తెలంగాణ

telangana

వైద్యులపై దాడులు అరికట్టే బిల్లుకు రాజ్యసభ ఆమోదం

By

Published : Sep 19, 2020, 5:38 PM IST

వైద్యులపై దాడులను అరికట్టేందుకు కేంద్రం తీసుకొచ్చిన సాంక్రమిక వ్యాధుల సవరణ బిల్లు-2020కి ఎగువసభ ఆమోదం తెలిపింది. బిల్లుపై చర్చ సందర్భంగా.. అధికార పక్షంపై విమర్శల దాడికి దిగారు విపక్ష నేతలు. కేంద్రం రాజ్యాంగ పరిమితుల్ని దాటి ప్రవర్తిస్తోందని మండిపడ్డారు. అయితే.. ఈ బిల్లు చట్టంగా మారితే వైద్య సిబ్బందిపై దాడులకు పాల్పడే వారికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు శిక్ష పడనుంది.

Rajya Sabha passes bill to punish those attacking healthcare workers
వైద్యులపై దాడులు అరికట్టే బిల్లుకు రాజ్యసభ ఆమోదం

సాంక్రమిక వ్యాధుల సవరణ బిల్లు-2020కి రాజ్యసభ ఆమోదం తెలిపింది. వైద్య సిబ్బంది భద్రత కోసం కేంద్రం తీసుకొచ్చిన అంటువ్యాధుల చట్టం సవరణ ఆర్డినెన్స్​ను రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్ గతంలో ఆమోదించారు. ఈ బిల్లును ఇవాళ ఎగువసభలో ప్రవేశపెట్టారు ఆరోగ్య మంత్రి డా.హర్షవర్ధన్​. ఈ బిల్లు చట్టంగా మారితే వైద్యసిబ్బంది, ఆరోగ్య కార్యకర్తలపై దాడులకు పాల్పడే వారికి గరిష్ఠంగా ఐదేళ్ల వరకు శిక్ష పడనుంది.

అయితే.. బిల్లుపై చర్చ సందర్భంగా అధికార పక్షాన్ని లక్ష్యంగా చేసుకొని విపక్షాలు విమర్శలు గుప్పించాయి. ఈ చట్టం ద్వారా రాజ్యాంగ పరమైన పరిమితులు దాటి మరీ కేంద్రం రాష్ట్రాల వ్యవహరాల్లో కేంద్రం కలుగచేసుకోవాలని చూస్తోందని తృణమూల్​ కాంగ్రెస్​ ఎంపీ డెరెక్ ఓబ్రియిన్ ఆరోపించారు.

రాష్ట్రాలతో సంప్రదింపులేవీ?

ప్రపంచంలో 3 ప్రజాస్వామ్య దేశాల్లో మాత్రమే ఆర్డినెన్స్‌ల రాజ్యం నడుస్తోందని అవి పాకిస్థాన్​, బంగ్లాదేశ్, భారత్ అని డెరెక్ అన్నారు. వైస్రాయ్‌ల శకం ముగిసినప్పటికీ భాజపా నాయకుల్లో ఆ వాసనలు మిగిలే ఉన్నాయని ఎద్దేవా చేశారు. రాష్ట్రాల విషయాల్లో జోక్యం చేసుకునే ముందు కేంద్రం ఆ రాష్ట్రాలతో సంప్రదింపులు జరపాలని తెరాస నేత కేశవరావు అన్నారు.

కరోనా వేళ ప్రైవేటు ఆస్పత్రుల దోపిడీని నిలువరించడంలో కేంద్రం విఫలమైందని.. దాని ఫలితమే హైదరాబాద్‌లో ఓ ఆస్పత్రి దోపిడీకి కారణమైందని మండిపడ్డారు. దీన్ని అరికట్టేందుకు ఓ వ్యవస్థ ఉండాలన్నారు. సమాజ్‌వాదీ పార్టీ కూడా ఇదే విధమైన అభిప్రాయాన్ని వెల్లడించింది.

'సంక్షోభ సమయంలో విఫలం'

పేదలు, వలస కార్మికులను ఆదుకోవడంలోనూ కేంద్రం విఫలమైందని విపక్షాలు ధ్వజమెత్తాయి. వలస కార్మికులను ఆకలిచావులకు గురిచేసిన గుత్తేదార్లపై ఏ విధమైన చర్యలు తీసుకుంటారో చెప్పాలని డీఎంకే డిమాండ్ చేసింది. సరైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోకుండానే లాక్​డౌన్​ అమలు చేశారని ఆరోపించారు డీఎంకే ఎంపీ షణ్ముగం.

ABOUT THE AUTHOR

...view details