తెలంగాణ

telangana

'వారితో మంచి సంబంధాలే కోరుకున్నాం.. కానీ'

By

Published : Oct 25, 2020, 6:24 AM IST

పొరుగుదేశాలతో భారత్ మంచి సంబంధాలే కోరుకుంటుందని.. కానీ సైన్యం అత్యున్నత త్యాగాలు చేసే పరిస్థితులు ఎప్పటికప్పుడు తలెత్తుతున్నాయని రక్షణ మంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. ఈసారి కూడా 20 మంది జవాన్లు దేశం కోసం ప్రాణాలర్పించారని అన్నారు. భారత ఆర్మీ 33 కార్ప్స్​ సమావేశంలో పాల్గొన్న ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

Rajnath reviews LAC situation in eastern sector at Army's Trishakti Corps in Sukna
'పొరుగుదేశాలతో మంచి సంబంధాలే కోరుకున్నాం, కానీ'

పొరుగు దేశాలతో మంచి సంబంధాలు కొనసాగించేందుకు భారత్​ ఎల్లప్పుడూ ప్రయత్నించిందని రక్షణమంత్రి రాజ్​నాథ్ సింగ్ పేర్కొన్నారు. అయితే దేశ సార్వభౌమాధికారం, సమగ్రతను కాపాడేందుకు సైనికులు అత్యున్నత త్యాగాలు చేయాల్సిన పరిస్థితులు ఎప్పటికప్పుడు తలెత్తాయని వ్యాఖ్యానించారు.

డార్జిలింగ్​, సున్కాలోని ఇండియన్ ఆర్మీ 33 కార్ప్స్​ సైనికులను ఉద్దేశించి రాజ్​నాథ్ ప్రసంగించారు. అంతకుముందు అత్యున్నత సమావేశంలో పాల్గొన్న ఆయన.. సిక్కిం సెక్టార్​లో వాస్తవాధీన రేఖ వద్ద పహారా కాసే కార్ప్స్​ 33 యుద్ధ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు.

"పొరుగువారితో భారత్ మంచి సంబంధాలనే కోరుకుంటుంది. వారితో మంచి సంబంధాల కోసం భారత్ ఎల్లప్పుడూ ప్రయత్నాలు చేసింది. కానీ కాలక్రమేణా కొన్ని పరిస్థితులు తలెత్తాయి.. మన సైనికులు దేశ సారభౌమత్వం, సమగ్రతను కాపాడేందుకు అత్యున్నత త్యాగాలు చేయాల్సి వచ్చింది. ఈసారి కూడా బిహార్ రెజిమెంట్​కు చెందిన 20 మంది జవాన్లు దేశ రక్షణ కోసం తమ ప్రాణాలను త్యాగం చేశారు. అవతలి(చైనా) వైపు ఏం జరిగిందో నేను చెప్పాలనుకోవడం లేదు."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

బంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో రెండు రోజుల పర్యటన నిమిత్తం రాజ్​నాథ్ సింగ్ ఈ సైనిక శిబిరాన్ని శనివారం సందర్శించారు. లద్దాఖ్​లో సైనిక ప్రతిష్టంభన మధ్య ఆర్మీ సన్నద్ధతపై సమీక్ష నిర్వహించడం సహా.. సైన్యంతో దసరా సంబరాలు చేసుకోనున్నారు రాజ్​నాథ్. సైన్యాధ్యక్షుడు జనరల్ మనోజ్ ముకుంద్ నరవాణె సైతం రాజ్​నాథ్ వెంటవచ్చారు.

ఈ సందర్భంగా సైనికులకు, వారి కుటుంబసభ్యులకు విజయదశమి శుభాకాంక్షలు తెలిపారు రాజ్​నాథ్. దేశం మొత్తం సైన్యాన్ని చూసి గర్వపడుతోందని అన్నారు.

"మీలాంటి ధైర్యవంతులైన సైనికుల వల్లే దేశ సరిహద్దులు సురక్షితంగా ఉన్నాయి. దేశం మొత్తం మీ పట్ల గర్వపడుతోంది. త్రిశక్తి(33 కార్ప్స్​ మరోపేరు) కార్ప్స్​కు ఎంతో చరిత్ర ఉంది. ముఖ్యంగా 1962, 1967, 1971, 1975 సంవత్సరాల్లో ఈ దళం శౌర్యానికి ప్రతీకగా నిలిచింది. మీతో పాటు మీ కుటుంబ సభ్యులందరికీ విజయదశమి శుభాకాంక్షలు."

-రాజ్​నాథ్ సింగ్, రక్షణ మంత్రి

దసరా సందర్భంగా సిక్కింలోని షెరాతంగ్​లో రాజ్​నాథ్ సింగ్ ఆయుధ పూజ నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో వాస్తవాధీన రేఖ వెంబడి భద్రతను మరింత కట్టుదిట్టం చేశారు.

ABOUT THE AUTHOR

...view details