తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'మెరుపు' దెబ్బకు మూడేళ్లు.. ఉగ్ర శిబిరాలు తునాతునకలు

2016 సెప్టెంబర్​ 29... భారత సైన్యం జూలు విదిల్చింది. 19 మంది జవాన్ల మరణానికి కారణమైన 'ఉరీ' ఘటనకు ప్రతీకారం తీర్చుకుంది. నియంత్రణ రేఖకు ఆవల నక్కి.. భారత్‌లో నరమేధం సృష్టిస్తోన్న ఉగ్రభూతాలపై డేగ కళ్లేసి.. మెరుపుదాడులు చేసి.. మట్టుబెట్టింది. ఆక్రమిత కశ్మీర్‌లోని మూడు సెక్టార్లలో ఉన్న ఏడు ప్రాంతాల్లోని ఉగ్రవాదుల శిబిరాలపై లక్షిత దాడులు (సర్జికల్​ స్ట్రైక్స్​) నిర్వహించి నేలమట్టం చేసింది.

By

Published : Sep 29, 2019, 5:10 AM IST

Updated : Oct 2, 2019, 10:09 AM IST

'మెరుపు' దెబ్బకు మూడేళ్లు.. ఉగ్ర శిబిరాలు తునాతునకలు

19 మంది జవాన్లను పొట్టనపెట్టుకున్న ఘటనకు భారత సైన్యం బదులిచ్చిన వేళ అది.. కన్నీటి సంద్రమైన భరతమాత నేత్రాలు ఎరుపెక్కి... పాక్​ ఉగ్రవాద శిబిరాలపై లక్షిత దాడులుగా మారిన వేళ అది... ప్రతి భారతీయుడి ఛాతీ గర్వంతో ఉప్పొంగిన సమయమది.. 'ఉరీ' ఘటనపై పాక్​కు కోలుకోలేని.. మూడేళ్లైనా తేరుకోలేని 'మెరుపు' దెబ్బ అది.

ఏం జరిగింది..?

2016 సెప్టెంబర్​ 19... జమ్ముకశ్మీర్​లోని ఉరీ ప్రాంతంలోని భారత బ్రిగేడ్ స్థావరంపై జవాన్లు నిద్రిస్తోన్న వేళ నలుగురు ముష్కరులు మారణాయుధాలతో తెగబడ్డారు. ఈ దాడిలో 19 మంది జవాన్లు అమరులయ్యారు. ఈ ఘటనతో యావత్​ దేశం కన్నీటి పర్యంతమైంది. ప్రతీకారాగ్నితో రగిలిపోయింది.

మరో భారీ పన్నాగానికి కుట్రలు జరుగుతోన్న సమాచారం అందుకున్న భారత సైనికులు.. ఉగ్రవాదులను వేటాడేందుకు చరిత్రలోనే తొలిసారిగా 2016 సెప్టెంబర్​ 28.. అర్ధరాత్రి నియంత్రణ రేఖ (ఎల్‌వోసీ)ను దాటి.. గంటల వ్యవధిలో ఆపరేషన్‌ను విజయవంతంగా పూర్తి చేసుకుని సెప్టెంబర్​ 29 సూర్యోదయానికి ముందే సురక్షితంగా తిరిగివచ్చారు.

భారత సహనాన్ని పరీక్షిస్తే చూస్తూ ఊరుకునేది లేదని పాక్‌కు గట్టి హెచ్చరిక పంపారు. దాడుల్లో ఎంతమంది ఉగ్రవాదులు హతమయ్యారన్న వివరాలను సైన్యం ప్రకటించకున్నా.. 40 మందికిపైనే ముష్కరులు హతమైనట్లు తెలిపారు. భారత జవాన్ల సాహసిక చర్యపై యావత్ జాతి హర్షాతిరేకాలు వ్యక్తం చేసింది.

ఎందుకు...?

ఉరీ ఘటనతో సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో ఎలాంటి సవాలునైనా ఎదుర్కొనేందుకు సిద్ధమని సంకేతాలు ఇచ్చిన భారత సైన్యం.. ఉగ్రవాదులకు తడాఖా చూపింది. మరోమారు జమ్ముకశ్మీర్‌లో, వివిధ మెట్రో నగరాల్లో భారీ విధ్వంసం సృష్టించేందుకు ఉగ్రవాదులు కుట్రలు పన్నారన్న విశ్వసనీయ సమాచారం అందుకున్న భద్రతాదళాలు.. ఉగ్రవాదులపై అనూహ్యంగా మెరుపుదాడి చేశారు.

అర్ధరాత్రి దాటిన తర్వాత నియంత్రణరేఖకు ఆవల.. రెండు నుంచి మూడు కిలోమీటర్ల దూరంలో, పాక్ ఆక్రమిత కశ్మీర్లో ఉన్న ఏడు ఉగ్రవాద శిబిరాలపై భారత కమెండోలు విరుచుకుపడ్డారు. హెలికాప్టర్లు, భూమార్గం ద్వారా భారత సైన్యంలోని ప్రత్యేకదళాలకు చెందిన మూడు డివిజన్ల పారా కమెండోలు లక్షిత ప్రాంతాలను చేరుకుని ఆపరేషన్ మొదలు పెట్టారు. అర్ధరాత్రి 12.30 కి మొదలైన లక్షిత దాడి.. ఉదయం 4.30 వరకూ కొనసాగింది.

విశ్వసనీయ సమాచారం...

లక్షిత దాడులు జరిపిన విషయాన్ని అప్పటి సైనిక ఆపరేషన్ల డైరక్టర్ జనరల్ (డీజీఎంవో) లెఫ్టినెంట్ జనరల్ రణ్‌బీర్‌ సింగ్ తరువాతి రోజు విలేకరుల సమావేశంలో ప్రకటించారు. నియంత్రణ రేఖ వెంబడి ఉన్న ఉగ్రవాదులు జమ్ముకశ్మీర్‌తోపాటు దేశంలోని వివిధ మెట్రో నగరాల్లోకి చొరబడి, దాడులకు పాల్పడే ప్రయత్నాలు చేస్తున్నట్లుగా సమాచారం లభించిందని... దాని ఆధారంగా ఉగ్రవాదుల శిబిరాలపై భారతసైన్యం లక్షిత దాడులను నిర్వహించింది అని చెప్పారు.

ఉగ్రవాదులు మనదేశంలోకి చొరబడి, విధ్వంసకర దాడులు చేపట్టి, పౌరుల ప్రాణాలు తీయకుండా అడ్డుకోవాలనే ఏకైక లక్ష్యంతోనే లక్షిత దాడులను నిర్వహించినట్టుగా ఆయన వివరించారు. ఈ దాడుల్లో ఉగ్రవాదులకు, వారికి మద్దతిస్తున్నవారికి గణనీయమైన నష్టం సంభవించిందని తెలిపారు. ఉగ్రవాదులను అడ్డుకోవటం కోసమే వీటిని జరిపామని, లక్షిత దాడులను కొనసాగించే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

తోసిపుచ్చిన పాక్

లక్షితదాడులు జరిపినట్లుగా భారత్ చేసిన ప్రకటనను పాకిస్థాన్ తోసిపుచ్చింది. అటువంటిదేమీ జరగలేదని, సరిహద్దుల్లో సాధారణంగా జరిగే కాల్పులనే లక్షిత దాడులుగా పేరుపెట్టి మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారని పాక్ సైన్యం ఆరోపించింది. బయటకు ఈ విధంగా మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శించినప్పటికీ.. భారతసైన్యం జరిపిన లక్షిత దాడులతో పాకిస్థాన్ నాయకత్వం, ఆ దేశ సైన్యం దిగ్భ్రాంతికి గురయ్యాయి.

సర్వత్రా ప్రశంసలు...

పాకిస్థాన్‌ ఉగ్రవాదులకు గుణపాఠం చెప్పేందుకు భారత సైన్యం మెరుపు దాడులు చేపట్టడం అంతర్జాతీయంగా సంచలనం సృష్టించింది. పటిష్ఠ వ్యూహంతో, అత్యంత ధైర్య సాహసాలతో చేసిన ఈ దాడులతో భారత సైన్యానికి సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తాయి.

మాట నిలబెట్టిన సైన్యం...

ఉరి ఘటనపై ప్రధాని మోదీ నాడు స్పందిస్తూ.. దాడికి పాల్పడినవాళ్లు, వారి వెనుక ఉన్నవాళ్లు శిక్షను తప్పించుకోలేరని, జాతికి ఈ విషయంలో వాగ్దానం చేస్తున్నానని చెప్పారు. ఈ మేరకు 11 రోజుల వ్యవధిలో భారత సైన్యం ప్రధాని మాటను నిలబెట్టింది. దెబ్బకు దెబ్బ తీసి ఉగ్రవాద ముఠాల వెన్నులో వణుకు పుట్టించింది.

Last Updated : Oct 2, 2019, 10:09 AM IST

ABOUT THE AUTHOR

...view details