ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా జమ్ముకశ్మీర్లోని ప్రధాన రాజకీయ పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. ఈ మేరకు గురువారం సమావేశాన్ని నిర్వహించాయి. రాష్ట్రం, ప్రత్యేక హోదా పునరుద్ధరణ కోసం కలిసి పని చేయాలని నిర్ణయించాయి. ఈ సమస్య గురించి సంబంధిత వర్గాలతో చర్చించాలని సమావేశంలో తేల్చాయి.
ఈ భేటీ నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అధ్యక్షుడు ఫారుక్ అబ్దుల్లా నివాసంలో జరిగింది. ఇందులో పీడీపీ అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ, పీపుల్స్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ సాజద్ లోన్, పీపుల్స్ మూమెంట్ నేత జావైద్ మీర్, సీపీఎం నేత మహ్మద్ యూసఫ్ తరిగామి పాల్గొన్నారు.
ఒక్కతాటిపైకి..
రెండు గంటల పాటు చర్చించిన తర్వాత భేటీలో తీసుకున్న నిర్ణయాలపై మీడియాకు తెలిపారు అబ్దుల్లా. అందరు నేతలు ఏకతాటిపైకి వచ్చేందుకు అంగీకరించారని, ఈ కూటమికి 'పీపుల్స్ అలియన్స్ ఫర్ గుపకార్ డిక్లరేషన్' అని నామకరణం చేసినట్లు వెల్లడించారు.
ఆర్టికల్ 370 పునరుద్ధరణ జరిగే వరకు ఈ కూటమి కొనసాగుతుందని స్పష్టం చేశారు అబ్దుల్లా. ఈ సందర్భంగా 14 నెలల నిర్బంధం తర్వాత విడుదలైన ముప్తీకి అబ్దుల్లా శుభాకాంక్షలు తెలిపారు.