మానవాళి మనుగడకు ప్రమాదకరంగా మారిన ప్లాస్టిక్ భూతంపై ప్రజల్లో అనేక అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది ఉత్తర్ప్రదేశ్ ఘాజియాబాద్ జిల్లా యంత్రాంగం. పురపాలకసంఘం సంయుక్త కార్యచరణతో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ను నిషేధించాలని ర్యాలీలు నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వస్తోంది.
ఎన్సీఆర్ దిల్లీకి హృదయంగా భావించే ఘాజియాబాద్లో సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వ్యర్థాలతో కేవలం నెలరోజుల్లో మూడు రోడ్లను నిర్మించారు పురపాలక అధికారులు.
" ప్లాస్టిక్ వ్యర్థాలతో విదేశాల్లో రోడ్లను నిర్మించడాన్ని ఆదర్శంగా తీసుకున్నాం. ఉత్తర్ప్రదేశ్లోనూ అలా చేయాలని నిర్ణయించాం. ఘాజియాబాద్ను ప్లాస్టిక్ రహిత జిల్లాగా తీర్చిదిద్దాలనుకున్నాం. అందుకే మొదట ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్లు నిర్మించి లక్ష్యాన్ని చేరుకోవాలనుకున్నాం. ప్లాస్టిక్ వ్యర్థాలను సేకరించి ప్రభావవంతంగా ఉపయోగించాలనుకున్నాం. ఆలోచన కార్యరూపం దాల్చింది. మూడు రోడ్లను నిర్మించాం. మరిన్ని నిర్మిస్తాం. ప్లాస్టిక్ వ్యర్థాలతో రోడ్ల నిర్మాణం గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలూ ఆసక్తిగా ఉన్నాయి. దీంతో మేం ఓ లక్ష్యాన్ని సాధించినట్లయింది. "
-ఆశా శర్మ, ఘాజియబాద్ మేయర్.