దేశంలో ఓ వైపు కొవిడ్-19 ఉద్ధృతి కొనసాగుతుండగా.. మరోవైపు కొందరు నిబంధనలు ఉల్లంఘిస్తూ వివాహాలు, పలు శుభకార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. నిబంధనలు తప్పకుండా పాటించాలని ప్రభుత్వాలు ఎంత చెప్పిన పెడచెవిన పెడుతున్నారు. నిర్లక్ష్యం కారణంగా పెద్ద ఎత్తున కరోనా కేసులు నమోదవుతున్నాయి. దీనికి పరిష్కారంగా ఓ కలెక్టర్ వినూత్ననంగా ఆలోచించాడు. కొవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి రూ.6 లక్షలకుపైగా జరిమానా విధించారు.
రాజస్థాన్లోని బీల్వాడా జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడి వివాహం జరిపించాడు. కరోనా ముప్పు నేపథ్యంలో శుభకార్యక్రమాలకు కేవలం 50 మంది అతిథులకే అధికారుల అనుమతి ఉంది. ఈ నిబంధనలను లెక్కచేయని ఆ కుటుంబం వివాహ వేడుకకు భారీ సంఖ్యలో అతిథులను పెళ్లికి ఆహ్వానించింది. అనంతరం ఈ వేడుకకు హాజరైన వారిలో 15 మందికి కరోనా సోకినట్లు తేలింది. వీరిలో ఒకరు తీవ్ర లక్షణాలతో బాధపడుతూ చనిపోయారు. ఈ ఘటనకు కారణమైన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈ నెల 22న కేసు నమోదు చేశారు.