దిల్లీలోని అనాజ్మండీలో నాలుగు అంతస్థుల భవనంలో జరిగిన అగ్నిప్రమాదంలో 43 మంది మృత్యువాతపడ్డారు. తాజాగా ఈ ఘటనపై రాజకీయ దుమారం చెలరేగింది. భవనంలోని యూనిట్లకు ప్రత్యామ్నాయ స్థలాన్ని ఇచ్చినా..దిల్లీ సర్కారు వారిని అక్కడకు తరలించకపోవడం వల్లే అవి ఇంకా అక్కడే ఉన్నాయని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పురి ఆరోపించారు. భాజపా శవ రాజకీయాలు చేస్తోందని ఆమ్ఆద్మీ పార్టీ మండిపడింది. ఈ రెండు పార్టీలనూ కాంగ్రెస్ తప్పుబట్టింది.
కేజ్రీవాల్పై భాజపా విమర్శలు..
అగ్నిప్రమాదంలో 43 మంది ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన రోజే ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తిమార్పుర్లో ప్రాజెక్టు శంకుస్థాపనకు వెళ్లారని.. అది ఆయన కఠిన మనస్తత్వానికి నిదర్శనమని విమర్శించారు దిల్లీ భాజపా అధ్యక్షుడు మనోజ్ తివారీ. ఈయన వ్యాఖ్యలను తిప్పికొట్టింది ఆమ్ ఆద్మీ పార్టీ. అగ్ని ప్రమాదంలో మృత్యువాతపడ్డ వారికి సంతాపం తెలిపిన తర్వాతే కార్యక్రమం ముగించినట్లు బదులిచ్చింది.