ఉత్తర్ప్రదేశ్లో బలవంతపు మతమార్పిడిలకు వ్యతిరేకంగా యోగి ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ కింద కేసులు పెరుగుతున్నాయి. తాజాగా లఖ్నవూలో ఓ మతాంతర వివాహాన్ని అడ్డుకున్నారు పోలీసులు. అయితే.. ఇక్కడ వధూవరుల కుటుంబ సభ్యుల సమ్మతితోనే ఈ వివాహం జరుగుతుండటం గమనార్హం. దీంతో 'లవ్ జిహాద్' ఆర్డినెన్స్పై పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"వివాహం జరుగుతుందా? లేదా అనేది పోలీసులు నిర్ణయిస్తారు. ఇద్దరు మేజర్లు కలిసి జీవించేందుకు ఎవరూ అడ్డుచెప్పలేరని కోర్టులు చెబుతున్నాయి. కానీ, ఈ ఆర్డినెన్స్ వల్ల పోలీసులు అడ్డుకునే పరిస్థితులు తలెత్తాయి." అని పేర్కొన్నారు పెళ్లికి హాజరైన మరూప్ అలీ. అలాగే.. వధువు బంధువులు కూడా ఈ ఘటనపై అసహనం వ్యక్తం చేశారు. ఇరువురి కుటుంబాల సమ్మతితో, వారి సమక్షంలో జరుగుతోన్న పెళ్లిని పోలీసులు అడ్డుకోవటం గతంలో ఎక్కడా చూడలేదన్నారు. స్వతంత్ర భారతంలో ఇలాంటి ఘటన ఒకటి ఎదురవుతుందని అనుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు.
హిందూ మహాసభ జిల్లా అధ్యక్షుడు బ్రిజేశ్ శుక్లా.. ఫిర్యాదు మేరకు పోలీసులు చర్యలు చేపట్టినట్లు సమాచారం. గత బుధవారం రాత్రి వివాహం జరుగుతోన్న ప్రదేశానికి పోలీసులు చేరుకుని అడ్డుకున్నారు. ఈ పెళ్లి ముందుగా హిందూ సంప్రదాయాల ప్రకారం నిర్వహించి.. తర్వాత ముస్లిం ఆచారాలతో చేపట్టేందుకు నిర్ణయించారని పోలీసులు తెలిపారు. ఇటీవల తీసుకొచ్చిన చట్టవిరుద్ధ మత మార్పిడిల నిరోధక ఆర్డినెన్స్-2020లోని సెక్షన్ 3, 8(క్లాజ్ 2) ప్రకారం వివాహాన్ని అడ్డుకున్నట్లు చెప్పారు. అయితే.. ఈ సంఘటనపై ఎలాంటి ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని తెలుస్తోంది.
కోర్టు ప్రాంగణంలోనే దాడి