తెలంగాణ

telangana

ETV Bharat / bharat

సోనియా గాంధీకే మరోమారు 'కాంగ్రెస్'​ పగ్గాలు

గత కొద్ది రోజులుగా కాంగ్రెస్​ పార్టీలో కొనసాగిన సందిగ్ధం వీడింది. సుదీర్ఘ చర్చ అనంతరం.. యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకుంది కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ). నూతన సారథి నియమితులయ్యే వరకు.. ఆమెనే అధ్యక్షులుగా కొనసాగనున్నట్లు స్పష్టం చేశారు పార్టీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్. ​

By

Published : Aug 11, 2019, 5:18 AM IST

Updated : Aug 11, 2019, 7:55 AM IST

సోనియా గాంధీకే మరోమారు కాంగ్రెస్​ పగ్గాలు...

సోనియా గాంధీకే మరోమారు 'కాంగ్రెస్'​ పగ్గాలు

కాంగ్రెస్​ పార్టీ పగ్గాలు మరోసారి యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీకే దక్కాయి. శనివారం రెండు సార్లు సమావేశమైన కాంగ్రెస్​ వర్కింగ్​ కమిటీ(సీడబ్ల్యూసీ) సుదీర్ఘ చర్చ అనంతరం.. ఆమెను తాత్కాలిక అధ్యక్షురాలిగా నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. నూతన సారథిని ఎన్నుకునే వరకు ఆమె అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించనున్నారు.

కాంగ్రెస్​ అధ్యక్షుడిగా రాహుల్​ గాంధీనే కొనసాగాలని సీనియర్​ నేతలు ఎంత ఒప్పించే ప్రయత్నం చేసినా ఆయన ససేమీరా అన్నారు. చివరకు రాహుల్​ గాంధీ రాజీనామాను అంగీకరించింది పార్టీ అత్యున్నత విధాన నిర్ణాయక కమిటీ. పార్టీ సారథిగా ఆయన చేసిన సేవలను కొనియాడుతూ ప్రవేశపెట్టిన తీర్మానాన్ని సీడబ్ల్యూసీ ఆమోదించింది. అనంతరం.. సోనియాను తాత్కాలిక అధ్యక్షురాలిగా ప్రకటిస్తూ మరో తీర్మానాన్ని ఆమోదించింది.

''కాంగ్రెస్ అధ్యక్షుడిగా రాహుల్​ గాంధీ సేవలను సీడబ్ల్యూసీ కొనియాడింది. పార్టీ కోసం ఆయన అంకితభావంతో పని చేశారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల్లో సమర్థంగా పనిచేశారు. మహిళలు, వెనుకబడిన వర్గాలు, కార్మికులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలకోసం ప్రతిరోజు పోరాటం చేశారు. అన్ని రాష్ట్రాల పీసీసీ, సీఎల్పీ, ఏఐసీసీ కార్యదర్శులు, ఫండింగ్​ చేసేవారి ప్రతిపాదనలను పరిగణనలోకి తీసుకున్నాం. రాహుల్​ గాంధీనే అధ్యక్షుడిగా కొనసాగాలని నిర్ణయించాం. అయితే రాజీనామా వెనక్కి తీసుకునేందుకు ఆయన నిరాకరించారు. ఫలితంగా ఏఐసీసీ నిబంధనల మేరకు ఓటింగ్ జరిగే వరకు సోనియా గాంధీని తాత్కాలిక అధ్యక్షురాలిగా కొనసాగాలని కోరాం. అందుకు ఆమె అంగీకరించారు.''

- కేసీ వేణుగోపాల్​, కాంగ్రెస్​ ప్రధాన కార్యదర్శి

సుదీర్ఘ చర్చ..

పార్టీ నూతన సారథి ఎంపిక కోసం సీడబ్ల్యూసీ శనివారం రెండు సార్లు సమావేశమైంది. ఉదయం ఓ సారి భేటీ అయిన కమిటీ.. కొత్త అధ్యక్షుడిపై దేశవ్యాప్తంగా పార్టీ నేతల అభిప్రాయం తెలుసుకునేందుకు సీడబ్ల్యూసీ సభ్యులతోనే 5 బృందాలను ఏర్పాటు చేసింది. వీటిని ఈశాన్య, తూర్పు, పశ్చిమ, ఉత్తర, దక్షిణ భారతంగా విభజించారు. అయితే.. వారంతా రాహుల్​నే అధ్యక్షుడిగా కొనసాగాలని కోరినప్పటికీ ఆయన సున్నితంగా తిరస్కరించారు. అనంతరం... రాహుల్​ గాంధీ రాజీనామాను ఆమోదించి సోనియాను పార్టీ తాత్కాలిక అధ్యక్షురాలిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటించింది సీడబ్ల్యూసీ.

38 రోజుల అనిశ్చితికి తెర..?

రాహుల్​ గాంధీ కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి 2019 జులై 3న రాజీనామా చేశారు. అనంతరం.. 38 రోజులకు నూతన సారథి అంశంపై నిర్ణయం తీసుకున్నారు. ఫలితంగా.. కొద్ది రోజులుగా కొనసాగిన అనిశ్చితికి తాత్కాలికంగా తెరపడినట్లయింది.

అయితే.. రాహుల్​ రాజీనామాతో పార్టీపై తీవ్ర ప్రభావం పడింది. నాయకత్వలేమి కారణంగా కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పలువురు నాయకులు కాంగ్రెస్​ను వీడారు. రాజ్యసభ ఎంపీ సంజయ్​ సింగ్​ ఇటీవలే పార్టీకి రాజీనామా చేశారు. నూతన అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమైతే.. హస్తం పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పకపోవచ్చని ఇటీవల కొందరు సీనియర్లు తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఈ తరుణంలో.. నూతన సారథి ఎన్నిక అనివార్యమైంది.

Last Updated : Aug 11, 2019, 7:55 AM IST

ABOUT THE AUTHOR

...view details