మహారాష్ట్రలో దేవేంద్ర ఫడణవీస్ను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానిస్తూ గవర్నర్ రాసిన లేఖ, అందుకు అంగీకరిస్తూ గవర్నర్కు ఫడణవీస్ ఇచ్చిన లేఖను సమర్పించాలని కేంద్రాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది. ఇందుకోసం సోమవారం ఉదయం పదిన్నర గంటల వరకు గడువు ఇచ్చింది. ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు వ్యతిరేకంగా శివసేన-కాంగ్రెస్- ఎన్సీపీ దాఖలు చేసిన పిటిషన్పై జస్టిస్ ఎన్వీ రమణ, జస్టిస్ అశోక్ భూషణ్, జస్టిస్ సంజీవ్ ఖన్నాతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. ముఖ్యమంత్రి ఫడణవీస్, ఉప ముఖ్యంత్రి అజిత్ పవార్తోపాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులు జారీ చేసింది.
లేఖల సమర్పణకు సుముఖంగా ఉన్నట్లు సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా న్యాయస్థానానికి తెలియజేశారు. ఆ లేఖలు పరిశీలించిన అనంతరం బలపరీక్షపై నిర్ణయం తీసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. విచారణను సోమవారానికి వాయిదా వేసింది.
వెంటనే బలపరీక్ష...
లేఖల సమర్పణపై సుప్రీంకోర్టు ఆదేశాలకు ముందు వాడీవేడి వాదనలు జరిగాయి. మెజార్టీ లేని ఫడణవీస్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ తీసుకున్న నిర్ణయం ఏకపక్షం, రాజ్యాంగవిరుద్ధం, చట్టవిరుద్ధమని ప్రకటించాలని కాంగ్రెస్-ఎన్సీపీ-శివసేన... సర్వోన్నత న్యాయస్థానాన్ని కోరాయి. బేరసారాలు, చట్టవ్యతిరేక చర్యలను నివారించేందుకు వీలుగా 24 గంటల్లోపు విశ్వాసపరీక్ష జరిగేలా ఆదేశించాలని ఈ మూడు పార్టీలు కోర్టుకు విన్నవించాయి.
దేవేంద్ర ఫడణవీస్కు మెజార్టీ ఉంటే నిరూపించుకోవాలని లేదంటే తమకు అవకాశం ఇవ్వాలని శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీ సుప్రీం కోర్టును కోరాయి. 41 మంది ఎన్సీపీ ఎమ్మెల్యేలు భాజపాతో లేరని అయినా వారి మద్దతు ఉందని చెప్పి ఫడణవీస్ సర్కారు ఏర్పాటు చేశారని ఆరోపించాయి.