తెలంగాణ

telangana

'సాగు చట్టాలు రద్దు చేస్తేనే ఇంటికి..'

కేంద్రం, రైతుల మధ్య ప్రతిష్టంభన కొనసాగుతూనే ఉంది. 8వ విడత చర్చల్లోనూ ఎలాంటి ఫలితం తేలలేదు. జనవరి 15న మరోసారి భేటీ కావాలని ఇరు వర్గాలు నిర్ణయించాయి. అంతకుముందు.. చర్చల్లో హైడ్రామా నెలకొంది. రైతులు కేంద్రానికి అల్టిమేటం విధించారు. గెలుపో ఓటమో ఇప్పుడే తేలాలని ప్లకార్డులు ప్రదర్శిస్తూ మౌనంగా కూర్చుండి పోయారు. ఏం చేయాలో పాలుపోక హాల్​ నుంచి బయటకు వెళ్లిన మంత్రులు కాసేపు అంతర్గత చర్చలు జరిపారు.

By

Published : Jan 8, 2021, 5:38 PM IST

Published : Jan 8, 2021, 5:38 PM IST

Updated : Jan 8, 2021, 5:55 PM IST

Repeal farm laws, we'll return home
'మీరు చట్టాలను రద్దు చేస్తే మేం ఇంటికెళ్తాం'

కేంద్రం, రైతుల మధ్య జరిగిన 8వ విడత చర్చలూ అసంపూర్తిగానే ముగిశాయి. ఇరు వర్గాలు తమ తమ వైఖరులను పునరుద్ఘాటించగా.. ఎలాంటి ఫలితం తేలలేదు. జనవరి 15న మరోసారి చర్చలు జరపాలని నిర్ణయించింది కేంద్రం.

దిల్లీలో రైతుల ఆందోళన, సాగు చట్టాలను సవాల్​ చేస్తూ దాఖలైన వేర్వేరు పిటిషన్లపై జనవరి 11న సుప్రీం కోర్టులో విచారణ జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే.. చర్చలను 15న ఖరారు చేసినట్లు కేంద్ర వర్గాలు వెల్లడించాయి.

ఈ సమావేశం కాస్త వాడీవేడిగా సాగినట్లు చెప్పారు రైతు సంఘాల ప్రతినిధులు. చట్టాల రద్దు కంటే వేరే పరిష్కారం ఏదీ తమకు వద్దని, కోర్టుకూ వెళ్లబోమని స్పష్టం చేశారు ఆల్​ ఇండియా కిసాన్​ సభ ప్రధాన కార్యదర్శి హన్నాన్​ మోలా. సాగు చట్టాలను రద్దు చేసేంత వరకు తమ పోరాటం కొనసాగుతుందని ఉద్ఘాటించారు. జనవరి 26న నిర్ణయించిన పరేడ్​ యథావిధిగా జరుగుతుందని వెల్లడించారు. జనవరి 11న భవిష్యత్తు కార్యాచరణపై రైతు సంఘాలు చర్చించనున్నట్లు పేర్కొన్నారు.

హైడ్రామా..

దిల్లీ విజ్ఞాన్​ భవన్​లో జరిగిన చర్చల్లో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కొత్త సాగు చట్టాలను రద్దు చేసేవరకు ఇళ్లకు తిరిగి వెళ్లేది లేదని రైతులు పేర్కొనగా.. వివాదాస్పద క్లాజులపైనే చర్చలను పరిమితం చేయాలని కేంద్రం సూచించింది. చట్టాల రద్దుకు ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పింది.

విజయమో.. వీరస్వర్గమో నినాదం ప్రదర్శిస్తున్న రైతు

ఈ నేపథ్యంలో ఆగ్రహించిన రైతులు సమావేశంలోనే.. 'విజయమో వీర స్వర్గమో' అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. గెలుపో ఓటమో తేలాలని మౌనంగా కూర్చొని ఉండిపోయారు. ఒక్కసారిగా ఖంగుతిన్న కేంద్రమంత్రులు హడావుడిగా హాల్​ నుంచి బయటకు వెళ్లిపోయారు. అధికారులు, సహచరులతో అంతర్గతంగా కాసేపు చర్చలు జరిపారు.

రైతులు భోజన విరామం కూడా తీసుకోలేదు. కనీసం టీ, అల్పాహారం అయినా తీసుకోవాలని కేంద్ర మంత్రులు కోరగా... "ఇక్కడకు టీ కోసమో, భోజనం కోసమో రాలేదు. ప్రభుత్వం నుంచి తగిన సమాధానం మాత్రమే కావాలి" అని ఘాటుగా బదులిచ్చారు. ఈ నేపథ్యంలో లంగరును విజ్ఞాన్​ భవన్​ బయటే ఏర్పాటు చేశారు.

విజ్ఞాన్​ భవన్​ బయటే భోజనాలు
లంగరులో భోజనం చేస్తున్న రైతులు

'' మేం ఇంటికి తిరిగి వెళ్లేది.. మీరు చట్టాలను రద్దు చేసిన తర్వాతే.''

- చర్చల సందర్భంగా ఓ రైతు సంఘం నేత

'' వ్యవసాయ సంబంధిత వ్యవహారాల్లో కేంద్రం జోక్యం చేసుకోకూడదని సుప్రీం కోర్టే వేర్వేరు సందర్భాల్లో చెప్పింది. ఇది రాష్ట్రానికి సంబంధించిందని స్పష్టం చేసింది. రైతుల సమస్యకు పరిష్కారం చూపాలన్న ఉద్దేశం మీకు(ప్రభుత్వానికి) లేదు. మీ నిర్ణయం ఏంటో స్పష్టంగా చెప్పండి. ఎందుకు ప్రతి ఒక్కరి సమయాన్ని వృధా చేస్తున్నారు.''

- మరో రైతు సంఘం నేత

'' ప్రాణం పోయే వరకు పోరాటం చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు. కోర్టుకు వెళ్లాలనే ఆలోచనే లేదు. జనవరి 11న రైతు సంఘాల తదుపరి కార్యాచరణ ప్రకటిస్తాం.''

- హన్నాన్​ మోలా, ఆల్​ ఇండియా కిసాన్​ సభ ప్రధాన కార్యదర్శి

కేంద్రం చట్టాలను రద్దు చేసేది లేదని తమతో చెప్పినట్లు వెల్లడించారు సమావేశంలో పాల్గొన్న అఖిల భారత రైతు పోరాట సమన్వయ కమిటీ సభ్యురాలు కవిత కురుగంటి.

వ్యవసాయ సంస్కరణలను వివిధ రాష్ట్రాల్లోని చాలామంది రైతులు స్వాగతిస్తున్నారని, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని పునరాలోచించాలని ఆందోళన చేస్తున్న రైతు సంఘాల ప్రతినిధులను కేంద్రం కోరింది.

ప్రభుత్వం తరఫున కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్​ తోమర్​, సహాయ మంత్రి సోమ్​ ప్రకాశ్​, రైల్వేశాఖ మంత్రి పీయూష్​ గోయల్​, రైతుల తరఫున 41 సంఘాల ప్రతినిధులు ఈ చర్చల్లో పాల్గొన్నారు.

ఇదీ చూడండి:తల్లీబిడ్డలను మోస్తూ మంచులో 3.5కి.మీ నడక

Last Updated : Jan 8, 2021, 5:55 PM IST

ABOUT THE AUTHOR

...view details