంచలనం సృష్టించిన నిర్భయ హత్యాచారం కేసులో ఏడేళ్ల తర్వాత మృగాళ్లకు ఉరి బిగుసుకుంది. నిర్భయ తల్లి ఏడేళ్ల న్యాయపోరాటానికి నేడు ఫలితం దక్కింది. తెల్లవారుజామున 5.30 గంటలకు తలారీ పవన్​ జల్లాడ్​ ట్రిగ్గర్​ నొక్కి శిక్షను అమలు చేశాడు.

చివరి ఘడియల్లో సుప్రీంకోర్టును ఆశ్రయించినా దోషులకు ఫలితం దక్కలేదు. దోషుల్లో ఒకడైన పవన్​ నేరం చేసినప్పుడు మైనర్​ అని న్యాయవాది ఏపీ సింగ్ వాదించినా కోర్టు స్టే విధించేందుకు నిరాకరించింది. ఇప్పటికే ఈ అంశంలో దిల్లీ హైకోర్టు సహా సుప్రీంకోర్టు తీర్పునిచ్చిందని గుర్తుచేసింది.

అంతకుముందు దిల్లీ హైకోర్టులో నిర్భయ దోషుల పిటిషన్‌పై వాడీవేడి వాదనలు జరిగాయి. పిటిషన్ సమర్పించిన పత్రాలపై కోర్టు అసంతృప్తి వెలిబుచ్చింది. పిటిషన్‌లో అనెక్జర్, అఫిడవిట్, మెమోలు లేవని అసహనం వ్యక్తం చేసింది. అయితే కరోనా వైరస్ ప్రభావంతో కోర్టులో జిరాక్స్ దుకాణాలు కూడా పనిచేయడం లేదని.. అందుకే తేలేకపోయామని దోషుల లాయర్ ఏపీ సింగ్ చెప్పారు. ఫొటో కాపీ మెషీన్లు లేవంటూ కహానీలు చెప్పొదని జడ్జి అన్నారు.

ఇంకా అవకాశాలు ఉన్నాయనీ..

దోషులకు ఇంకా న్యాయపరమైన అవకాశాలు ఉన్నాయని.. మానవ హక్కుల కమిషన్​లో పిటిషన్ పెండింగ్‌లో ఉందని, అలాంటప్పుడు దోషులను ఎలా ఉరితీస్తారని ఏపీ సింగ్ కోర్టును ప్రశ్నించారు. సింగ్ వాదనలు తమకు అర్థం కావడం లేదని.. కేవలం లీగల్ పాయింట్స్ మాట్లాడితే చాలు అని స్పష్టం చేసింది కోర్టు. సమయం గడిచిపోతోందని.. త్వరగా ముగించాలని ఒత్తిడి తెచ్చింది. మీ క్లయింట్‌లు దేవుడి దగ్గరకు వెళ్లే సమయం ఆసన్నమయిందని జడ్జి అన్నారు.

ముఖ్యమైన అంశాన్ని లేవనెత్తకపోతే ఈ సమయంలో సాయం చేయలేదని ఖరాకండిగా చెప్పేసింది కోర్టు. వ్యవస్థతో ఎవరో ఆడుకుంటున్నారని.. రెండున్నరేళ్లు ఆలస్యంగా క్షమాభిక్ష పిటిషన్ వేయడం వెనక కుట్ర దాగున్నట్లు అనిపిస్తోందని అన్నారు. దోషుల తరపు లాయర్ మాత్రం.. న్యాయాన్ని చంపేస్తున్నారని కామెంట్ చేశారు తప్ప.. వాలిడ్ పాయింట్ మాత్రం చెప్పలేదు. ఫలితంగా ఆ పిటిషన్‌ను కొట్టివేశారు హైకోర్టు జడ్జి.

డెత్ వారెంట్‌ను రద్దు చేయాలన్న దోషుల తరఫు పిటిషన్‌ను గురువారం ఉదయం దిల్లీ పాటియాలా హౌస్​ కోర్టు కొట్టివేసింది. వెంటనే దోషుల తరఫు న్యాయవాది హైకోర్టును ఆశ్రయించారు. పలు న్యాయ పత్రాలు ఇంకా కొన్ని కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్నందున ఉరిశిక్షను నిలిపివేయాలని వారు కోర్టును ఆశ్రయించారు.

ఆ పిటిషన్‌పై రాత్రి 10 గంటల సమయంలో అత్యవసర విచారణ జరిగింది. ముగ్గురు దోషులు వేసిన పిటిషన్‌ మీద విచారణ జరిపిన దిల్లీ హైకోర్టు డివిజన్ బెంచ్ జస్టిస్ మన్మోహన్, జస్టిస్ సంజీవ్ నరులా.. వ్యాజ్యాన్ని కొట్టివేశారు. చివరికి పవన్ క్షమాభిక్షను రాష్ట్రపతి తిరస్కరించటాన్ని సుప్రీంకోర్టులో అర్ధరాత్రి సవాలు చేశారు ఏపీ సింగ్.

ఇప్పటికి 3 సార్లు వాయిదా...

నిర్భయ కేసులో దోషులకు ఉరి శిక్ష అమలు చేయాలని తొలుత దిల్లీ కోర్టు 2 నెలల కిందటే డెత్​ వారెంట్​ జారీ చేసింది. అయితే.. వారికున్న న్యాయపరమైన అవకాశాలను ఒక్కొక్కరుగా వాడుకుంటూ మరణ శిక్షను ఆలస్యం చేసే ప్రయత్నాలు చేశారు. ఈ మధ్యలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి.

ఒకరి తర్వాత ఒకరు క్యురేటివ్​ పిటిషన్​, రాష్ట్రపతి క్షమాభిక్ష పిటిషన్​, సుప్రీం కోర్టులో సవాల్​.. వాటి తిరస్కరణల తర్వాత రెండోసారి పిటిషన్లు, అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించడం ఇలా దాదాపు 2 నెలలు జాప్యం చేశారు. ఎట్టకేలకు వారి అవకాశాలన్నీ ముగిసినందున ఉరిశిక్షకు మార్గం సుగమమైంది.

ఇదీ చదవండి:ఉరి తీసే ముందు తలారి తప్పకుండా మందు కొట్టాలా?

Last Updated : Mar 20, 2020, 10:48 AM IST

ABOUT THE AUTHOR

...view details