తెలంగాణ

telangana

'చైనా దురాక్రమణకు ఆయన తీరే కారణం'

By

Published : Oct 6, 2020, 12:48 PM IST

Updated : Oct 6, 2020, 1:05 PM IST

వ్యవసాయ చట్టాలు, హాథ్రస్ ఘటన, చైనా దూకుడును ప్రస్తావిస్తూ మోదీ సర్కార్​పై ధ్వజమెత్తారు రాహుల్​. భారత ఆర్థిక వ్యవస్థకు వెన్నుదన్నుగా ఉన్న చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను లాక్​డౌన్​లో ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. మరోవైపు, హాథ్రస్ బాధిత కుటుంబం ఒంటరి కాదని, తాము అండగా ఉన్నామని స్పష్టం చేశారు.

Rahul Gandhi to hold 'Kisan Bachao Yatra' in Haryana
రాహుల్ గాంధీ

వ్యవసాయ సంస్కరణల విషయంలో మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరోమారు విమర్శలు చేశారు. ఆహార భద్రతా వ్యవస్థను ధ్వంసం చేసేందుకు ఈ చట్టాలు ఓ మార్గమని ధ్వజమెత్తారు. రైతులపై ఇది దాడి చేయడమేనని అన్నారు. దేశంలోని ప్రస్తుత వ్యవసాయ విధానాన్ని ధ్వంసం చేసే 'నల్ల చట్టా'లకు వ్యతిరేకంగానే 'ఖేతీ బచావో యాత్ర' చేపట్టినట్లు తెలిపారు.

పంజాబ్​ పాటియాలాలో మీడియా సమావేశంలో మాట్లాడిన రాహుల్.. లాక్​డౌన్​లో చిన్న, మధ్య స్థాయి వ్యాపారాలను ప్రభుత్వం నాశనం చేసిందని ఆరోపించారు. భారత ఆర్థిక వ్యవస్థ, ఉద్యోగ కల్పనకు ఈ వ్యాపారాలే వెన్నుదన్నుగా ఉన్నాయని అన్నారు. కరోనా కాలంలోనూ వ్యాపారులు, కార్మికులకు కేంద్రం ఆపన్నహస్తం అందించలేదని మండిపడ్డారు. ఫిబ్రవరిలోనే కొవిడ్ గురించి హెచ్చరించానని, కానీ.. తన వ్యాఖ్యలను హాస్యాస్పదంగా భావించారని చెప్పుకొచ్చారు.

సరిహద్దులో చైనా దూకుడు నేపథ్యంలో మోదీ లక్ష్యంగా విమర్శలు కురిపించారు రాహుల్.

"చైనా మన భూభాగాన్ని ఎందుకు ఆక్రమించుకోగలుగుతుందో తెలుసా? ఎందుకంటే భారత్​కు నాయకత్వం వహిస్తున్న వ్యక్తి తన ప్రతిష్ఠ గురించి మాత్రమే పట్టించుకుంటారని చైనాకు తెలుసు."

-రాహుల్ గాంధీ, కాంగ్రెస్ నేత

హాథ్రస్ అత్యాచార బాధిత కుటుంబం ఒంటరి కాదని, వారికి తాము అండగా ఉన్నామని పేర్కొన్నారు రాహుల్. కుటుంబం మొత్తాన్ని ఉత్తర్​ప్రదేశ్ యంత్రాంగం లక్ష్యంగా చేసుకొందని ఆరోపించారు. దీనిపై ప్రధానమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని విమర్శించారు.

Last Updated : Oct 6, 2020, 1:05 PM IST

ABOUT THE AUTHOR

...view details