ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్సీఈపీ) ఒప్పందంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ. భారత్ ఒకవేళ ఆర్సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే అది 'రైతుల పాలిట విధ్వంస ఒప్పందం' అవుతుందని అభిప్రాయపడ్డారు.
"ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ మందగమనంలో ఉంది. ఈ సమయంలో భారత విపణులు దేశీయ రైతులకు చేయగలిగినంత సాయం చేయాలి. భారత్ ఆర్సీఈపీ ఒప్పందంపై సంతకం చేస్తే.. అది దేశ రైతుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది. రైతులు తమ ఉత్పత్తులను విక్రయించే అవకాశాలు సన్నగిల్లుతాయి."
- ప్రియాంకగాంధీ, కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి
ఆర్సీఈపీ రైతుల పాలిట విధ్వంస ఒప్పందం
దిల్లీలో నిరసన
ఆర్సీఈపీలో భారత్ భాగస్వామ్యాన్ని వ్యతిరేకిస్తూ యూత్ కాంగ్రెస్ సభ్యులు, కార్మికులు.. దిల్లీలోని కేంద్రమంత్రి గిరిరాజ్ నివాసం ముందు నిరసన చేపట్టారు. పాడి పరిశ్రమను ఆర్ఈసీపీలో చేర్చడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
స్వేచ్ఛావాణిజ్యం కోసం
10 సభ్యదేశాల ఆసియాన్ కూటమి సహా భారత్, చైనా, జపాన్, దక్షిణ కొరియా, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్లతో కూడిన ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్య కూటమి (ఆర్సీఈపీ) దేశాలు స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై చర్చలు జరుపుతున్నాయి. 2012 నవంబర్లో కంబోడియా రాజధాని నామ్పెన్లో జరిగిన 21వ ఆసియాన్ సదస్సులో దీనికి అంకురార్పణ జరిగింది.
భారత ప్రయోజనాల మేరకే..
మూడు రోజుల పాటు థాయిలాండ్ పర్యటనకు వెళ్లిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. వార్షిక ఆసియాన్-ఇండియా, తూర్పు ఆసియా సదస్సులతో పాటు 'ఆర్సీఈపీ' సదస్సులోనూ పాల్గొంటారు. ఈ నేపథ్యంలో భారత వాణిజ్యానికి సంబంధించి వస్తువులు, సేవలు, పెట్టుబడులకు సంబంధించిన అన్నీ మనకు కేటాయిస్తేనే.. కూటమిలో చేరే విషయాన్ని పరిశీలిస్తామన్నారు. భారత్ తూర్పు విదేశాంగ విధానానికి కీలకంగా ఉన్న ఆర్సీఈపీపై ఆచితూచి వ్యవహరిస్తామని హామీ ఇచ్చారు.
ఇదీ చూడండి:'మహా'పీఠం: శివసేనకు కాంగ్రెస్ మద్దతుపై కొత్త చర్చ