ఆ ఇంట్లో ప్రధాని మోదీకి నిత్యపూజలు! తమిళనాడులో ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సాయానికి కృతజ్ఞతగా కూతురి పేరు మార్చేశాడు ఓ తండ్రి. ఇంటిల్లిపాది పూజ గదిలో మోదీ చిత్రపటానికి నిత్యం పూజలు నిర్వహిస్తున్నారు.
కూతురి కోరిక..
తిరువరూర్ జిల్లా పవిత్రమానిక్కం గ్రామం, టీవీకే నగర్కు చెందిన గుణ శేఖరన్, జయంతి దంపతులకు ఇద్దరు సంతానం. కూతురు రక్షితకు చదువంటే మహా ఇష్టం. కేంద్రీయ విద్యాలయంలో చదివి పెద్దయ్యాక ఆదాయపన్ను శాఖలో అధికారి కావాలనేది ఆ చిన్నారి కల. అందుకే, తనను ప్రభుత్వ బడిలో ఒకటో తరగతిలో చేర్చి చదివిస్తున్న నాన్నకు తన కోరిక గురించి చెప్పేసింది.
రక్షిత ఉన్నత ఆశయానికి గుణశేఖర్ చలించిపోయాడు. పేదరికం అనుభవిస్తున్న తాను కూతురి కోరికను ఎలా తీర్చాలో తెలియక ఓ ప్రయత్నం చేశాడు. 2015 డిసెంబరులో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఈమెయిల్ ఐడీ వెతికిపట్టుకుని, కూతురిచేత ఓ సందేశం పంపాడు. ప్రధాని కార్యాలయం నుంచి ఎలాంటి సమాధానం రాకపోయేసరికి మరో రెండు సార్లు మెయిల్ చేశాడు. 2016 ఫిబ్రవరిలో మూడో మెయిల్కు స్పందించారు మోదీ.
ప్రధాని దేవుడు!
ఒక్క లేఖతో రక్షితకు కేంద్రీయ విద్యాలయంలో సీటు ఇప్పించారు మోదీ. అంతే కాదు, రక్షిత నుంచి నెలవారీ ఫీజులు తీసుకోవద్దని అధికారులను ఆదేశించారు. దీంతో రక్షిత కుటుంబానికి ప్రధాని దేవుడయ్యారు. పూజ గదిలో దేవుళ్లతో సమానంగా రోజూ మోదీ చిత్రపటానికీ పూజలు చేస్తారు గుణశేఖర్ కుటుంబ సభ్యులు. రక్షిత పేరుకు మోదీ పేరును కలిపి 'మోదీ రక్షిత' గా పిలుచుకుంటున్నారు.
తను కోరుకునే భవిష్యత్తుకు పునాదులు వేసిన ప్రధాని మోదీని జీవితంలో ఒక్కసారైనా కలసి కృతజ్ఞతలు చెప్పుకోవాలనుకుంటోంది రక్షిత.
'మా నాన్న కో-ఆపరేటివ్ బ్యాంకులో తాత్కాలిక ఉద్యోగి. మా అమ్మ సాధారణ టైలర్. కేంద్రీయ విద్యాలయంలో చదవాలనే నా కోరికను నాన్నకు చెప్పాను. నాన్న సలహా మేరకు ప్రధానమంత్రికి ఈమెయిల్ చేశాను. ఓ లేఖ కూడా రాశాను. రెండు నెలల తర్వాత ఆయన స్పందించినందుకు చాలా సంతోషంగా ఉన్నాను. నాలాంటి పేద విద్యార్థులు ఎందరో పెద్ద బడిలో చదువుకోవాలని కలలు కంటారు. మోదీ వారి కోరికలను కూడా తీర్చేస్తే బాగుంటుంది. '
- మోదీ రక్షిత
ఇదీ చదవండి:8 గంటలు.. 25 కిలోమీటర్ల నడక .. జవాన్ల ఉదారత