తెలంగాణ

telangana

భారత్​ బంద్​కు మద్దతుగా విపక్షాల సంయుక్త ప్రకటన

By

Published : Dec 6, 2020, 8:43 PM IST

డిసెంబర్ 8న రైతులు పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు దేశంలోని ప్రధాన విపక్ష పార్టీలు మద్దతు ప్రకటించాయి. కాంగ్రెస్, ఎన్​సీపీ, ఆర్జేడీ తదితర పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. రైతుల సమస్యలను పరిష్కరించాలని పార్టీలన్నీ కేంద్రాన్ని డిమాండ్ చేశాయి. వ్యవసాయ చట్టాలు అప్రజాస్వామిక రీతిలో పార్లమెంట్ ఆమోదం పొందాయని ఆరోపించాయి.

Prominent opposition leaders issue joint statement backing farmers' stir and Dec 8 Bharat Bandh
భారత్​ బంద్​కు మద్దతుగా విపక్షాల సంయుక్త ప్రకటన

వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసన చేపట్టిన అన్నదాతలకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. దేశంలోని ప్రధాన రాజకీయ పక్షాలు వారికి అండగా నిలుస్తున్నాయి. ఈ నెల 8న రైతులు పిలుపునిచ్చిన భారత్​ బంద్​కు మద్దతు ప్రకటిస్తూ ప్రధాన విపక్ష పార్టీలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయి. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఎన్​సీపీ నేత శరద్ పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి, డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్, గుప్కర్ కూటమి ఛైర్మన్ ఫరూఖ్ అబ్దుల్లా ప్రకటనపై సంతకం చేశారు. రైతులు చేస్తున్న న్యాయబద్ధమైన డిమాండ్లను కేంద్రం పరిష్కరించాలని స్పష్టం చేశారు.

వ్యవసాయ చట్టాలు అప్రజాస్వామిక రీతిలో పార్లమెంట్ ఆమోదం పొందాయని నేతలు ధ్వజమెత్తారు. సరైన చర్చ, ఓటింగ్ జరగకుండానే ఆమోదించారని మండిపడ్డారు. ఈ చట్టాలు భారత్​లో ఆహార భద్రతకు విఘాతం కలిగిస్తాయని ఆరోపించారు. దేశంలో వ్యవసాయ రంగాన్ని, రైతులను నాశనం చేస్తాయని అన్నారు. కనీస మద్దతు ధర రద్దుకు ఇవి బాటలు పరుస్తాయని, వ్యవసాయాన్ని పెద్ద కార్పొరేట్ల పరం చేస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు.

ఇదీ చదవండి:వెనక్కితగ్గని అన్నదాత- పెరుగుతున్న మద్దతు

ఈ సంయుక్త ప్రకటనపై సంతకం చేసినవారిలో ఆర్జేడీ అధినేత తేజస్వీ యాదవ్, సమాజ్​వాదీ పార్టీ చీఫ్ అఖిలేష్ యాదవ్, సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా, సీపీఐ(ఎంఎల్) ప్రధాన కార్యదర్శి దీపాంకర్ భట్టాచార్య, ఏఐఎఫ్​బీ(ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్) ప్రధాన కార్యదర్శి దేబబ్రతా బిశ్వాస్, ఆర్​ఎస్​పీ(రివల్యూషనరీ సోషలిస్ట్ పార్టీ) ప్రధాన కార్యదర్శి మనోజ్ భట్టాచార్య సైతం ఉన్నారు.

ఇదీ చదవండి:భారత్​ బంద్​కు కాంగ్రెస్​ మద్దతు

ABOUT THE AUTHOR

...view details