తెలంగాణ

telangana

రామాలయం భూమిపూజ- 10 కీలకాంశాలు

By

Published : Aug 5, 2020, 8:30 AM IST

రామమందిర శంకుస్థాపన కోసం అయోధ్య సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ప్రధాని రాకకోసం అయోధ్య వాసులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అధికారులు కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాట్లు చేశారు. మరి చారిత్రక నగరంలో ప్రస్తుతం పరిస్థితులు ఎలా ఉన్నాయి? శంకుస్థాపన మహోత్సవం ఎలా సాగనుంది?

Pm Modi to lay foundation stone for Ram Mandir in Ayodhya, All you need to know about the event
శోభాయమానంగా అయోధ్య వీధులు.. మోదీ కోసం ఎదురుచూపులు

అయోధ్యలో రామమందిర నిర్మాణం భూమిపూజ కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ సభ్యులు. రామ జన్మభూమిలో జరగనున్న శంకుస్థాపన మహోత్సవానికి సంబంధించి మీరు తెలుసుకోవాల్సిన ముఖ్యాంశాలు ఇవే...

  • రామమందిర భూమిపూజకు అయోధ్య సర్వం సిద్ధమైంది. చారిత్రక నగరంలో పండుగ వాతావరణం నెలకొంది. ఆలయాలు, రహదారులు సహా అడుగడుగునా శోభాయమానంగా తీర్చిదిద్దారు. గోడలకు కొత్త పెయింట్లు వేశారు.
  • ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఉదయం 11:30 గంటలకు అయోధ్యకు చేరుకుంటారు. అక్కడి నుంచి హనుమాన్​గఢీకి వెళతారు. అంజన్నకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అక్కడే దాదాపు 7 నిమిషాల పాటు ఉండి రామ జన్మభూమి ప్రాంగణానికి బయలుదేరుతారు.
  • మధ్యాహ్నం 12గంటల 15నిమిషాల 15సెకన్లకు మొదలుపెట్టి 32 సెకన్లలో భూమిపూజలోని కీలక క్రతువు ముగుస్తుంది. గర్భగుడిలో 40 కిలోల వెండి ఇటుకను స్థాపించి.. ఆలయ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయనున్నారు మోదీ.
  • కరోనా వైరస్​ నేపథ్యంలో అతిథుల జాబితాను కుదించారు. కేవలం 175మంది మాత్రమే ఈ వేడుకల్లో పాల్గొంటారు. ఇప్పటికే వీరందరికీ అహ్వానాలు అందాయి. భాజపా అగ్ర నేతలు ఎల్​కే అడ్వాణీ, మనోహర్​ జోషీ వీడియో కాన్ఫరెన్స్​ ద్వారా వేడుకలో పాల్గొననున్నారు.
  • శంకుస్థాపన సమయంలో ప్రధాని మోదీతో పాటు ఐదుగురు మాత్రమే ఉంటారు.
  • మిగిలిన వారెవ్వరూ అయోధ్యకు రావద్దని శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్​ స్పష్టం చేసింది. తమ ఇళ్ల నుంచే వేడుకలు జరుపుకోవాలని సూచించింది. దూరదర్శన్​లో కార్యక్రమం మొత్తం ప్రత్యక్ష ప్రసారం కానుంది. అయోధ్య, ఫైజాబాద్‌లో ఎల్‌ఈడీ తెరలను, శంకుస్థాపన అనంతరం ప్రధాని ప్రసంగాన్ని వినేందుకు లౌడ్‌ స్పీకర్లను ఏర్పాటు చేశారు .
  • రామమందిర శంకుస్థాపన మహోత్సవం సందర్భంగా అయోధ్యలో అధికారులు కట్టుదిట్ట భద్రతను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడ బారికేడ్లు ఏర్పాటు చేసి తనిఖీలు చేపడుతున్నారు. బయటివారిని నగరంలోకి అనుమతించమని తేల్చిచెప్పారు. మిగిలిన వారి వివరాలను మొబైల్​ నెంబర్​తో సహా నమోదు చేస్తున్నారు. గుంపులో నలుగురు మించి ఎక్కువ మంది ఉండకూడదని స్పష్టంచేశారు.
  • ఆలయ నిర్మాణంలో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. ఆలయాన్ని 161 అడుగుల ఎత్తులో నిర్మించనున్నారు. మొత్తం 69 ఎకరాల్లో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా 5 గోపురాలతో కడుతున్నారు.
  • ఆలయ నిర్మాణానికి రూ .300 కోట్ల వ్యయం అవుతుందని అంచనా. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న 20 ఎకరాల భూమి అభివృద్ధికి రూ .1,000 కోట్లు అవసరం కానుంది.
  • మూడున్నరేళ్లలో ఆలయాన్ని నిర్మించాలని ట్రస్ట్​ భావిస్తోంది.

ABOUT THE AUTHOR

...view details