1975లో అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ విధించిన అత్యవసర పరిస్థితి(ఎమర్జెన్సీ)కి వ్యతిరేకంగా పోరాడిన మహనీయులకు జోహార్లు అంటూ ట్వీట్ చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. 1975 జూన్ 25న మొదలైన అప్పటి ఎమర్జెన్సీ మార్చి 21 వరకు కొనసాగింది. అత్యవసర పరిస్థితి మొదలైన రోజుకు నేటితో 44ఏళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా ఎమర్జెన్సీని నిరసిస్తూ పోరాడిన వారిని స్మరించుకున్నారు ప్రధాని మోదీ. అందుకు సంబంధించిన వీడియోను ట్విట్టర్లో పోస్ట్ చేశారు.
" ధైర్యంగా, వీరోచితంగా ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాడిన మహానుభావులందరికీ దేశం సెల్యూట్ చేస్తోంది. రాచరిక ఆలోచనల నుంచి ప్రజాస్వామ్యాన్ని వారు విజయవంతంగా కాపాడారు"-- ప్రధాని మోదీ ట్వీట్
చీకటి రోజులు
ఎమర్జెన్సీ కాలం దేశానికి చీకటిరోజులని భాజపా కార్యనిర్వాహక అధ్యక్షుడు జేపీ నడ్డా ట్వీట్ చేశారు.
జగత్ ప్రకాశ్ నడ్డా ట్వీట్
" 1975.. ఇదే రోజు.. అధికారం కోసం ప్రజాస్వామ్యాన్ని కాంగ్రెస్ ఖూనీ చేసింది. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలకు నేతృత్వం వహించిన వేలాది భాజపా, ఆర్ఎస్ఎస్ హీరోలను దేశం కీర్తిస్తోంది" -- జేపీ నడ్డా ట్వీట్
దేశ చరిత్రలో అత్యవసర పరిస్థితి చీకటి అధ్యాయమని రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ ట్వీట్ చేశారు.
హక్కులకు విఘాతం
కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్
అత్యవసర పరిస్థితి కాలంలో పౌరుల, వార్త సంస్థల హక్కులకు తీవ్ర విఘాతం కలిగిందని గుర్తు చేశారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా.
" దేశంలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరింపజేసేందుకు ఆ సమయంలో లక్షల మంది దేశ భక్తులు పోరాడారు. ఆ సైనికులందరికీ సెల్యూట్"-- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
ఐదేళ్లుగా తీవ్ర అత్యవసర పరిస్థితి
ఎమర్జెన్సీపై మమతా బెనర్జీ కూడా ట్వీట్ చేశారు. ఐదేళ్లుగా భాజపా పాలనలో దేశంలో తీవ్ర అత్యవసర పరిస్థితి ఉందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
బంగాల్ సీఎం మమతా బెనర్జీ ట్వీట్
" ఐదేళ్లుగా దేశంలో సూపర్ ఎమర్జెన్సీ నడుస్తోంది. చరిత్ర నుంచి మనం కచ్చితంగా పాఠాలు నేర్చుకోవాలి. రాజ్యాంగబద్ధ సంస్థలను కాపాడుకునేందుకు పోరాడాలి" -- మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
కేజ్రీవాల్ పొరపాటు
దిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్
34ఏళ్ల కిందట ఎమర్జెన్సీ వల్ల దేశంలోని ప్రజాస్వామ్యంపై అతిపెద్ద దాడి జరిగిందని దిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్వీట్ చేశారు. రాజ్యంగం కల్పించిన మహోన్నత ప్రజాస్వామ్యానికి మరోసారి అలాంటి పరిస్థితులు రాకూడదని ఆకాంక్షించారు. అయితే, నేటికి ఎమర్జెన్సీ విధించి 44 ఏళ్లు కాగా, కేజ్రీవాల్ 34ఏళ్లు అంటూ ట్వీట్ చేశారు.
ఇదీ చూడండి : ఇక బాదుడే: గీత దాటితే లక్ష వరకు జరిమానా!