తెలంగాణ

telangana

By

Published : Sep 5, 2019, 1:24 PM IST

Updated : Sep 29, 2019, 12:48 PM IST

ETV Bharat / bharat

'శ్రీనగర్​కు ముఫ్తీ కుమార్తె... దిల్లీకి తరిగమి'

అధికరణ 370 రద్దుకు సంబంధించిన వివిధ పిటిషన్లపై విచారణ చేపట్టింది సుప్రీంకోర్టు. కశ్మీర్​ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీని కలిసేందుకు ఆమె కుమార్తె ఇల్తీజకు అనుమతి ఇచ్చింది. సీపీఎం నేత తరిగమిని దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆదేశించింది. కశ్మీర్​కు సంబంధించిన వ్యాజ్యాలన్నింటిపై విచారణను ఈనెల 16కు వాయిదా వేసింది.

అధికరణ 370 రద్దుపై సుప్రీం విచారణ- ఇల్తీజ ముఫ్తీకి అనుమతి

అధికరణ 370 రద్దు, జమ్ముకశ్మీర్​లో ఆంక్షలపై దాఖలైన పలు పిటిషన్లపై సుప్రీం కోర్టు విచారణ చేపట్టింది. ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్, సొలిసిటర్​ జనరల్​ తుషార్​ మెహతా వాదనలు వినిపించారు.

ఇల్తీజకు అనుమతి...

తన తల్లి ఆరోగ్యం సరిగా లేదని, చూడటానికి అనుమతివ్వాలంటూ జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తీజ ముఫ్తీ దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది ధర్మాసనం. శ్రీనగర్‌ వెళ్లి ముఫ్తీని కలిసేందుకు ఇల్తీజకు అనుమతించింది. శ్రీనగర్‌లోని ఇంటికి కాకుండా ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే స్థానిక అధికారుల అనుమతి తీసుకోవాలని ఆదేశించింది.

తరిగమిని తరలించాలని ఆదేశం..

జమ్ముకశ్మీర్​ సీపీఎం నేత మహ్మద్​ యూసుఫ్​ తరిగమి ఆరోగ్యం క్షీణించిందని, దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆ పార్టీ అగ్రనేత సీతారాం ఏచూరి దాఖలు చేసిన పిటిషన్​పై విచారణ చేపట్టింది ధర్మాసనం. ఇటీవలే శ్రీనగర్​కు వెళ్లి తరిగమిని కలిసి ఏచూరి... న్యాయస్థానానికి నివేదిక సమర్పించారు. ఈ నివేదిక ఆధారంగా తరిగమి ఆరోగ్యం ముఖ్యమని పేర్కొంది సుప్రీం. ఆయన్ను దిల్లీ ఎయిమ్స్​కు తరలించాలని ఆదేశించింది. ఏచూరి నివేదికపై సమాధానమివ్వాలని కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది.

కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ పిటిషన్​పై వాదనలు...

జమ్ముకశ్మీర్ పరిస్థితులపై కశ్మీర్​ టైమ్స్​ ఎడిటర్​ అనురాధ భాసిన్ వేసిన​ పిటిషన్​పై విచారణ చేపట్టింది సుప్రీం ధర్మాసనం. అధికరణ 370 రద్దు చేసిన 30 రోజుల తర్వాత కూడా జర్నలిస్టులు కశ్మీర్​లో స్వేచ్ఛగా తిరగలేకపోతున్నారని పిటిషనర్​ తరఫు న్యాయవాది పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యల్ని సొలిసిటర్ జనరల్ తోసిపుచ్చారు. భాసిన్ సహా ఇతర సంపాదకులు కావాలనే శ్రీనగర్ నుంచి వార్తా పత్రిక ప్రచురించడంలేదని వాదించారు. జమ్ము, కశ్మీర్​, లద్దాఖ్​ నుంచి వార్తా పత్రికలు ఎప్పటిలానే ప్రచురితమవుతున్నాయని కోర్టుకు నివేదించారు.
ఈ సందర్భంగా కశ్మీర్​లో క్రమక్రమంగా ఆంక్షలు సడలిస్తున్నట్లు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​ న్యాయస్థానానికి తెలిపారు.

తెహసీన్​ పిటిషన్​ తిరస్కరణ..

కశ్మీర్​లో సాధారణ పరిస్థితులు నెలకొల్పేలా ఆదేశించాలని తెహసీన్​ పూనావాలా వేసిన పిటిషన్​ను సుప్రీంకోర్టు తిరస్కరించింది. కశ్మీర్​కు ఎలాంటి సంబంధం లేనివారు పిటిషన్​ వేయటం సరికాదని అభిప్రాయపడింది.

కశ్మీర్​కు సంబంధించిన పిటిషన్లపై వాదనలను ఈనెల 16కు వాయిదా వేసింది సుప్రీంకోర్టు.

ఇదీ చూడండి: కశ్మీర్ జనాభా లెక్కింపునకు సమన్వయ కమిటీ

Last Updated : Sep 29, 2019, 12:48 PM IST

ABOUT THE AUTHOR

...view details