ఎన్నేళ్లైనా భూమిలో కరగని ప్లాస్టిక్ను సునాయసంగా నాశనం చేసి, పర్యావరణానికి పునర్జీవం పోసే సరికొత్త కీటకాన్ని కనుగొన్నారు కర్ణాటకలోని ధార్వాడ్ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు.
ఆ కీటకం ఇదే...
ప్లాస్టిక్కు చెక్ పెట్టేందుకు చైనా, స్పెయిన్ దేశాలు కీటకాలపై ప్రయోగాలు చేశాయి. వాటిని ఆధారంగా చేసుకుని ధార్వాడ్ వర్సిటీలోని బయోటెక్నాలజీ విభాగంలో పరిశోధకుడు శీతల్ కేశ్వీ అలాంటి అధ్యయనానికే శ్రీకారం చుట్టారు. ప్రొఫెసర్ డాక్టర్.టీసీ శరవణ సలహా మేరకు చిన్న గొంగలి పురుగులా బియ్యం సంచులో కనిపించే 'రైస్ మోత్ లార్వా' కీటకాన్ని ఈ ప్రయోగానికి ఎంచుకున్నారు.
ప్రయోగం ఇలా..
ఎండిపోయిన తేనెతుట్టెలను ప్లాస్టిక్ సంచిలో ఉంచి.. రైస్ మోత్ లార్వా కీటకాలను అందులో వేశారు శీతల్. కొద్ది రోజులకు సీతాకోక చిలుకలా రెక్కలతో విచ్చుకున్న ఆ కీటకం.. ప్లాస్టిక్ సంచికి రంధ్రాలు చేసుకొని బయటకు రావడం గమనించారు. అంటే, ప్లాస్టిక్ను ఆ చిన్ని కీటకం కొంతమేర నాశనం చేయగలుగుతుందని గ్రహించారు. ఆపై ఆ కీటకాలకు పోషకాహారం అందించి, ఇతర ప్లాస్టిక్ ఉత్పత్తులపైనా ప్రయోగించి సత్ఫలితాలు పొందారు. ఇప్పుడు శీతల్ అధ్యయనం అంతర్జాతీయ జర్నల్లో ప్రచురితమైంది.
"ప్లాస్టిక్ అంతం.. కీటకాలతో ప్లాస్టిక్ వినాశనం అనే రెండు అంశాలపై నేను ప్రయోగం మొదలెట్టాను. స్పెయిన్ ప్రయోగాన్ని అధ్యయనం చేశాకే నాకు ఈ ఆలోచన వచ్చింది. దానిని ఆధారంగా చేసుకొని, రైస్ మోత్ లార్వా కీటకంపై ప్రయోగం మొదలెట్టాను. దేశంలో అనేక కీటకాలపై ప్రయోగాలు జరుగుతున్నాయి కానీ, ఈ బియ్యపు పురుగుతో ప్లాస్టిక్ను నాశనం చేసేందుకు జరిగిన అధ్యనం చేయడం మాత్రం ఇదే తొలిసారి."
-శీతల్ కేశ్వీ, పరిశోధకుడు
ఇదీ చదవండి: రాజ్యసభ వాయిదా.. లోపలే నిరసనకు దిగిన విపక్షాలు