తెలంగాణ

telangana

ETV Bharat / bharat

'బ్లాక్'​లో కరోనా మందుల దందా- ధర 6 రెట్లు అధికం

కరోనాతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కొందరు డ్రగ్ వ్యాపారులు మాత్రం డబ్బులు దండుకోవడమే పనిగా పెట్టుకున్నారు. కొవిడ్ రోగుల చికిత్సలో ఉపయోగించే రెమ్​డెసివిర్​ను బ్లాక్​మార్కెట్​లో విక్రయిస్తున్నారు. సాధారణంగా రూ. 4,500 ఉండే ఔషధం కోసం రూ.30 వేలకు పైగా డిమాండ్ చేస్తున్నారు. దేశ రాజధాని దిల్లీలోనే ఈ ఘటన జరగడం కలకలం రేపుతోంది.

By

Published : Jul 9, 2020, 7:32 PM IST

Remdesivirs price in black market went up as if it was gold
బ్లాక్​మార్కెట్​లో రెమ్​డెసివిర్- దిల్లీలో అక్రమార్కుల నిర్వాకం

కరోనా రోగులకు అత్యవసర పరిస్థితుల్లో రెమ్​డెసివిర్​ను ఉపయోగించేందుకు అనుమతించిన కొద్ది వారాల్లోనే బ్లాక్​ మార్కెట్​లో ఈ ఔషధం ధర నింగికెగిసింది. ఈ డిమాండ్​ను ఉపయోగించుకొని ఔషధం నుంచి డబ్బులు దండుకునేందుకు డ్రగ్ వ్యాపారులు, కెమిస్ట్​లు అక్రమమార్గం అనుసరిస్తున్నారు. వైరస్​కు వ్యతిరేకంగా అత్యంత ప్రభావవంతంగా పనిచేసే ఈ ఔషధాన్ని బ్లాక్​ మార్కెట్​లో విక్రయిస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యం వల్ల వీరి దందా మూడు పువ్వులు ఆరు కాయలుగా నడుస్తోంది.

దిల్లీలోని ఓ వ్యాపారికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. తన తోబుట్టువుకు కరోనా సోకడం వల్ల ప్రైవేటు ఆస్పత్రి(కొవిడ్ కేర్ సెంటర్)లో చేర్పించారు.

"రోగికి రెమ్​డెసివిర్​ అవసరం ఉందని ఆస్పత్రిలోని వైద్యుడు నాకు ఫోన్ చేసి చెప్పారు. అయితే రోగి పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని ఔషధాన్ని ముందుగానే ఎక్కించినట్లు తెలిపారు. ఆస్పత్రిలో తగిన నిల్వలు లేవని, కాబట్టి రెండు వయల్స్ తీసుకొచ్చి ఇవ్వాలని నాకు సూచించారు. దిల్లీలోని అధికారిక దుకాణాల్లో దొరకని ఈ రెమ్​డెసివిర్​.. బ్లాక్​ మార్కెట్​లో దొరికింది."

-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త

ఆథరైజ్డ్​ డీలర్ల వద్ద రెమ్​డెసివిర్ కొనుగోలు చేయాలంటే రోగి ఆధార్​ నెంబర్, కొవిడ్ పాజిటివ్ రిపోర్టు, డాక్టర్ ప్రిస్క్రిప్షన్​ తప్పనిసరి. సాధారణంగా దీని ధర రూ. 4,500 ఉంటుంది. చావు బతుకుల సమస్య కావడం వల్ల తప్పనిసరి పరిస్థితుల్లో బ్లాక్​ మార్కెట్ల నుంచే ఔషధాన్ని కొనుగోలు చేస్తున్నారు.

అత్యవసర సమయాల్లో డబ్బులు దండుకోవడానికి అక్రమ మార్గాలు ఎంచుకుంటున్నారని ఈటీవీ భారత్​తో ఆవేదన వ్యక్తం చేశారు రోగి బంధువు.

"మా బంధువు వెంటిలేటర్​పై ఉన్నాడు. రెండు ప్రదేశాల్లో ఔషధం లభించలేదు. ఇతర మార్గాల గురించి అన్వేషిస్తున్నప్పుడు.. కొందరు మా వద్దకు వచ్చి బ్లాక్​మార్కెట్​లో దొరుకుతుందని చెప్పారు. ఒక్క వయల్​ రూ. 15 వేలని చెప్పారు. తర్వాతి రోజు దాన్ని తీసుకోవడానికి నిర్ణయించుకొని వారిని సంప్రదిస్తే.. తొలుత రూ. 27 వేలు ఆ తర్వాత.. రూ. 35 వేలు డిమాండ్ చేశారు. దీని ధర బంగారంలా పెరిగిపోయింది."

-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త

రెండు గంటల ముందు సమాచారం అందిస్తే రెమ్​డెసివిర్​ను అందిస్తామని దిల్లీలోని కొందరు కెమిస్ట్​లు అన్నట్లు బాధితుడి బంధువు చెప్పుకొచ్చారు. ఔషధ ప్రామాణికత గురించి అనుమానం రాకుండా ఎంఆర్​పీ రేట్లతో బిల్లు కూడా ఇచ్చినట్లు తెలిపారు.

"బిల్లు ఇవ్వకుంటే ఔషధం అసలైందో కాదో నాకెలా తెలుస్తుందని నేను కెమిస్ట్​ను అడిగాను. బ్యాచ్ నెంబర్​ వంటి వివరాలను తనిఖీ చేసుకొని ప్రామాణికతను నిర్ధరించుకోవడానికి ఎంఆర్​పీ రేట్లతోనైనా బిల్లు ఇవ్వాలని కోరాను."

-రోగి బంధువు, దిల్లీలోని వ్యాపారవేత్త

దిల్లీలో ఉన్న ఈ బ్లాక్​ మార్కెట్ వ్యాపారం ప్రపంచానికి తెలియాల్సిన అవసరం ఉందని ఆ రోగి బంధువు అభిప్రాయపడ్డారు. తనలా అధిక ధరలకు మందులు కొనే సామర్థ్యం అందరికీ ఉండదని.. సామాన్యులు దీన్ని భరించలేరు కాబట్టి ఈ సమస్యను లేవనెత్తుతున్నట్లు చెప్పారు. చివరకు హెటిరోకు చెందిన అధీకృత డీఎస్​ఏ కంపెనీ నుంచి ఔషధాన్ని పొందినట్లు తెలిపారు. ఈ సమస్యను లోకల్ సర్కిల్ యాప్​ ద్వారా బయటపెట్టారు ఈ వ్యాపారవేత్త. అయితే ఆస్పత్రి పేరు, వివరాలు వెల్లడించలేదు.

యాప్​లోని పోస్ట్ ఆధారంగా డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా వీజీ గోస్వామి చర్యలు చేపట్టారు. రెమ్​డెసివిర్ బ్లాక్ మార్కెట్​పై దర్యాప్తు చేయాలని రాష్ట్ర అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎంఆర్​పీతో పోలిస్తే అధిక ధరలకు ఔషధాలను విక్రయించేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

(రచయిత-కృష్ణానంద్ త్రిపాఠీ)

ఇవీ చదవండి

ABOUT THE AUTHOR

...view details