తెలంగాణ

telangana

ఉద్దేశపూర్వకంగా ఆపాదించలేదు : రాహుల్​

By

Published : Apr 29, 2019, 4:45 PM IST

రఫేల్​ తీర్పుపై తన వ్యాఖ్యలను కోర్టుకు ఉద్దేశపూర్వకంగా ఆపాదించలేదని అత్యున్నత న్యాయస్థానానికి వివరణ ఇచ్చారు రాహుల్​ గాంధీ. తనకు ఆ ఆలోచనే లేదన్నారు. కోర్టు ధిక్కరణ కేసులో ఈ మేరకు సుప్రీంకోర్టులో నేడు మరో ప్రమాణపత్రం దాఖలు చేశారు.

రాహుల్​ గాంధీ, సుప్రీంకోర్టు

కోర్టు ధిక్కరణ నోటీసులపై సుప్రీం కోర్టులో మరో ప్రమాణపత్రాన్ని దాఖలు చేశారు కాంగ్రెస్​ అధ్యక్షుడు రాహుల్​ గాంధీ. రఫేల్​ అంశంలో సుప్రీంకోర్టు తీర్పునకు, తన వ్యాఖ్యలకు ముడిపెట్టడంపై విచారం వ్యక్తం చేస్తున్నానని విన్నవించారు.

కాపలాదారే దొంగ అని రఫేల్​ తీర్పులో సుప్రీంకోర్టే చెప్పిందని గతంలో రాహుల్​ గాంధీ వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ భాజపా నేత మీనాక్షి లేఖి కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. కోర్టు సైతం వ్యాఖ్యలను తప్పుగా ఆపాదించారని అభిప్రాయపడుతూ రాహుల్​కు ఈ నెల 23న నోటీసులు జారీ చేసింది. దీనిపై గతంలో ఓ అఫిడవిట్​ దాఖలు చేసిన రాహుల్​.. తాజా మరొకటి సమర్పించారు. కోర్టు ధిక్కరణ పిటిషన్​ను కొట్టివేయాలని కోరారు.

"ఏ కోర్టూ అలాంటి వ్యాఖ్యలు చేయదు. అనుకోకుండా కోర్టు ఆ వ్యాఖ్యలు చేసిందని చెప్పా. అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదు. రాజకీయ ప్రచార వేడిలో అన్నా. అదో రాజకీయ నినాదం. రాజకీయాల్లోకి న్యాయస్థానాన్ని తీసుకురావాలనే ఉద్దేశం నాకు ఏ మాత్రం లేదు. కోర్టు చెప్పని మాటలను ఆపాదించాలన్న ఆలోచన అసలే లేదు. "

-- అఫిడవిట్​లో రాహుల్​ గాంధీ

రాజకీయ ప్రయోజనాల కోసమే తన వ్యాఖ్యలను వక్రీకరించారని కోర్టుకు విన్నవించారు రాహుల్​ గాంధీ.

" రాజకీయ ప్రయోజనాల కోసం, వివాదం చేసేందుకు, వ్యక్తిగత లాభం కోసం పిటిషనర్​ ​(భాజపా నేత లేఖీ) నాపై కోర్టు ధిక్కరణ పిటిషన్​ వేశారు. "

-- అఫిడవిట్​లో రాహుల్​ గాంధీ

రాహుల్​పై దాఖలైన కోర్టు ధిక్కరణ పిటిషన్​పై రేపు విచారణ జరపనుంది అత్యున్నత న్యాయస్థానం.

ABOUT THE AUTHOR

...view details