మహారాష్ట్ర పుణెలోని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాలో జరిగిన అగ్నిప్రమాద ఘటనపై.. రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ విచారం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటన తనను తీవ్రంగా బాధించినట్టు చెప్పారు. మృతుల కుటుంబాలకు సంతాపం ప్రకటించిన ఆయన.. ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నట్టు ట్వీట్ చేశారు.
మోదీ సంతాపం
ఈ ఘటనలో మరణించిన వారికి ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. 'ఈ విషాదకర ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి కుటుంబాలకు సంతాపం ప్రకటిస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా,' అని ట్విట్టర్లో పేర్కొన్నారు.
గురువారం మధ్యాహ్నం.. సీరం టర్మినల్ గేట్ 1 వద్ద ఎస్ఈజెడ్-3 భవనం 4, 5 అంతస్తుల్లో మంటలు చెలరేగాయి. అనంతరం.. సహాయక చర్యలు చేపట్టిన అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.
ఈ దుర్ఘటనపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్ సహా.. పలువురు భారతీయ జనతా పార్టీ నాయకులూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
రాహుల్ ట్వీట్..
సీరం ఇన్స్టిట్యూట్లో దుర్ఘటన తనను తీవ్రంగా బాధించిందని కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ అన్నారు.
'ఈ అగ్నిప్రమాదంతో తీవ్రంగా కలత చెందాను. ఈ వార్త చాలా ఆందోళన కలిగించింది. మృతుల కుటుంబానికి నా సంతాపం. బాధిత కుటుంబసభ్యులకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాను.'
- రాహుల్ గాంధీ, కాంగ్రెస్ సీనియర్ నేత.
'సీరం'ను సందర్శించిన ఉప ముఖ్యమంత్రి
ప్రమాదం జరిగిన సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించారు ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్. మంటలు చెలరేగిన ఫ్లోర్లో.. ఒప్పంద కార్మికులు పనిచేసే వారని ఆయన తెలిపారు. అయితే.. అగ్నిమాపక దళాలు అక్కడికి చేరుకునేలోపే ఐదుగురు(పుణె-2, యూపీ-2, బిహార్-1) మంటల్లో సజీవ దవహనమయ్యారని పేర్కొన్నారు. వ్యాక్సిన్ తయారీ కేంద్రం మాత్రం సురక్షితంగానే ఉందని వెల్లడించారు పవార్. సీఎం ఉద్ధవ్ ఠాక్రే కూడా శుక్రవారం సీరం ఇన్స్టిట్యూట్ను సందర్శించే అవకాశముందని ఆయన చెప్పారు.
రూ.25లక్షల పరిహారం..
ఈ ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల చొప్పున పరిహారం ఇవ్వనున్నట్టు ప్రకటించారు ఆ సంస్థ ఛైర్మన్ అదర్ పూనావాలా.
ఇదీ చదవండి:'సాగు చట్టాల్ని రద్దు చేయాల్సిందే.. మరో మాట లేదు'